Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌?! | Sakshi
Sakshi News home page

Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా..

Published Wed, May 22 2024 5:43 PM

No Security Threat: RCB Practice Session Cancelled due to This Reason: Report

ఐపీఎల్‌-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్‌నకు దూసుకువచ్చింది. లీగ్‌ దశలో వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్‌-4లో స్థానం సంపాదించింది.

ఆరు మ్యాచ్‌లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్‌ రాయల్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది.  ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్‌ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్‌ బజార్ పత్రిక‌, హిందుస్థాన్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

అతడు జాతీయ నిధి
ఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్‌ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్‌ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.

వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్‌ రాయల్స్‌కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్‌ చేశారు’’ అని పోలీస్‌ అధికారి విజయ్‌ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ తెలిపింది.

ఈ క్రమంలోనే గుజరాత్‌ కాలేజీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ సెషన్‌తో పాటు ప్రీ- ప్రెస్‌మీట్‌ను కూడా క్యాన్సిల్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.

భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే
‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్‌ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్‌ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!

చదవండి: RR vs RCB: వార్‌ వన్‌సైడ్‌.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
 

Advertisement
 
Advertisement
 
Advertisement