
పెర్త్ టెస్ట్లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 201 పరుగులు జోడించారు.
ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డు గతంలో సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ పేరిట ఉండేది. వీరిద్దరు 1986 సిడ్నీ టెస్ట్లో తొలి వికెట్కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన భారత ఓపెనింగ్ జోడీలు..
కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ (201 పరుగులు)
సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ (191)
సునీల్ గవాస్కర్-చేతర్ చౌహాన్ (165)
కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్దత్ పడిక్కల్ (17) క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్-150 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్-104 ఆలౌట్
సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన యశస్వి
ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వికి ఆసీస్ గడ్డపై ఇది తొలి టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి దిగ్గజాల సరసన చేరాడు. తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి తమ తొలి ఆసీస్ పర్యటనలోనే సెంచరీలు సాధించారు.

Comments
Please login to add a commentAdd a comment