Photo Credit: BCCI Twitter
బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సిరీస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి బీసీబీ ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుపుతుందని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.
వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే టీమిండియా.. బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉండగా, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా వేశారు. ఢాకా, చట్టోగ్రామ్ వేదికలుగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుందని బీసీబీ ఈ ఏడాది జనవరిలో ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ సిరీస్పై బీసీసీఐ మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు బీసీబీ మాత్రం టీమిండియాతో సిరీస్ నిర్వహణకు సిద్దమైనట్లు తెలిపింది. పర్యటనలో భాగంగా ఆగస్టు 28న బంగ్లాదేశ్లో అడుగుపెట్టనున్న భారత్ సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో మూడు వన్డేలు, సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సిరీస్కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండగా, అసలు సిరీస్ జరుగుతుందా? లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఇదే విషయమై తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. "టీమిండియాతో సిరీస్ గురించి ఇరు బోర్డులు ఇంకా చర్చలు జరుపుతున్నాయి. టోర్నీ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అయితే షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. టోర్నీ మొత్తం మీర్పూర్ వేదికగా జరగాలని నిర్ణయిస్తే మాత్రం వేదికను బసుంధర గ్రౌండ్కు మారుస్తాం. సిరీస్ నిర్వహణపై అధికారిక ప్రకటన వస్తే దానికి అనుగుణంగా షెడ్యూల్ను ప్లాన్ చేస్తాము’’ అని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది జనవరిలో బీసీబీ భారత పర్యటనను అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా, కేకేఆర్ బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను తప్పించడంతో రెండు క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తదనంతరం, అమీనుల్ ఇస్లాం నేతృత్వంలోని బీసీబీ, భారత్ సహ-ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్కు తమ జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఇటీవల బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ ఈ నెల ప్రారంభంలో భారత్ను సందర్శించిన తర్వాత రెండు బోర్డుల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగయ్యాయి.


