బీఈడీకి పూర్వ వైభవం!
మంచి నిర్ణయం..
డిగ్రీ ఫైనలియర్ 5వ సెమిస్టర్ పూర్తయ్యింది. ఇంటర్న్షిప్ అవుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో బీఈడీలో చేరుతా. మా బ్యాచ్తో ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సు మొదలైతే చాలా సంతోషమే. రెండేళ్లు క్యాలవ్యవధి అంటే సమయం ఎక్కువ.
– టి.శృతి, డిగ్రీ విద్యార్థిని,
శ్రీహరిపురం, ఆమదాలవలస
రెండేళ్లపై నిరాసక్తత..
ప్రస్తుత పోటీప్రపంచంలో ఎక్కువ కాలవ్యవధితో కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సు తీసుకొస్తే మంచిదే. బీఈడీ కాలేజీలు సైతం పూర్వవైభవం సంతరించుకుంటాయి.
– డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్) శ్రీకాకుళం
● దాదాపు దశాబ్దం తర్వాత ఏడాది కాలవ్యవధికి మార్పు!
● వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాది వ్యవధితో కోర్సు
● ఎన్సీఈటీ కీలక నిర్ణయం
● రెండేళ్ల బీఈడీ కోర్సులకు
ఆదరణ కరువు
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంలో, రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్గా భావించే శ్రీకాకుళం విద్యార్థులకు తీపికబురు. దశాబ్దకాలం నుంచి రెండేళ్ల వ్యవధితో కొనసాగుతున్న బీఈడీ కోర్సు ఇకపై ఏడాది వ్యవధితో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. పూర్వ మాదిరిగానే ఏడాది వ్యవధితో ఈ కోర్సును అందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రంగం సిద్ధం చేసింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచే.. ఒకవేళ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగితే 2026–27 నుంచి ఏడాది వ్యవధితో కూడిన బీఈడీ కోర్సును అందుబాటులో తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరోపక్క ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సులు మొదలైతే సంతోషమేనని బీఈడీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు ఎనలేని డిమాండ్..
రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు బీఈడీ కోర్సులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సీట్లు దొరక్క తిప్పలు పడేవారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు చేసినవారూ లేకపోలేదు. మేనేజ్మెంట్ కోటా కింద వేలాది రూపాయలు వెచ్చించి కోర్సులు పూర్తిచేశారు. అయితే 2015–16 నుంచి రెండేళ్ల కాలవ్యవధితో బీఈడీ కోర్సులను తీసుకురావడంతో క్రమేపీ ఆదరణ కరువైంది. దీనికితోడు ప్రస్తుతం సెమిస్టర్స్ విధానం తీసుకురావడం, విపరీతమైన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం, టీచర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వంటి కారణాలతో బీఈడీ కనుమరుగైన పరిస్థితి దాపురిచింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ఏయూ అనుబంధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 14 బీఈడీ కాలేజీలు ఉండగా అందులో 880 మంది వరకు చదువుతున్నారు.
ఎన్సీటీఈ కీలక నిర్ణయం..
దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్్సీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేక రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే ఏడాది వ్యవధి బీఈడీ వర్తించనుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్..
జనవరి 11న ఎన్సీటీఈ టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో బీఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం చేసింది. ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బీఏ–బీఈడీ, బీకామ్–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను సైతం ఏడాది బీఈడీ ప్రోగ్రాంతో డిగ్రీ కోర్సులను డిజైన్ చేసేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి.
బీఈడీకి పూర్వ వైభవం!
బీఈడీకి పూర్వ వైభవం!
Comments
Please login to add a commentAdd a comment