
అల్లం సాగుకు.. వేసవి అనుకూలం
విత్తనం.. రకాలు
మారన్, సుపభ్ర, సురుచి, సురభి, వైనాడ్, నదియా, రియోడిజనీరో రకాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. జహీరాబాద్ ప్రాంత రైతులు అధికశాతం మంది మారన్ రకం పండిస్తున్నారు. ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. విత్తనం పొడుగు 4.5 సె.మీ,30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులుండాలి. విత్తన దుంపలు 10 రోజుల ముందు నుంచి 24 గంటలు నానబెట్టడం వల్ల మొలక శాతం పెరుగుతుంది. 500 గ్రాముల ఎం45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. అల్లం విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజుల పాటు ఆరబెట్టాలి. ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం.
● పెట్టుబడి వ్యయం అధికం
● ధర కలిసివస్తే లాభాలు ఘనం
● జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి
జహీరాబాద్ టౌన్: అల్లం.. సుగంధ ద్రవ్యపు పంట. సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవటంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అన్ని కాలాల్లో డిమాండ్ ఉండడం.. మద్దతు ధర లభించడం వల్ల కూడా రైతుల దృష్టి ఆకర్షిస్తుంది. సారవంతమైన ఎర్రనేలల్లో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్లరేగడిలో కూడా పండుతుంది. అల్లం పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి లక్షవరకు ఖర్చవుతుంది. దిగుబడి కూడా అదేస్థాయిలో వస్తుంది. ధర కలిసొస్తే గిట్టుబాటవుతుంది. ఏప్రిల్ రెండవవారం నుంచి మే నెల రెండవ వారం వరకు అల్లం సాగుకు అనుకూలం. 20 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అల్లం పంటను రైతులు సాగుచేస్తున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటసాగవుతుంది. ఎనిమిది నెలల్లో చేతికొచ్చె అల్లంను సేంద్రియ ఎరువులతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు.
నేలలు.. వాతావరణం
ఎర్రనేలలు, గరపనేలలు చెల్క భూములు అల్లం పంట సాగుకు అనుకూలం. నీరు నిలిచే భూములు పనికిరావు. నీడ ఉన్న ప్రదేశాల్లో కూడా పంట పండుతుంది. వర్షపాతం 700 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు విత్తుకోచ్చు.
సాగు విధానం
పొలాన్ని లోతు వరకు దున్ని దుక్కిచేసుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ)ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ పాస్పెట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్పై వేయాలి. బెడ్ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. క్రమం తప్పకుండా నీటి తడులను పెడుతుండాలి. డ్రిప్ విధానం చాలా మంచిది. సాగు చేసే నీరు, వర్షం నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 500 నుంచి 800 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలను 10 నుంచి 24 గంటలు నానాబెట్టడం వల్ల మొలకల శాతం పెరగుతుంది.
యాజమాన్య పద్ధతులు
‘విత్తనం నాటిని 25–40 రోజుల తర్వాత 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెటే ఆఫ్ పొటాష్, లేదా 3 కిలోల అమోనియా సల్ఫేట్. 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, 1 గ్రామం మిరెట్ ఆఫ్ పోటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. 40–100 రోజుల వ్యవధిలో 54 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, 1 గ్రామం మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి ప్రతి రోజు రెండు నెలల పాటు పంటకు అందించాలి. 100–150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. 150–180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ 1 గ్రామం వేయాలి.
తెగులు నివారణ
రైజోమ్వాట్ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే తెగులు సోకుతే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరెడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్ తెగుల కారణంగా ఆకులపై చిన్నచిన్న మచ్చాలు ఏర్పడుతాయి.

అల్లం సాగుకు.. వేసవి అనుకూలం