ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.
షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.
ప్రణాళికలు సిద్ధం
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.
తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.
వారికి చోటు ఉందా?
ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది.
గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


