
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్తోనే ఫామ్లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.
విషయం ఏంటంటే.. శుభ్మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్పై ఆగ్రహం తెప్పించింది.
గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.
కాగా, బ్యాటింగ్లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment