
సామర్థ్యం పెంపు విభాగంలో దేశంలో నంబర్ వన్
100 పాయింట్లకుగాను 86.19 పాయింట్ల సాధన
పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్లో కేంద్రం వెల్లడి
అన్ని విభాగాల్లో కలిపి రాష్ట్రానికి 55.10 పాయింట్లు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలకు స్వయంపాలన కల్పించి, సామర్థ్యం పెంచటంలో (కెపాసిటీ ఎన్హాన్స్మెంట్) తెలంగాణ రాష్ట్రం అత్యధిక పాయింట్లు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ (పీడీ ఐ)పై విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు ప్రకటించింది. పంచాయతీలకు అధికారాలు, బాధ్యతల బదలాయింపుతోపాటు జవాబుదారీతనం పెంచటంలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది.

ఇందులో వివిధ విభాగాలుంటాయి. సామర్థ్యం పెంపు విభాగంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. మొత్తం 100 పాయింట్లకుగాను 86.19 పాయింట్లతో ప్రథమ స్థానం దక్కించుకుంది. తమిళనాడు 84.29 పాయింట్లతో రెండో ర్యాంక్, గుజరాత్ 83.96 పాయింట్లతో మూడో ర్యాంక్ సాధించాయి. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఈ నివేదికను రూపొందించింది. 2013–14 నుంచి 2021–22 వరకు దేశవ్యాప్తంగా పంచాయతీలకు అధికారాలు, బాధ్యతల బదలాయింపు 39.9 శాతం నుంచి 43.9 శాతానికి పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది.