IPL 2024: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..! | Sakshi
Sakshi News home page

IPL 2024 RR VS RCB: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..!

Published Sun, Apr 7 2024 1:17 PM

IPL 2024: Fans Defending Virat Kohli On Slow Batting Row In A Match Vs Rajasthan Royals - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో  ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్‌; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇదే మొదటి సెంచరీ. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై సెంచరీ చేసేందుకు విరాట్‌ చాలా కష్టపడ్డాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విరాట్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడాలని భావిస్తే.. అది కాస్త మిస్‌ ఫైర్‌ అయ్యింది.

విరాట్‌ సెంచరీ కోసం నిదానంగా ఆడాడంటూ గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కోసం నిస్వార్దంగా బ్యాటింగ్‌ చేసి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కోహ్లి అభిమానులు  రంగంలోకి దిగారు. తమ ఆరాధ్య ఆటగాడిని టార్గెట్‌ చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. 

18 మ్యాచ్‌లు అయినా ఒక్కరు కూడా సాధించలేకపోతే విరాట్‌ సీజన్‌ తొలి సెంచరీ చేసి చూపించాడని, ఇది తమ ఆరాధ్య ఆటగాడి లెవెల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లోగా బ్యాటింగ్‌ చేశాడని కామెంట్లు చూసే​ ముందు విరాట్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో పిచ్‌ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌ జరిగిన పిచ్‌పై 183 పరుగుల స్కోర్‌ డిఫెండ్‌ చేసుకోదగిందే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు.

అయినా ఎంత కాలమని విరాట్‌ ఒక్కడు ఆర్సీబీ బండిని లాక్కొస్తాడని తమ ఆరాధ్య ఆటగాడిని ఆకాశానికెత్తుతున్నారు. ఈ సీజన్‌లో అ‍ప్పటివరకు ఎవరి వల్ల కాని సెంచరీని చేసి చూపించినా చెత్త కామెంట్లేనా అని మండిపడుతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సహకరిస్తే కోహ్లి వ్యక్తిగతంగా చేసిన స్కోర్‌తోనే (113) మ్యాచ్‌లు గెలవొచ్చంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు.

గిట్టని వారు చెబుతున్నట్లు విరాట్‌ ఇన్నింగ్స్‌ మరీ అంత నెమ్మదిగా ఏమీ సాగలేదని.. చెత్త బంతులను ప్రతి సందర్భంలోనూ విరాట్‌ చీల్చిచెండాడని గుర్తు చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్‌ చేసినందుకు అశ్విన్‌, చహల్‌లకు, సూపర్‌ సెంచరీ చేసినందుకు బట్లర్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సింది పోయి విరాట్‌ను టార్గెట్‌ చేయడం విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ సెంచరీతో కదంతొక్కినా ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో జోస్‌ బట్లర్‌ మెరుపు వేగంతో సెంచరీ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి రాయల్స్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ విరాట్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (44) రాణించాడు.

విరాట్‌ తన సెంచరీని 67 బంతుల్లో సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్‌ సెంచరీగా రికార్డైంది. అశ్విన్‌ (4-0-28-0), చహల్‌ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయండతో విరాట్‌ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ విషయాన్ని కోహ్లి సైతం అంగీకరించాడు. 

అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. బట్లర్‌ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.  

Advertisement
Advertisement