11.5 కిమీ.. 9 నిమిషాలు | Hyderabad Traffic Police Provide Green Channel For Live Organs | Sakshi
Sakshi News home page

దానం చేసిన ఆర్గాన్స్‌ మరో పేషెంట్‌ వద్దకు.. 

Sep 6 2020 10:33 AM | Updated on Sep 6 2020 10:50 AM

Hyderabad Traffic Police Provide Green Channel For Live Organs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌ – సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌ మధ్య మార్గం.. అనునిత్యం రద్దీగా ఉంటుంది.. ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు గంటకు 25 కిలోమీటర్లు మించదు.. పగటి పూట, పీక్‌ అవర్స్‌లో ఆ వేగం 20 కిలో మీటర్లకు చేరదు. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ మూడు లైవ్‌ ఆర్గాన్స్‌ కోసం నగర ట్రాఫిక్‌ పోలీసులు శనివారం ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్‌ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. వీరి కృషిని అభినందిస్తూ నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ ట్వీట్‌ చేశారు.   

ఉదయం మొదలైన ‘ఆపరేషన్‌’.. 
నగర ట్రాఫిక్‌ విభాగంలోని పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్‌ సెట్స్‌ అన్నీ శనివారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగికి కిడ్నీ, లంగ్స్, లివర్‌ మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్ర చికిత్స ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. డోనర్‌ ఇస్తున్న ఆ అవయవాలు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి.

టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ.. 
డోనర్‌ ఇచ్చిన అవయవాలతో కూడిన బాక్స్‌లను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 11.5 కిలోమీటర్ల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లేందుకు సిద్ధమైంది. అలా నే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారు లు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించ డానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద యం 8 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు.  

ఇదీ ప్రయాణించిన మార్గం.. 
శనివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్‌ ఆర్గాన్‌ బాక్స్‌’లతో కూడిన అంబులెన్స్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్‌పురా, ప్రకాష్‌నగర్‌ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్‌ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్‌ వాహనాలకు ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇవ్వడంతో కేవలం 9 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాసేపు అంబులెన్స్‌ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్‌ పోలీసులు వైర్‌లెస్‌ సెట్స్‌ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రా ణం కాపాడేందుకు ట్రాఫిక్‌ పోలీ సులు చూపిన చొరవను ఆ యా ఆస్పత్రి యాజమాన్యాలు కొనియాడాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement