కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్‌ చిత్తు | India vs Pakistan: India beat Pakistan by 6 wickets | Sakshi
Sakshi News home page

కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్‌ చిత్తు

Published Mon, Feb 24 2025 2:51 AM | Last Updated on Mon, Feb 24 2025 4:03 AM

India vs Pakistan: India beat Pakistan by 6 wickets

‘చాంపియన్స్‌’ పోరులో భారత్‌ ఘన విజయం

6 వికెట్లతో పాకిస్తాన్‌ చిత్తు

విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీ

దాదాపు సెమీస్‌ చేరిన టీమిండియా

దాయాదిపై విరాట్‌ విజయం 

కీలకపోరులో పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం.. విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీ

విశ్వవ్యాప్త ప్రేక్షకులు... ఇరు దేశాల అభిమానులు... క్రికెట్‌ విశ్లేషకులు... విమర్శకులు... దిగ్గజాలు... పలు రంగాల ప్రముఖులు...

ఇలా యావత్‌  ప్రపంచాన్నిఆకర్షించిన మ్యాచ్‌లో టీమిండియా దంచేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌పై అలవోక విజయంతో
సెమీఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.

ఇంట (పాక్‌లో) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో... దుబాయ్‌లో జరిగిన పోరులో భారత్‌ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్‌.. గ్రూప్‌ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్‌ను లాక్కెళ్లిన పాక్‌ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. 

అసలు కప్‌ రేసులో పడకముందే లీగ్‌ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్‌ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్‌ 3 వికెట్లు, హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. 

సులువైన విజయం ముంగిట విరాట్‌ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్‌ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్‌ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది. భారత్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.    

భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌ టీమ్‌కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్‌లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్‌ ఈవెంట్‌గా మారిన భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్‌ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్‌ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.

పిచ్‌ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్‌ బ్యాటింగ్‌ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్‌ అలవోకగా దూసుకుపోయింది... పాక్‌ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్‌ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.

ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్‌ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్‌తో భారత్‌ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్‌ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్‌ పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది.  

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ దాదాపుగా సెమీఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్‌ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్‌ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 

సౌద్‌ షకీల్‌ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్‌దిల్‌ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్‌ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్‌ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్‌మన్‌ గిల్‌ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్‌ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.  

షకీల్‌ అర్ధ సెంచరీ... 
షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్‌తో పాక్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్‌లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్‌ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్‌ ఆజమ్‌ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్‌డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. 

అయితే బాబర్‌ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్‌ ఫీల్డింగ్‌కు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో  పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.

హార్దిక్‌ పాండ్యా చక్కటి స్పెల్‌ (6–0–18–1)తో పాక్‌ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్‌ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్‌ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అక్షర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయే క్రమంలో రిజ్వాన్‌ బౌల్డ్‌ కావడంతో 104 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్‌ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్‌ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్‌దిల్‌ కాస్త వేగంగా ఆడటంతో పాక్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

శతక భాగస్వామ్యం... 
స్వల్ప లక్ష్యమే అయినా భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్‌ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌), గిల్‌ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్‌ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్‌ను క్లీన్‌»ౌల్డ్‌ చేయడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. 

ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్‌ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్‌ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్‌ పార్ట్‌నర్‌íÙప్‌ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.

వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్‌ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ను షకీల్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 

అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్‌... 19 పరుగుల దూరంలో హార్దిక్‌ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్‌ పటేల్‌ (3 నాటౌట్‌)తో కలిసి కోహ్లి మ్యాచ్‌ ముగించాడు.  

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమామ్‌ (రనౌట్‌) 10; బాబర్‌ (సి) రాహుల్‌ (బి) పాండ్యా 23; షకీల్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 62; రిజ్వాన్‌ (బి) అక్షర్‌ 46; సల్మాన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 19; తాహిర్‌ (బి) జడేజా 4; ఖుష్‌దిల్‌ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 0; నసీమ్‌ (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ 14; రవూఫ్‌ (రనౌట్‌) 8; అబ్రార్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్‌: షమీ 8–0–43–0, హర్షిత్‌ రాణా 7.4–0–30–1, హార్దిక్‌ పాండ్యా 8–0–31 –2, అక్షర్‌ పటేల్‌ 10–0–49–1, కుల్దీప్‌ యాదవ్‌ 9–0–40–3, జడేజా 7–0–40–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) షాహిన్‌ అఫ్రిది 20; గిల్‌ (బి) అబ్రార్‌ 46; విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 100; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) ఇమామ్‌ (బి) ఖుష్‌దిల్‌ 56; పాండ్యా (సి) రిజ్వాన్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 8; అక్షర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్‌: అఫ్రిది 8–0–74–2, నసీమ్‌ షా 8–0–37–0, హారిస్‌ రవూఫ్‌ 7–0–52–0, అబ్రార్‌ 10–0–28–1, ఖుష్‌దిల్‌ 7.3–0–43–1, సల్మాన్‌ 2–0–10–0.

సెంచరీ నంబర్‌ 82
లక్ష్య ఛేదనలో భారత్‌ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది...36 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్‌ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి. 

కానీ మరో వైపు అయ్యర్, పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్‌ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్‌ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు! పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. 

ఈ సమయంలో అక్షర్‌ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్‌ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతికి ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా ఫోర్‌ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్‌ గెలుపు పూర్తయ్యాయి. విరాట్‌ స్థాయి దిగ్గజానికి శతకాలు కొత్త కాదు. కానీ పెర్త్‌లో సెంచరీ తర్వాత అతని బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. 

తర్వాతి నాలుగు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో పాటు రంజీ మ్యాచ్‌లో కూడా నిరాశపర్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఒక హాఫ్‌ సెంచరీ చేసినా బంగ్లాతో మ్యాచ్‌లో మళ్లీ విఫలం. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్‌ లాంటి జట్టుపై చేసిన సెంచరీ ఎంతో కీలకమైంది. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సచిన్‌ ‘100’ సెంచరీల మైలురాయికి మరింత చేరువ చేసింది.  

14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్‌ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్‌ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.

158 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా అజహరుద్దీన్‌ (156) రికార్డును అతను అధిగమించాడు.  

82 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి.  

సెమీస్‌ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్‌ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. ఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం. 

ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్‌ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్‌ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న  నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం. –విరాట్‌ కోహ్లి    

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
న్యూజిలాండ్‌ X బంగ్లాదేశ్‌
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement