
పచ్చనేతల ‘బరి’ తెగింపు
సాక్షి, టాస్క్ఫోర్స్: కావలి మండలం చెన్నాయపాళెంలో అధికార పార్టీ నేతలు పక్కాగా కోడి పందేల బరిని, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బెట్టింగ్లు నిర్వహించారు. కోడి పందేలు వీక్షించేందుకు రెండు వరుసల్లో గ్యాలరీలు పెట్టి, టికెట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. బరికి ఆనుకుని ఉండే వరుసలో రూ.1,000 కాగా, ఆ తర్వాత వరుసకు రూ.700 టికెట్ ధరలుగా నిర్ణయించారు. బిర్యానీలు, ఇతరాలు అమ్మకాలు చేసేందుకు కొంత నగదు తీసుకుని అనుమతులిచ్చా రు. బరికి సమీపంలోనే మద్యం విక్రయాలు సిద్ధం చేశారు. చెన్నాయపాళెం ఎస్సీ కాలనీ సమీపంలో పుచ్చ తోటల్లో ఈ ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు నిర్వహించారు. నిర్వాహ కుల మధ్య వివాదాలు రావడం, పోలీసులు హడావుడి చేయడంతో నిలిపి వేశారు. చెన్నాయపాళెం నుంచి పెద్దపట్టపుపాళెం రోడ్డు మీదుగా కోడి పందేల బరికి చేరుకునే విధంగా రోడ్డు వసతి ఉండే విధంగా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ జూద క్రీడల హడావుడి జరిగినా కనీసం పోలీసులకు సమాచారం లేదంటే నమ్మశక్యంగా కూడా లేదు.
కోడి పందేలు బరి..
ప్రచారం మాత్రం క్యాసినో
నిర్వాహకులు జూదగాళ్ల జేబులు ఖాళీ చేసి, తమ జేబులు నింపుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. కోడి పందేల కోసమే ఒక బరిని సిద్ధం చేశారు. దీంతో పాటు పేక ముక్కలతో ఆడే వివిధ రకాల ఆటల్లో పాల్గొనే జూదగాళ్ల కోసం‘క్యాసినో’ నిర్వహిస్తున్నట్లు అంతర్గత ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లు చెన్నాయపాళెంకు చేరు కున్నాయి. కోడి పందేలు చూసేందుకు ప్రేక్షకులు బరి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ విధంగా మూడు రోజులు ఈ జూద క్రీడలు నిర్వహించారు. పోలీసుల రాకతో నిలిపేశారు.
రాబడి పంపకాల్లో విభేదాలు
నిర్వాహకులకు భారీగానే రాబడి కూడా వచ్చింది. దీంతో పంపకాల విషయంలో వారి మధ్య గురువారం విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని నిర్వాహకుల్లో వారిలో వారే గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో ఉదయం 8.30 గంటలకు ఒక పోస్టు పెట్టారు. ఈ సమాచారం పోలీసులకు చేరింది. కావలిరూరల్ ఎస్ఐ బాజీబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్న నిర్వాహకులు, జూదగాళ్లు పొలాల్లో ఎటు పడితే అటు పరుగులెత్తి తప్పించుకున్నారు.
పుచ్చ రైతులు అభ్యంతరం చెప్పినా..
ఇదిలా ఉండగా కోడి పందేలు వేయడానికి సిద్ధం చేసిన బరి పుచ్చ తోటలో ఉండడంతో ఆ పంట సాగు చేసిన రైతులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో తమ పుచ్చ తోటలోకి జనాలు రాకపోకలు సాగిస్తే పుచ్చతోట ధ్వంసం అవుతుందని రైతులు కోడి పందేల నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు ఖాతరు చేయలేదు. పంట కాలువపై సెంట్రింగ్ రేకులతో కాలిబాట వేసి జూదగాళ్లు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పుచ్చతోటలు ధ్వంసం అయ్యాయి.
బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు
కోడి పందేలు బరి, పేక ముక్కలతో వివిధ రకాల ఆటలు కోసం సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మూడు రోజులు అక్కడ జూద క్రీడలు జరిగినా పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీల ప్రాపకం కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చకెక్కినా నిర్వాహకులపై కేసు నమోదు చేయకపోగా, నిర్వాహకుల చేతిలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్లుగా తెలిసింది. ఆస్పత్రిలో ఉన్న బాధితుల కేసు మెడికో లీగల్ కేసు అవుతుంది కాబట్టి, కౌంటర్ కేసుగా ముందస్తుగానే పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలు ‘బరి’ తెగించారు. జిల్లాలోని కావలి మండలం చెన్నాయపాళెం వద్ద చట్ట విరుద్ధంగా పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రేక్షకుల కోసం రెండు వరుసల్లో గ్యాలరీలు ఏర్పాటు చేసి టికెట్లు వసూలు చేశారు. సుమారు వెయ్యి మంది వీక్షకులు కూర్చొని చూసే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే బిర్యానీలు, ఇతర తినుబండారాలు అమ్ముకునేందుకు ‘వేలం’ పెట్టారు. గత మూడు రోజుల పాటు జరిగినా.. ఒక్క పోలీస్ కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకుల మధ్య తలెత్తిన పంపకాల్లో విభేదాల నేపథ్యంలో వారిలో వారే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి హడావుడి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఓ కుటుంబం సమాచారం అందించినట్లు అనుమానించి వారిపై దాడికి తెగబడ్డారు.
పక్కాగా కోడి పందేలు,
పేకాట బరులు
నిర్వాహకుల మధ్య పంపకాల్లో
విభేదాలు
వారిలో వారే పోలీసులకు సమాచారం
ఖాకీల రాకతో నిర్వాహకులు,
పందెం రాయుళ్లు పలాయనం
అనుమానంతో ఒక కుటుంబంపై దాడి

పచ్చనేతల ‘బరి’ తెగింపు

పచ్చనేతల ‘బరి’ తెగింపు
Comments
Please login to add a commentAdd a comment