
సాక్షి, జనగామ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్ పాదయాత్రలో బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తలతో కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి ఉద్రిక్తతకు దారితీయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక, లాఠీఛార్జ్ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. హైకోర్టు అనుమతులతో పాంనూర్ నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉప్పుగల్, కోనూర్, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర నేపథ్యంలో బండి సంజయ్ను టీఆర్ఎస్ సర్కార్ హెచ్చరించింది. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇక, పాదయాత్ర రూట్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే!