
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్లో కార్మికుల కొరత ఏర్పడింది.
గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment