
PC: BCCI/IPL.com
టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ఒకే వేదికలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 83 పరుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి ఇప్పటివరకు 3,276 టీ20 రన్స్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట ఉండేది. మీర్పూర్ వేదికగా అతడు ఇప్పటివరకు 3,239 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ముష్ఫికర్ వరల్డ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు.
ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్, బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment