
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అధికారం కోల్పోయి రోజులు గడవక ముందే.. మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ ఎంపీలు వీడతారంటూ ఆందోళనల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందునా.. షిండే వర్గం వైపు శివసేన ఎంపీలు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాక్రే టీంలోని లోక్సభ ఎంపీ రాహుల్షివాలే.. మంగళవారం రాత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. గిరిజన మూలాలు ఉన్న ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ కోరారు. ఆపై షిండే శిబిరంలోని ఓ ఎమ్మెల్యే.. శివసేనకు ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలలో 12 మంది తమ గూటికే వస్తారంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఈ తరుణంలో పార్టీకి కొత్త చీఫ్ విప్ను ఎన్నుకున్నారు.
ఈ మేరకు శివసేన పార్లమెంటరీ నేత సంజయ్ రౌత్.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహాద్ జోషికి ఓ లేఖ రాశారు. లోక్సభ ఎంపీ రాజన్ విచారేను పార్టీ చీఫ్ విప్గా ఎన్నుకుంటున్నట్లు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఎంపీ భావనా గవాలి స్థానంలో రాజన్ విచారేను ఎన్నుకున్నట్లు, తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని లేఖలో రౌత్ స్పష్టం చేశారు.
భావనా గవాలి.. యావత్మల్-వాషిమ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. షిండే శిబిరంలో గవాలి ఉండడంతో ఉద్దవ్ థాక్రే టీం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment