గోదావరి–కావేరి లింక్‌కు సై! | Central Minister Gajendra Singh Shekhawat Gives Clarity On Interlinking Of Rivers | Sakshi
Sakshi News home page

గోదావరి–కావేరి లింక్‌కు సై!

Published Wed, Dec 14 2022 1:21 AM | Last Updated on Wed, Dec 14 2022 11:02 AM

Central Minister Gajendra Singh Shekhawat Gives Clarity On Interlinking Of Rivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి నదుల అను­సంధానం పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. తొలిద­శలో 141 టీఎంసీలు, రెండోదశలో మరో 236 టీ­ఎంసీ­లు కలిపి మొత్తం 377 టీఎంసీలను తరలి­స్తామని వెల్లడించారు. గోదావరి జలాల్లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వాడుకోని వాటానే తొలిదశలో తరలిస్తామని, మహానది–కావేరి అనుసంధానం పూర్తైన తర్వాత దాని ద్వారా వచ్చే జలాలను రెండోదశలో తరలిస్తామని వెల్లడించారు.

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో న­దు­ల అను­సంధానంపై ఆయ­న మాట్లాడారు. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్యప్రసాద్‌ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధాన ప్రక్రి­య ప్రారంభమైందని, దీనిని ప్రధాని న­రేం­ద్ర మో­దీ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

అందులో భా­గంగానే కెన్‌–బెట్వా అనుసంధానాన్ని చేప­ట్టామని గజేంద్రసింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నదుల అనుసంధానంపై రాష్ట్రాల అనుమానాలు తొలిగిపోతాయని చెప్పా­రు. దేశవ్యాప్తంగా 30 నదు­ల అనుసంధానం ప్రతిపాదనలున్నాయని తెలిపా­రు. గో­దావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల స­మ్మ­తి కోసం ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహిం­చినట్టు తెలిపారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు సైతం కేటాయించినట్టు గుర్తుచేశారు.

మహానది–గోదావరి అనుసంధానం జరపాలి 
ముందుగా మహానది–గోదావరి  ఆ తర్వాత గోదావరి–కావేరి నదు­ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని తెలంగా­ణ స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాల లభ్యతలేదని నిర్ధారించిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌ అను­మతి లేకుండా ఆ రాష్ట్రం వాడుకోని వాటాను ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ నుంచి గోదా­వరి–కావేరి అనుసంధానం చేపడుతున్నందున రా­ష్ట్రం­లోని కృష్ణా, గోదావరి బేసిన్లలో నీరందని ఆయకట్టుకు నీటిని కేటాయించాలని కోరింది.

కృష్ణాలో 18 టీఎంసీలతో బెడ్తి–వారాదా అనుసంధానం ప్రాజెక్టును కర్ణాటకలో చేపడుతున్నందున ట్రిబ్యున­ల్‌ అవార్డు ప్రకారం ఆ నీటిలో భాగస్వామ్య రాష్ట్రాలకు వా­టా­లు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో తెలంగాణకు 9 టీఎంసీలు కేటాయించాలని కోరింది. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుంచే చేపట్టాలని ఏపీ సూచించింది. పోలవరం నుంచి పులిచింతల, నాగార్జునసాగర్, రా­­య­ల­సీమ మీదుగా అనుసంధా­నం చేయాలని ప్రతిపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement