![IND VS ENG 4th Test: Joe Root Ranks As The Joint Fourth Fastest Player To Reach 19000 International Runs In Terms Of Innings - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/23/Untitled-7.jpg.webp?itok=p5MMz0ti)
రాంచీ టెస్ట్లో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కిన జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 19000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రూట్ 19000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 444 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం 444 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ మైలురాయిని విరాట్ కోహ్లి అందరికంటే వేగంగా చేరుకున్నాడు. కోహ్లి 399 ఇన్నింగ్స్ల్లోనే ఈ ల్యాండ్మార్క్ను రీచ్ అయ్యాడు.కోహ్లి తర్వాత సచిన్ టెండూల్కర్ (432), బ్రియాన్ లారా (433) అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వారిలో ఉన్నారు.
రాంచీ టెస్ట్లో సెంచరీతో రూట్ చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ల్లో 31వ సెంచరీ, ఓవరాల్గా (అన్ని ఫార్మాట్లలో) 47 సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు.
తాజా సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment