
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో అతను హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆ తరువాత రోహిత్ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. అయితే రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని స్లిప్లో ఫీల్డింగ్ చేయడానికి ఓ కారణం ఉంది.
ఇషాంత్ శర్మ బౌలింగ్లో జో రూట్ డిఫెన్స్ ఆడుతున్న సందర్భంలో బంతి గాల్లోకి లేచి రోహిత్కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇది చూసి భారత క్రికెటర్లతో సహా గ్రౌండ్లో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. రోహిత్ ఇలా చేయడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్లకు చెరో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment