balkonda
-
ఒక్కసారిగా చెలరేగిన కత్తిపోట్ల కలకలం!
నిజామాబాద్: బాల్కొండ మండల కేంద్రంలోని ఓ హోటల్లో టీ తాగుతున్న వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కత్తితో శనివారం దాడి చేయడంతో కలకలం రేగింది. ఎస్సై గోపి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన రఫీక్ వన్నెల్(బి) చౌరస్తాలోని ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు సయ్యద్ సోఫియాన్, సయ్యద్ రియాన్లు పాత కక్షలను మనుసులో అతడిపై కత్తితో దాడి చేశారు. రఫీక్ తప్పించుకోవడానికి యత్నించగా చేతులకు, ఇతర చోట్ల గాయాలయ్యాయి. వీరిని అడ్డుకోవడానికి వెళ్లిన అతారొద్దీన్ సైతం గాయపడ్డాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఇవి చదవండి: పెళ్లి రోజే.. తీవ్ర విషాదం! -
బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇవ్వబోతున్నాం: సీఎం కేసీఆర్
-
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే.. -
బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసినా కృతజ్ఞత చూపించడంలేదని బాధను వెల్లబోసుకున్నారు. తనకు బాధగా అనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అని ప్రశ్నించారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారు. రైతులు హైదరాబాద్కు తరలివచ్చారు. నాపై చెప్పులు వేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే రైతులది బతుకుపోరాటం. శ్రీరామ్సాగర్ నీళ్లు మొట్టమొదటగా అందేది మెండోరాకే. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చినా కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదు. నాకు బాధగా ఉంది. మెండోరాకు ఎంత మంచి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
ఆర్మూర్ బరిలో రేవంత్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా పార్టీ బలం, బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, అదేవిధంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనుండడంతో పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహం పెల్లుబికుతోంది. దక్షిణ తెలంగాణ విషయమై పార్టీ అధినాయకత్వం పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పార్టీ పూరించింది. తదుపరి టాస్్కలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్.. రేవంత్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే విషయమై జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ అంశం తిరుగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ నేపథ్యంలో రైతుల్లో పారీ్టపై అనుకూలత పెరిగింది. ధరణి రద్దు చేస్తామని ప్రకటనతో కాంగ్రెస్కు మరింత మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వ్యవసాయపరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ నుంచి రేవంత్ను పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం కోసమే..! కర్ణాటక విజయం తరువాత తెలంగాణను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇక్కడి వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు ఉండడంతో ఉత్తర తెలంగాణలో సైతం ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రజాదరణ ఉన్న రేవంత్రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వే బృందం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ఆర్మూర్ నుంచి బరిలో ఉంటే ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ని 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ డీసీసీ నాయకత్వం రేవంత్ను బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా వ్యవహారం ముందుకు పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ నేతలు ఆర్మూర్ నుంచి రేవంత్ను బరిలో దించేందుకు ఆలోచిస్తుండడం విశేషం. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్ విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
కలకలం: రోడ్డుపై కరెన్సీ నోట్ల ముక్కల సంచులు..
సాక్షి, బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు పడి ఉండటం కలకలం రేపింది. ఇందులో కొత్త 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో వీటిని పడేశారు. నోట్ల ముక్కల సంచులపై నుంచి వాహనాలు వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి. రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: HYD: ఇక్కడ అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు? సమాచారం అందడంతో ఏఎస్సై మురళీధర్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. శాంపిళ్లను సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్.. అరకొరే...అయినా హుషారే... -
పలకా బలపం పట్టాల్సిన వయసు.. చిట్టి తల్లికి ఎంత కష్టం!
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): పలక బలపం పట్టి బడిలో ఉండాల్సిన చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చింది. హాయిగా ఆడుకోవాల్సిన వయసులో తోపుడు బండిలో చెల్లిని, నీళ్ల బిందెలను పెట్టుకుని తాము ఉంటున్న గూడెం వద్దకు తోసుకుంటూ వెళ్తుంది. బాల్కొండ మండలం బస్సాపూర్ శివారులో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఏర్పడ్డ ఇటుక బట్టీల వద్ద చిన్నారుల దుస్థితి ఇది. తాగు నీటి కోసం చిట్టి తల్లి తోపుడు బండిలో గ్రామానికి వెళ్లి నీళ్లను తీసుకు వస్తోంది. చదవండి: మరియమ్మ లాక్ అప్ డెత్పై హైకోర్టు తీర్పు -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మరో సౌదీ విషాద ఘటన: చివరి చూపూ దక్కలేదు..
మోర్తాడ్ (బాల్కొండ): కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి సౌదీ అరేబియాకు వెళ్లిన మోర్తాడ్ మండలం పాలెం వాసి షేక్ మదర్(50) అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. కరోనా వైరస్ ఉధృతితోనే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తెప్పించడం కష్టంతోపాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో సౌదీలోనే మదర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కుటుంబ పెద్ద కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని మదర్ కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) ఎన్నో ఏళ్ల నుంచి మదర్ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల కింద ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లి అక్కడ సైకిల్ రిపేరింగ్ షాప్ను నిర్వహిస్తున్నాడు. నెల రోజుల కిందట మదర్ అనారోగ్యానికి గురవడంతో ఈనెల 6వ తేదీన మరణించాడు. మదర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతడికి ఆజాద్ వీసా స్పాన్సర్ చేసిన సౌదీవాసి తెలిపాడు. మక్కా ఉన్న సౌదీలోనే మదర్ మృతదేహానికి ఖననం చేస్తే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని పలువురు సూచించడంతో కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈనెల 25 ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. రావడానికి ఒక్కరోజు ముందుగానే మృతి సౌదీలో మరణించిన మదర్ ఈ నెల 7వ తేదీన స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మధుమేహం, బీపీ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడు ఇంటికి రావడానికి విమాన టికెట్ను తీసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఒకరోజు ముందుగానే తీవ్ర అనారోగ్యానికి గురై సౌదీలోనే మరణించడం, అక్కడే అంత్యక్రియలు ముగిసిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మదర్కు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
ఈ ప్రాంతంలో వింత లాక్డౌన్
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ ఉధృతిని అరికట్టడానికి గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు సెల్ఫ్ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. అయితే సెల్ఫ్ లాక్డౌన్ నిబంధనలు మద్యం అమ్మకాలకు వర్తించకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, హోటళ్లు ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయంలో తెరిచి ఉంచాలని ఆయా గ్రామాల పంచాయతీలు, వీడీసీలు తీర్మానించాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రెండు, మూడు రోజుల నుంచి సెల్ఫ్ లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు కిరాణ దుకాణాలు, హోటళ్లు, కూరగాయల వ్యాపారం, ఇతరత్రా చిన్న వ్యాపారులకే వర్తింప చేశారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలు కాని, బెల్టు షాపులకు ఈ లాక్డౌన్ నిబంధనలు వర్తింప చేయడం లేదు. దీంతో సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటిని బంద్ చేయాల్సి ఉండగా ఇదేమి వింత అని గ్రామస్తులు విస్తుపోతున్నారు. ( చదవండి: నిజామాబాద్లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! ) -
నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ శివారులో జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడు నిద్రిస్తుండగా ఇనుప రాడ్లతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకులో బాల్కొండకు చెందిన కోటగిరి రాంకిషన్(49) కార్మికుడిగా పని చేస్తాడు. ఆదివారం విధులు నిర్వహించిన రాంకిషన్, తోటి కార్మికులు విధులకు రాక పోవడంతో సోమవారం కూడా డ్యూటీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అక్కడే ఉన్న కేబిన్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి తలపై ఇనుప రాడ్లతో కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయాలై పడి ఉన్నాడు. మంగళవారం ఉదయం బంకుకు వచ్చిన మేనేజర్ రాజారెడ్డి గాయాలతో పడి ఉన్న రాంకిషన్ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కొనఊపిరితో ఉన్న ఆయనను ముందుగా అంబులెన్స్లో ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్మూర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పో లీసులు పేర్కొన్నారు. రాంకిషన్కు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో రాంకిషన్ హత్యకు గురైన ప్రదేశంలో పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ వైపు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీంతో తనిఖీలు చేశారు. బాల్కొండ, ముప్కాల్ ఎస్సైలు శ్రీహరి, రాజ్భరత్రెడ్డి ఉన్నారు. -
భీమ్గల్గా మారిన వేముగల్లు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఎక్కువగా వేప చెట్లు ఉండడంతో వేముగల్లుగా పిలువబడిన ఆ నాటి సంస్థానమే నేటి భీమ్గల్గా గుర్తించబడింది. సరైన వైద్యం అభివృద్ధి చెందని సమయంలో తమకు అందుబాటులో ఉన్న వేప చెట్ల ఆకులు, గింజలతో మందులను తయారు చేసి రోగులను బతికించుకున్న సంస్థానంగా చరిత్రలో చోటు సంపాదించుకున్న వేముగల్లు సంస్థానం కాలక్రమంలో భీమ్గల్గా ప్రసిద్ధిగాంచింది. 15వ శతాబ్దంలో వేముగల్లు సంస్థానాధీశుడైన రాణామల్ల నరేంద్రుడు పల్లికొండను రాజధానిగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్రకారులు వివరించారు. వేముగల్లు సంస్థాన ఆస్థాన కవి కొరవి గోపరాజు ఈ సంస్థానం పాలన గురించి చాలా గొప్పగా వివరించారు. వేముగల్లు సంస్థానంపై తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా పని చేసిన హన్మాండ్ల భూమేశ్వర్ పరిశోధన చేశారు. అలాగే సిరికొండ మండలం కొండూర్కు చెందిన సల్లావచ్చల మహేశ్బాబు కూడా కొరవి గోపరాజు రచించిన సింహాసన ధ్వాతృంశిఖపై పరిశోధనలను కొనసాగించారు. ఇలా వేముగల్లు సంస్థానానికి చరిత్రలో ఎన్నో విధాలుగా ప్రాధాన్యత లభించింది. కస్బా నుంచి కస్పా.. వేముగల్లు పేరు భీమ్గల్గా మారక ముందు కస్బా అని పిలిచేవారు. ఉర్దూలో కస్బా అంటే పెద్ద నగరం, పట్టణం అని అర్థం. అలా భీమ్గల్ను మొదట కస్బా అని ఆ తరువాత వాడుకలో కస్పాగా మారింది. తరువాత భీమ్గల్ అని పలికేవారు. ప్రస్తుతం భీమ్గల్ అని పలుకుతూ రాస్తున్నారు. భీమ్గల్ 1975లో గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. పంచాయతీ సమితిగా, తాలుకా కేంద్రంగా కూడా భీమ్గల్ ప్రసిద్ధికెక్కింది. ‘గాడి’ కుటుంబానికి ఎక్కువ మార్లు అవకాశం భీమ్గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీగా కొనసాగింది. ఈ పంచాయతీకి ఎక్కువ మార్లు ‘గాడి’ కుటుంబీకులే సర్పంచ్లుగా ఎంపికయ్యారు. 1975లో మొదటి సర్పంచ్గా ఇమాంభ„Š ఎంపికయ్యారు. ఆ తరువాత 1980 నుంచి గాడి సుదర్శన్రావు నాలుగుమార్లు సర్పంచ్గా ఎంపికయ్యారు. ఆయన 1998 వరకు 18 ఏళ్ల పాటు సర్పంచ్గా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో గాడి సుదర్శన్రావు సోదరుడు రాజేశ్వర్రావు సర్పంచ్గా ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో మరోసారి రాజేశ్వర్రావు సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2005లో గాడి భూపతిరావు, 2010లో గాడి భూపతిరావు సతీమణి శోభ సర్పంచ్గా ఎంపికై భీమ్గల్పై తమ పట్టును నిరూపించుకున్నారు. 2014లో సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు చేయబడడంతో రవినాయక్ ఎన్నికయ్యారు. 2019లో మున్సిపాలిటీగా భీమ్గల్ అప్గ్రేడ్ చేయబడింది. ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని బీసీ మహిళలకు రిజర్వు చేశారు. భీమ్గల్ తొలి మున్సిపల్ చైర్మన్గా ఎవరు ఎంపికైతారో వేచి చూడాలి. -
చేపలు పోతున్నాయి!
సాక్షి. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టిన, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చిన ప్రాజెక్ట్ నుంచి చేపలు వెళ్లిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద కాలువ హెడ్రెగ్యులేటర్కు జాలి గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ హైలెవల్లో ఉండటంతో నీటి విడుదల సమయంలో చేపలు, చేప పిల్లలు కాలువలో వెళ్లిపోతున్నాయి. దీంతో జలాశయంలో చేపలు, చేపపిల్లలు ఖాళీ అవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. వరద కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద జాలి గేట్లు కావాలని ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మత్స్య కారులు అంటున్నారు. జాలి గేట్లు ఏర్పాటు చేస్తే 90 శాతం చేపలు, చేపపిల్లలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు జాలి గేట్లు అమర్చుతామని పాలకులు వచ్చి సందర్శించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మోక్షం లభించలేదు. దీంతో వరద కాలువ ప్రవహించిన ప్రతిసారి మీనాలు కాలువలో పోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై చేపలు వేటాడుతు ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చేపల వేటకు వస్తుంటారు. కాకతీయ కాలువ, ఇతర కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పు డు చేపలు, చేపపిల్లలు చాలా తక్కువగా కాలు వల్లో కొట్టుకుపోతాయంటున్నారు. వీటికి జాలి గేట్లు ఉన్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్కు జాలి గేట్లను అమర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాలువలో చేపల వేట ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల జరిగినప్పుడు అధికంగా చేపలు బయటకు వెళ్తాయి. దీంతో కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద కొందరు చేపలు పడుతున్నారు. మత్స్యకారులే కాకుండా ఇతరులు కూడా చేపలను పట్టుకుంటారు. దీంతో మత్స్య సంపద తరలి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాలి గేట్లు నిర్మించాలి వరద కాలువకు జాలీ గేట్లను నిర్మించాలి. లేదంటే నీటి విడుదల చేపట్టినా రోజులు వరద కాలువలో చేపలు అధికంగా బయటకు పోతాయి. దీంతో తీవ్రంగా నష్టపోతాం. – కిషన్, మత్స్యకారుడు లాభం ఉండటం లేదు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్ట్లో చేపపిల్లలను వదులుతుంది. కానీ వరద కాలువ ప్రవహిస్తే కాలువలోనే అనేక చేప పిల్లలు కొట్టుకు పోతున్నాయి. దీంతో లాభం ఉండటం లేదు. జాలి గేట్లు ఉంటే ఇంత నష్టం జరగదు. – గణేశ్, మత్స్యకారుడు మంత్రికి విన్నవించాం వరద కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద జాలి గేట్ల కోసం మంత్రి ప్రశాంత్రెడ్డికి విన్నవించాం. ఆయన సానూకూలంగా స్పందించారు. జాలీ గేట్లు పెడితే మత్స్యసంపద తరలిపోదు. – గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, బాల్కొండ -
నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు
సాక్షి, బాల్కొండ: మద్యం సిండికేట్ ఇష్ట్యారాజ్యానికి కొందరు ఎక్సైజ్ అధికారులు మద్దతునిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు కావడానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో పాత వైన్సులకే లైసెన్స్ను ఒక నెల రెన్యూవల్ చేసిన విషయం విదితమే. అక్టోబర్ మాసానికి లైసెన్స్ ఫీజు చెల్లించిన మద్యం వ్యాపారులు ప్రతి సీసాపై రూ.10 ధర పెంచి వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నారు. అక్టోబర్ నెలకు మద్యం సిండికేట్ చెప్పిన ధరకే వినియోగదారులు మద్యంను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం సిండికేట్పై పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే ఒక్కో మద్యం సీసాపై ప్రత్యేక ధరను వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరల ప్రకారమే మద్యంను విక్రయించాల్సి ఉంది. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సదరు వైన్స్లను సీజ్ చేసే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. కానీ అక్టోబర్ నెల అంతా ప్రత్యేక ధరకే మద్యం విక్రయిస్తామని మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఒక నెల లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యం విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా మద్యం దుకాణాల లైసెన్స్లను ఖచ్చితంగా రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. అయితే ఈ నెల కోసం అదనంగా లైసెన్స్ ఫీజును చెల్లించే సమయంలో మద్యం వ్యాపారులు కొందరు మొండికేయడంతో వారిని బుజ్జగించడంలో భాగంగా ధర పెంచుకోవడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో సీసాపై రూ.10 పెంచి విక్రయించుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మద్యం సీసాల పరిమితితో తేడా లేకుండా ప్రతి సీసాపై రూ.10 ధర హెచ్చింపు చేయడం ద్వారా రూ.లక్షల్లో అదనపు ఆదాయం మద్యం సిండికేట్కు సమకూరనుంది. ఎక్సైజ్ అధికారులు నోరు మెదపకుండా ఉండటానికి మద్యం సిండికేట్ నుంచి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.10 ధర పెంపు ఈ నెలకోసమే అని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రెండు దుకాణాలకు జరిమానా విధించినా.. ఎంఆర్పీ ధరలకు కాకుండా మద్యం ధరలను పెంచి విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానా కూడా విధించారు. అయినా మద్యం వ్యాపారులు తమ తీరును మార్చుకోలేదు. రూ.10 ధర పెంచి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీకే విక్రయించాలి మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి. – డేవిడ్ రవికాంత్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
కిసాన్నగర్ వరకే ‘కాళేశ్వరం’ నీరు
సాక్షి, బాల్కొండ: ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా శనివారం ప్రారంభించిన వెట్రన్ నిలిచిపోయింది. దీంతో వరద కాలువలో నీరు బాల్కొండ మండలం కిసాన్నగర్ వరకు మాత్రమే వచ్చి నిలిచి పోయింది. వరద కాలువపై రాజేశ్వర్రావుపేట్ వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్ నుంచి రెండు మోటార్ల ద్వారా వెట్రన్ నిర్వహించారు. శనివారం కిసాన్నగర్ వరకు చేరుకోగానే మోటార్లు నిలిపి వేయడంతో నీరు అక్కడికే నిలిచి పోయింది. ఎస్సారెస్పీకి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం నీళ్లు ఆగాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండటంతో పర్యటన వాయిదా పడటంతో మోటార్ల ద్వారా వెట్రన్ నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో కిసాన్నగర్ వరకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. త్వరలోనే ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు చేర వేసే కార్యక్రమం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. -
వలలో చిక్కిన కొండ చిలువ
సాక్షి, బాల్కొండ: బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా అలుగుకు కట్టిన వలలో పెద్ద కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 8 కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదన్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువు కొండ చిలువలకు ఆవాసంగా మారిందని చెబుతున్నారు. -
రైతుల గుండెల్లో ‘గ్రీన్ హైవే’ గుబులు
సాక్షి, బాల్కొండ: గ్రీన్ హైవే నిర్మాణ ప్రతిపాదన రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పచ్చని పొలాల్లోంచి జాతీయ రహదారి వెళ్తుందన్న వార్త అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గల 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల జిల్లా మీదుగా జగదల్పూర్ వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి గత నెలలో సర్వే కూడా చేపట్టారు. పక్కన గల జగిత్యాల జిల్లాలో సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులకు గ్రీన్ హైవే గుబులు పట్టుకుంది. జిల్లాలోని ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల పరిధిలోని విలువైన భూముల్లోంచి ఈ గ్రీన్ హైవే వెళ్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 63వ జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్రం భావించింది. అయితే, ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భారీగా భవన నిర్మాణాలను పడగొట్టాల్సి వస్తుండడం, ఇందుకు భారీగా నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉండడంతో కేంద్రం ప్రత్యామ్నయంగా గ్రీన్ హైవేకు రూపకల్పన చేసింది. ఇళ్లను తొలగించకుండా పంట భూముల మీదుగానే రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది. నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనుండడంతో ఎకరం, రెండేకరాల భూమి ఉన్న రైతులు పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాము ఉపాధిని కోల్పోతామని చిన్న, సన్నకారు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముప్కాల్ మండల పరిధిలోని రైతులు గత వారం ఎంపీ ధర్మపురి అర్వింద్తో పాటు కలెక్టర్ రామ్మోహన్రావును కలిసి గ్రీన్ హైవే నిర్మాణం నిలిపి వేయాలని విన్నవించారు. విలువైన భూములు.. ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల పరిధిలో భూముల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతోంది. 44వ జాతీయ రహదారి పక్కన భూములైతే రూ.అర కోటికి పైగానే ధరలున్నాయి. గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే తమకు ప్రభుత్వం అంత ధర చెల్లించే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకునే భూములు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునారాలోచన చేసి గ్రీన్ హైవే నిర్మాణం విరమించు కోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. వేంపల్లి రైతులకు తీవ్ర నష్టం.. గ్రీన్ హైవే నిర్మాణం జరిగితే వేంపల్లి రైతులకు మరోమారు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే వేంపల్లి రైతులు తమ విలువైన భూములను వరద కాలువతో పాటు 44వ జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్ హైవే నిర్మాణం కోసం భూమి కోల్పోతే అసలు సాగు చేసుకోవడానికే భూమి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మి కాలువ డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి రైతులు భూమిని కోల్పోయారు. గతంలో నిర్మించిన నవాబు కాలువ, నిజాంసాగర్ కాలువలు కూడా వీరి భూముల నుంచే పోయాయి. -
ప్రమాదపుటంచున పర్యాటకులు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే సమయంలో ప్రాజెక్ట్కు జలకళతో పాటు, జనకళ వస్తుంది. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. కాని ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రతను పట్టించుకునే నాథుడే కరువవడంతో పర్యాటకులు ప్రమాదపు అంచుకు వెళ్తున్నారు. అయిన ప్రాజెక్ట్ ఆనకట్టపై ఉన్న సబ్ కంట్రోల్ బూత్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి అంచున సెల్ఫీలు పర్యాటకులు నీటి అంచు వరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాజెక్ట్ లోపలి వైపు నీటి అంచు వరకు రివీట్మెంట్ మీద వెళ్లడం ప్రమాదకరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు తెలియక నేరుగా ప్రాజెక్ట్ నీటి అంచుకు వెళ్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మత్యువాత పడ్డారు. అయిన ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల కోసం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్ వద్ద ప్రమాదాలు జరగక ముంద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. డ్యాం మీదకి అనుమతి లేదు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాంపైకి పర్యాటకులకు అనుమతివ్వడం లేదు. ఆనకట్టపై నుంచే ప్రాజెక్ట్ను సందర్శించి వెళ్లాలి. దీంతో ప్రాజెక్ట్ లోపకి వైపుకు దిగుతు గేట్లను చూస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద డ్యాంపైకి వెళ్లకుండ గేట్లను మూసి వేస్తున్నారు. కేవలం ఆదివారం మాత్రమే డ్యాంపైకి అనుమతిస్తున్నారు. డ్యాంపైకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గేట్లు మూసి ఉంచుతున్నారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు
ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు వెతలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీకి చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో.. పునరుజ్జీవన పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఆదేశాలతో ఈ సీజన్లోనే తమ పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టారు. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ వద్ద గల మూడో పంపు హౌజ్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండు పంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్లో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేకపోవడంతో 0.5 టీఎంసీల చొప్పున నీటిని ముందుగా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తరలించే పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ నెల 15 లోపు ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి. వరద కాలువలో ఏడాదంతా నీరు.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువలో నీరు రివర్స్ పంపింగ్ చేయడంతో వరద కాలువలో ఏడాదంతా నీరు నిల్వ ఉంటుంది. దీంతో వరద కాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగే అవకాశాలున్నాయి. రైతులకు ఈ నీటితో కొంత ఉప శమనం కలుగనుంది. ఆయకట్టు రైతుల్లో ఆనందం.. సీఎం ఆదేశాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్లో నీరు లేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది రైతులు ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. కానీ సీఎం ఆదేశాలతో ఈనెల 15వ తేదీలోపు కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని చేరితే తమ పంటలకు ఢోకా ఉండదని రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు -
నాడు గల్ఫ్ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్లో పని చేసిన గుల్లె రాజేశ్వర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్ పయనం అయ్యాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్ తన వృత్తి నైపుణ్యంతో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్ కంపెనీని కువైట్లో ప్రారంభించాడు. మరామిష్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కువైట్లో తన కంపెనీ సక్సెస్ కావడంతో ఇటీవల దుబాయ్ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్లో పార్టీ ఫ్లోర్ లీడర్గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. -
డెడ్ స్టోరేజ్కి చేరువలో..
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి తాగు నీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగులు తగ్గుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. ఈ లెక్కన పది రోజులకు ఒక అడుగు నీటి మట్టం తగ్గుతుంది. మరో రెండు నెలల్లో 6 అడుగుల నీటి మట్టం తగ్గుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 130 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. నాలుగు రోజుల నుంచి పెరిగిన ఎండ తీవ్రత వలన 229 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు కూడ ఎక్కువగా ఆవిరవుతుంది. నీటి వినియోగం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం అతి తక్కువ నీటి వినియోగం జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 142 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మిగత ఏ కాలువల ద్వారా కూడ నీరు వినియోగించడం లేదు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం శర వేగంగా తగ్గుతోంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. డెడ్ స్టోరేజీకి 2.3 టీఎంసీల దూరంలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్లో 2015 సంవత్సరంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాక పోవడంతో డెడ్స్టోరేజీ దిగువకు ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరం కూడ డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ 55 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు రెండు మార్లు మాత్రమే డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయినట్లు ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1052.40 (7.3 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
ప్రతి ఇంటా.. గ్రామ దేవత పేరే
బాల్కొండ: ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ.. ఆ దైవం పేరు లేకుండా గ్రామంలోని ఏ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఉండవు.. అదే బాల్కొండ మండలం వన్నెల్(బి) గ్రామం. ఆ గ్రామ జనాభా సుమారు 5,172 మంది ఉంటారు. 600పై చిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వన్నెల్(బి) ఎంతో అభివృద్ధి బాటలో ఉంది. రాజకీయంగా కూడా ఎంతో చైతన్యం గల గ్రామం. ఆ గ్రామం దేవెంద్రుల పల్లెగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ పేరుతో ప్రతి కుటుంబంలో ఒకరి పేరు కచ్చితంగా ఉంటుంది. మగవారికి దేవేందర్, దేవన్న, ఆడవారికి దేవమ్మ, దేవాయి పేర్లు ఉంటాయి. ఈ తరం పిల్లలకు కూడా ముందుగా ఆ పేరుతో నామకరణం చేసిన తరువాతనే ఇతర పేర్లు పెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలో అందరూ దేవేందర్లు ఉండడం వలన ఇంటి పేరు తప్పని సరిగా వాడాల్సి వస్తుంది. దీంతో అధికంగా పూర్తి పేరుకు బదులు ఇంటి పేర్లతో ఎక్కువ మందిని పిలుచుకుంటారు. లేదంటే అందరు దేవేందర్లు ఉండడంతో ఏ దేవేందర్ ఏంటో తెలియదంటారు. దేవమ్మ ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కావడంతో గ్రామ శివారులో ఆలయం నిర్మించారు. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమిలో చెట్లను పెంచారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం జూన్ మాసంలో పెద్ద ఎత్తుగా దేవమ్మ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి శుక్రవారం దేవమ్మకు పూజలు నిర్వహిస్తారు. దేవమ్మ కరుణతో అందరం చల్లగా ఉన్నామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో పేరు ఉంటుంది వన్నెల్(బి) గ్రామంలో ప్రతి ఇంట్లో దేవమ్మ పేరుతో గల దేవేందర్, దేవన్న, లాంటి పేర్లు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి పిల్లలకు కూడా మొదట ఆ పేరుతో పేరు పెట్టాకే వేరే పేర్లతో పిలుచుకుంటాం. దేవమ్మ కరుణతో గ్రామస్తులందరం చల్లగా ఉంటున్నాం. – ఏనుగు దేవేందర్, గ్రామస్తుడు మా ఆరాధ్య దైవం.. దేవమ్మ మా గ్రామస్తుల ఆరాధ్య దైవం కావడంతో అందరి ఇళ్లలో అమ్మ వారి పేరుతో పేర్లు పెంటుకుంటాం. ప్రతి సంవత్సరం ఘనంగా దేవమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. అందరివి ఒకే పేర్లు కావడంతో ఇంటి పేర్లు తప్ప కుండా వాడుతాం. – రెంజర్ల దేవేందర్, గ్రామస్తుడు -
ప్రశాంత్రెడ్డి అనే నేను..!
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రశాంత్రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్భగీరథ వైస్ చైర్మన్గా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యే క రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మంత్రివర్గ విస్తరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి చోటు దక్కింది. మంగళవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రశాంత్రెడ్డి సోమవారం హైదరాబాద్లోని సీ ఎం నివాసం ప్రగతిభవన్లోనే ఉన్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ప్రశాంత్రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై మంగళవారమే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తమ నేతకు మంత్రి పదవి లభించనుండటంతో నియోజకవర్గంలో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రశాంత్రె డ్డి 2014, తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ప్రభుత్వ హయాంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్భగీరథ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఈసారి కేసీఆర్ నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. స్వతహాగా ఇంజనీర్ అయిన ప్రశాంత్రెడ్డికి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథ (వాటర్గ్రిడ్) బాధ్యతలను అప్పగించారు. 2016లో ఏప్రిల్ 29న ఆయన మిషన్భగీరథ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టు పనులను ముం దుకు తీసుకెళ్లడంలో కృషి చేశారు. ఉద్యమంలో చురుగ్గా.. 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో తం డ్రి వేముల సురేందర్రెడ్డితో కలిసి పని చేశారు. తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పా ల్గొన్నారు. 2010లో సీఎం కేసీఆర్ ప్రశాంత్రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమ యంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉద్యమాన్ని చేపట్టారు. సాగరహారం, అసెంబ్లీ ముట్ట డి, రైల్రోకో, వంటావార్పు లాంటి అనేక ఆం దోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఉద్యమ సమయంలో రైల్రోకో, ఇతర కేసులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రశాంత్రెడ్డి నియోజకవర్గ అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చెక్డ్యామ్లు, ఇలా 40 ప్రత్యేక సాగునీటి పనులను రూ.200 కోట్లతో చేపట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ప్రశాంత్రెడ్డి బయోడేటా.. పేరు: వేముల ప్రశాంత్రెడ్డి విద్యార్హత : బీఈ సివిల్ (బాల్కి, కర్ణాటక) తండ్రి: కీ.శే.వేముల సురేందర్రెడ్డి తల్లి : మంజుల భార్య : నీరజా రెడ్డి కుమారుడు : పూజిత్రెడ్డి– ఎంబీబీఎస్ కుమార్తె : మానవి రెడ్డి (బీటెక్)– సీబీఐటీలో సోదరుడు : వేముల శ్రీనివాస్ (అజయ్రెడ్డి– వెటర్నరీ సీనియర్ డాక్టర్) సోదరి : రాధిక (గ్రూప్–1 ఆఫీసర్) జననం: 14.03.1966 బాల్యం విద్యాభ్యాసం : వేల్పూర్, కిసాన్నగర్ వృత్తి : ప్రఖ్యాత బిల్డర్గా హైదరాబాద్లో పేరుగాంచారు. -
అభివృద్ధికే పట్టం కట్టండి: వేముల ప్రశాంత్రెడ్డి
సాక్షి, బాల్కొండ: గ్రామాల్లో అభివృద్ధి చేసిన నాయకుడికే పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ముప్కాల్ మండలం నాగంపేట్, రెంజర్ల, వెంచిర్యాల్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి, 2014లో మీరు ఓట్లు వేసి గెలిపించిన తను ఇద్దరం ప్రస్తుతం పోటీలో ఉన్నామన్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో గమనించాలన్నారు. తనకంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తే అవతలి వ్యక్తికే ఓటు వేయవచ్చు అన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామల అండగా ఉంటున్నారన్నారు. ప్రజలు మరోసారి దీవించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఆయనకు బోనాలతో, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు సామ వెంకట్రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డికి పలు సంఘాల మద్దతు భీమ్గల్: మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్రెడ్డికి తమ మద్దతు తెలియజేశాయి. మండలంలోని బెజ్జోరాకు చెందిన మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలపగా ముచ్కూర్ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు, బాపూజీనగర్కు చెందిన మోచీ సంఘం సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో పలువురి చేరిక కమ్మర్పల్లి: మండలంలోని హాసకొత్తూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు, చౌట్పల్లికి చెందిన ట్రాక్టర్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈకార్యక్రమంలో రాకేశ్ పాల్గొన్నారు. -
బాల్కొండ జాగిర్యాల్కు సాగునీరందిస్తా..వేముల ప్రశాంత్రెడ్డి
సాక్షి, భీమ్గల్: మండలంలోని జాగిర్యాల్ గ్రామానికి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో నిధులు కేటాయించానని, మళ్లీ గెలిపిస్తే గ్రామస్తులు కోరిన విధంగా సాగునీరు అందించి తీరుతానని టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రశాంత్రెడ్డికి గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, పింఛన్లు తదితర అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలన్నారు. డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీ గోదావరి, జెడ్పీటీసీ లక్ష్మి, ఎంపీటీసీ గడాల లింగు, పసుల రాజమల్లు తదితరులున్నారు. సాక్షి, వేల్పూర్: కేసీఆర్కు రైతులు, పేదలు రెండు కళ్లలాంటి వారని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మోతెలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు యాభై ఏళ్లలో రైతులకు, పేదలకు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని చెప్పారు. విద్యుత్ సమస్య తీర్చినట్లుగానే, కాళేళ్వరం ప్రాజెక్టుతో శాశ్వతంగా సాగునీటి కొరత తీర్చబోతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరిపోసిన మోతె గ్రామాభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేసి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనులకు, టీఆర్ఎఎస్ చేసిన అభివృద్ధికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. మరోసారి ఆశీర్వదించి, గెలిపిస్తే మూడు రెట్ల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రచారానికి వచ్చిన ప్రశాంత్రెడ్డికి గ్రామస్తులు బోనాలు, డప్పువాయిద్యాలు, వలగోడుగులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రజిత, జెడ్పీటీసీ వెల్మల విమల, వజ్రలత, మోహన్యాదవ్, దొల్ల రాజేశ్వర్రెడ్డి, పాలెపు బాల్రాజ్, సామ మహిపాల్, పోటూరి నర్సారెడ్డి పాల్గొన్నారు. -
పోటీకి చౌట్పల్లి దూరం
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుల ఖిల్లాగా పేరొందిన చౌట్పల్లి ఈసారి ఎన్నికల తెరపై కనుమరుగైంది. ఈ గ్రామానికి చెందిన నాయకులకు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం నుంచి అవకాశం లభించకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చౌట్పల్లికి చెందిన ఎవరో ఒకరు అసెంబ్లీలో బాల్కొండ లేదా ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలవడంతో చౌట్పల్లికి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. కాగా ఈ సారి అసలే పోటీకి అవకాశం దక్కకపోవడంతో ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న చౌట్పల్లి తొలిసారి పోటీకి దూరమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 1952 నుంచి పోటీ.. 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చౌట్పల్లి హన్మంత్రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన 1956లో నిజామాబాద్ జిల్లా పరిషత్కు మొట్టమొదటి చైర్మన్గా ఎంపికయ్యారు. 1978లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున కేఆర్ గోవింద్రెడ్డి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన భీమ్గల్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి కూడా భీమ్గల్ సమితి అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 1983లో ఏలేటి మహిపాల్రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహిపాల్రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మహిపాల్రెడ్డికి ఆర్మూర్ టిక్కెట్ దక్కలేదు. కాగా ఈ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ టిక్కెట్ను చౌట్పల్లికి చెందిన సురేశ్రెడ్డికి పార్టీ అధిష్టానం కేటాయించగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1994లో అన్నపూర్ణమ్మ ఆర్మూర్ ఎమ్మెల్యేగా, సురేశ్రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసెంబ్లీలో రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం సంచలనం సృష్టించింది. 1999, 2004లో వరుసగా సురేశ్రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్రెడ్డి పోటీ చేయగా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అన్నపూర్ణమ్మ పోటీ చేసి సురేశ్రెడ్డిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సురేశ్రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీలో చౌట్పల్లికి చోటు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో సురేశ్రెడ్డి పోటీకి ఆసక్తి కనబరిచినా ఆయన టీఆర్ఎస్లో చేరడం ఆయనకు పార్టీ అధిష్టానం మరో పదవీని ఆఫర్ చేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఈసారి దూరమయ్యారు. అలాగే మల్లికార్జున్రెడ్డి మహాకూటమి తరపున పోటీ చేయడానికి బాల్కొండ టిక్కెట్ను ఆశించారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కూడా పోటీకి దూరమయ్యారు. 1983 నుంచి చౌట్పల్లికి చెందిన వారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి తొలిసారి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరమైందని వెల్లడవుతోంది. -
నరసింహస్వామి ఆశీర్వాదం..
సాక్షి,భీమ్గల్(నిజామాబాద్): బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు భీమ్గల్కు చేరుకున్న ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టకు చేరుకుని నరసింహ స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన భీమ్గల్లోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 200 మీటర్ల దూరంలో వాహనం దిగి సతీమణి నీరజారెడ్డి, ఎంపీపీ కొండ గోదావరి, డాక్టర్ మధుశేఖర్, పెర్కిట్కు చెందిన బంధువుతో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 12.45 గంటలకు రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈవో వేణుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసి వచ్చిన అనంతరం నాయకులు, కార్యకర్తలు ప్రశాంత్రెడ్డిని పూలమాలలతో అభినందించారు. అనంతరం ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు జరిపి దైవజనుల ఆశీస్సులు తీసుకున్నారు. అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా : బిగాల గణేషగుప్తా సాక్షి,చంద్రశేఖర్కాలనీ(నిజామాబాద్): నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ అనుబంధ అభ్యర్థిగా బిగాల కృష్ణమూర్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గణేశ్గుప్తా విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో తనపై అపారమైన విశ్వాసం ఉంచి నగర ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. రూ. 950 కోట్లతో ఇందూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ కవితతో కలిసి గుప్తా గురువారం మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలుదాఖలు చేయనున్నారు. -
ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఏ, డీఏల చెల్లింపులను నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గతంలో పోలింగ్ ముగిసిన తరువాత పోలింగ్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని నగదు రూపంలో చెల్లించే వారు. నగదు రూపంలో చెల్లింపులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన ఎన్నికల కమిషన్.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముందస్తు శాసనసభ ఎన్నికలలో భాగంగా డిసెంబర్ 7న జరుగనున్న పోలింగ్ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించే ఉద్యోగుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే, ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ అధికారి (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారి(ఏపీవో)లకు శిక్షణ ఇస్తున్నారు. దశల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కొనసాగించనున్నారు. సిబ్బంది పోలింగ్కు ఒక రోజు ముందుగానే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ రోజున విధులు నిర్వహించి, ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలు ముగిసిన తరువాత రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి టీఏ, డీఏలను చెల్లించే వారు. అయితే, కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు, ఇతర ఉద్యోగులు పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భత్యం పంపిణీ చేయలేరనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక భత్యం చెల్లింపునకు ఎక్కువ సమయం పట్టడంతో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఇబ్బంది పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది టీఏ, డీఏలను బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ద్వారానే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పోలింగ్ విధులకు ఎంపికైన ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను రిటర్నింగ్ అధికారులకు అందించాలని సూచించడంతో ఉద్యోగులు తమ వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందజేస్తున్నారు. -
బాల్కొండ ఓటరు తీర్పు విభిన్నం
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): బాల్కొండ ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు తలకిందులు చేస్తూ ఇక్కడి ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోలా విభిన్నమైన తీర్పునిచ్చిన బాల్కొండ ఓటర్లు రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. శాసనసభ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి కాంగ్రెస్కు పట్టం కట్టిన ఓటర్లు.. స్థానిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు షాక్ ఇచ్చి టీడీపీకి జైకొట్టారు. ఇలా ఒక్కో ఎన్నికలో ఒక్కో విధమైన తీర్పును వెల్లడించిన బాల్కొండ ఓటర్లు.. రాజకీయ విశ్లేషకులకు తమ నాడిని అంతు పట్టకుండా చేశారు. కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. నియోజకవర్గ పునర్విభజన జరుగక ముందు బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట్ మండలాలు ఉండేవి. మండల పరిషత్లకు తొలిసారి 1987లో ఎన్నికలు జరుగగా, బాల్కొండలో గడ్డం నర్సయ్య, కమ్మర్పల్లిలో భాస్కర్రావు(కాంగ్రెస్), మోర్తాడ్లో అమృతలతారెడ్డి, ఆర్మూర్లో జగదీశ్వర్రెడ్డి, నందిపేట్లో మారంపల్లి నర్సారెడ్డి(టీడీపీ) ఎంపికయ్యారు. 1995లో ఎంపీపీ స్థానాలకు పరోక్ష పద్ధతిలో, అలాగే, కొత్తగా జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. ఆ సమయంలో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. కానీ, స్థానిక ఎన్నికల్లో ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి రెండు మండలాల్లో ప్రభావం కనిపించగా, కాంగ్రెస్ మూడు మండలాల్లో సత్తా చాటింది. 2001లో టీఆర్ఎస్ హవా.. 2001లో నిర్వహించిన ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడే ఆవిర్భవించిన టీఆర్ఎస్ తన సత్తా చాటింది. నియోజకవర్గంలో పట్టు ఉన్న కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపించిన టీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థలలో పాగా వేశారు. ఒక్క కమ్మర్పల్లిలో మాత్రం జెడ్పీటీసీ స్థానం కాంగ్రెస్కు లభించింది. ఈ ఎన్నికల్లో మోర్తాడ్ ఎంపీపీగా కనకం గంగనర్సు, జెడ్పీటీసీగా నూగూరు ప్రకాశ్, బాల్కొండ ఎంపీపీగా బద్దం నర్సవ్వ, జెడ్పీటీసీ సభ్యునిగా ఈఎన్ రావు, ఆర్మూర్ ఎంపీపీగా ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యుడిగా రణధీర్ ఎంపికయ్యారు. నందిపేట్ ఎంపీపీగా సమంత సాయిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడిగా నారాగౌడ్, కమ్మర్పల్లి ఎంపీపీగా గుడిసె అంజమ్మ టీఆర్ఎస్ తరపున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో కమ్మర్పల్లి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున చింత ధర్మపురి ఎంపికయ్యారు. 2006లో తారుమారు.. 2006 ఎన్నికల నాటికి ఫలితాలు తారుమారయ్యాయి. టీఆర్ఎస్ హవా పూర్తిగా తగ్గిపోయి కాంగ్రెస్, టీడీపీ పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెస్, ఒక మండలంలో టీడీపీ విజయం సాధించాయి. మోర్తాడ్ ఎంపీపీగా గుర్రం నర్సయ్య, జెడ్పీటీసీ సభ్యురాలిగా శారద తెలుగుదేశం పార్టీ గెలుపొందారు. బాల్కొండ ఎంపీపీగా జక్క రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యునిగా గంగాధర్, ఆర్మూర్ ఎంపీపీగా సుంకర శెట్టి, జడ్పీటీసీ సభ్యునిగా దేవమల్లయ్య కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. నందిపేట్ ఎంపీపీగా కోల రాములు, జెడ్పీటీసీ సభ్యుడిగా నాయుడు ప్రకాశ్, కమ్మర్పల్లి ఎంపీపీగా గోపు దేవిదాస్, జెడ్పీటీసీ సభ్యురాలిగా లక్ష్మి గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాల్కొండ నియోజకవర్గం స్వరూపం మారిపోయింది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలు యథావిధిగా నియోజకవర్గంలో ఉండగా, వేల్పూర్, భీమ్గల్ మండలాలు కొత్తగా చేరాయి. అనంతరం 2014లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అన్ని మండలాల్లో గులాబీ పార్టీ ఆధిక్యతను చాటుకుంది. టీఆర్ఎస్ తరపున ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు గెలిచి ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకవచ్చారు. -
బూత్లలో సౌకర్యాల కోసం చర్యలు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల కోసం పోలింగ్ బూత్లలో సౌకర్యాలను కల్పించడానికి రెవెన్యూ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలింగ్ బూత్లుగా పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గతంలోనే గుర్తించారు. అయితే వాటిల్లో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయో లేవో అని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు సౌకర్యాలు లేని చోట పునరుద్దరణ పనులు చేపట్టారు. పోలింగ్ బూత్లలో విద్యుత్ సౌకర్యం లేక పోతే ఏర్పాటు చేయడం, వికలాంగుల కోసం ర్యాంపుల నిర్మాణం, పోలింగ్ సిబ్బందికి బాత్రూం సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అంతలోపు పోలింగ్ బూత్లను అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకరావాలని ఎన్నికల కమీషన్ ఆదేశించడంతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ కనెక్షన్ లేకుంటే అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్ను ఏర్పాటు చేయడానికి విద్యుత్ సంస్థ అధికారులను ఆదేశించారు. పోలింగ్ బూత్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు పరిశీలిస్తు సౌకర్యాలు లేని వాటిల్లో పునరుద్దరణ పనులు చేపట్టడానికి ఆదేశాలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో 239 పోలింగ్ బూత్లు ఉండగా, ఆర్మూర్ నియోజకవర్గంలో 211 పోలింగ్ బూత్లు ఉన్నాయి. బోధన్లో 239, నిజామాబాద్ అర్బన్లో 218, నిజామాబాద్ రూరల్ పరిధిలో 272, బాన్సువాడ నియోజకవర్గంలో 223 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొత్తం 1,402 పోలింగ్ బూత్లు ఉండగా అన్ని బూత్లలో విద్యుత్, ర్యాంపులు, బాత్రూం తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ రోజున ఓటర్లు, సిబ్బంది కోసం తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. పోలింగ్ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సౌకర్యాల కల్పనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. -
అసలు నిల్వ ఎంత?
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటి కోసం ఓవైపు రైతాంగం పోరాటం కొనసాగిస్తుంటే, చుక్కనీటిని వదిలేందుకు కూడా సర్కారు ససేమీరా అంటోంది.. అయితే, అసలు జల వివాదానికి మూలమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యమెంత..? పేరుకుపోయిన పూడిక ఎంత? అనే దానిపై అనుమానాలెన్నో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పూడిక పేరుకుపోయింది. 1994లో నిర్వహించిన సర్వే ప్రకారం 22 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు తేలింది. అప్పటి నుంచి ఇప్పటికీ అవే లెక్క ల ప్రకారమే నీటి నిల్వల గురించి చెబుతున్న అధికారులు.. 2014–2015లో నిర్వహించిన సర్వే నివేదికను మాత్రం బయట పెట్టడం లేదు. దీనిపై సర్కారు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఎస్పారెస్పీ నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయిందని అప్పట్లో సర్వే నిర్వహించిన సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని స్పష్టం చేసింది. అయితే, ఈ నివేదికను ఇటు సర్కారు, అటు అధికారులు బయట పెట్టడం లేదు. పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టడం లేదు. ఎందుకంత గోప్యత? శ్రీరాంసాగర్ తాజా నీటి నిల్వ సామర్థ్యంపై ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారనేది అంతు చిక్కని రహస్యంగా మా రింది. వాస్తవానికి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ముందుకు రాని ప్రభుత్వం.. పూ డికను పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడో రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలు చెబుతుండడంౖ పె ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ప్రాజెక్ట్లో ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం ఎం త... ప్రస్తుతం ఎంత నీరు నిల్వ ఉందని ప్రశ్నిస్తున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం లెక్కల్లో ప్రస్తు తం 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ లెక్కలు వాస్తమై తే ప్రాజెక్ట్లో తాగునీటి అవసరాలకు, డెడ్ స్టోరే జీకి పోను మిగిలిన నాలుగు టీఎంసీల్లో అర టీఎంసీ నీటిని వదిలి తమ పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం వేరు.. అయితే, 2014 డిసెంబర్, 2015 జనవరిలో నిర్వ హించిన పూడిక సర్వేలో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామ ర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందని తేలింది. ఆ నివేదిక ప్రకారమైతే, ప్రస్తుతం ప్రాజెక్ట్లో 15.93 టీఎంసీల నీరు నిల్వ ఉండదు. అందుకనే, సర్కారు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయ డం లేదని కాకతీయ కాలువ పరివాహ ప్రాంత రైతు లు చెబుతున్నారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీచార్జి ల్యాబోరేటరీ (ఏపీఈఆర్ఎల్) నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగానే ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ అధికారులు 90 టీఎంసీలుగా పేర్కొంటున్నారు. అయితే, గత 24 ఏళ్లలో ప్రాజెక్ట్కు భారీ వరదలు వచ్చాయి. వరదలతో పాటు పూడిక వచ్చి చేరింది. కానీ, అధికారులు రెం డు దశాబ్దాల క్రితం నాటి లెక్కలే చెబుతుండడం విశేషం. 1994లో సర్వే నిర్వహించిన అదే ఏపీఈఆర్ఎల్.. 2014లోనూ సర్వే నిర్వహించింది. భారీగా పూడిక చేరిందని, ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని ఆ సంస్థ తన నివేదిక లో వెల్లడించింది. కానీ అధికారులు ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికీ 90 టీఎంసీల సామర్థ్యంలోనే లెక్కలు చూపుతున్నారు. పూడిక ఎంతుందో బయట పెట్టకుండా నీటి నిల్వలపై కాకి లెక్కలు చూపుతున్నారని యకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీలో అసలు నిల్వ ఎంత ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పూడిక’ లెక్కలు.. శ్రీరాంసాగర్కు పూడిక ముప్పు ముంచుకొస్తుంది. ఏటా ప్రాజెక్ట్లోకి భారీ వరదల వలన వచ్చే మట్టి తో ప్రాజెక్ట్లో భారీగా పూడిక పేరుకుపోతోంది. ఫలితంగా ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. మొద ట్లో 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపో యింది. 1994లో ఏపీఈఆర్ఎల్ సంస్థ సర్వే ప్రకా రం ప్రాజెక్ట్లో 21.71 టీఎంసీల పూడిక చేరింది. తరువాత అదే సంస్థ 2006లో చేపట్టిన సర్వే ప్రకా రం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయింది. కానీ ఆ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. 2008లో రీసర్వే కోసం ప్ర తిపాదనలు పంపించగా, 2014 డిసెంబర్లో రీసర్వే చేపట్టారు. ఆ సర్వే ప్రకారం ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడి పోయిందని తేలింది. ప్రాజెక్ట్లో పూడిక తొలిగించి ఆయకట్టును కాపాడాలని వేడుకుంటున్నారు. ఎస్సారెస్పీలోకి స్పల్వ ఇన్ఫ్లో.. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. 550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 1062.10(16.06 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. బురదలోకి రివర్స్ స్లూయిజ్ గేట్లు ఎస్సారెస్పీలో పేరుకు పోయిన పూడికను వరదల ద్వారా తొలిగించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే ఆరు ఆరు రివర్స్ స్లూయిజ్ గేట్లను నిర్మించారు. కానీ, ప్రాజెక్ట్ నుంచి ఇన్నేళ్లు వందల టీఎంసీల నీరు గోదావరి పాలు చేసినా, ఏ రోజు కూడా ఈ గేట్లను ప్రాజెక్ట్ అధికారులు వినియోగించలేదు. రివర్స్ స్లూయిజ్ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. గేట్లను ఎత్తితే కిందకు దిగే పరిస్థితి లేకపోవడంతో అధికారులు అటు వైపు ఏనాడు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఎస్సారెస్పీలో పూడిక భారీగా పేరుకు పోయింది. -
మలేషియా ఉద్యోగాల పేరుతో మోసం
నిజామాబాద్ : మలేషియాలో 10 మంది నిజామాబాద్ వాసులు ఇరుక్కుపోయారు. ఓ గల్ఫ్ ఏజెంట్, రూ.35 వేలు జీతం అని చెప్పి విజిట్ వీసాలతో పది మందిని మలేషియా పంపించాడు. మలేషియాలో తిండీ గూడు లేక తిరిగొచ్చేందుకు డబ్బులు నరకయాతన పడుతున్నారు. బాధితుల స్వస్థలం బాల్కొండ మండలం జక్రాన్ పల్లి. రూ.60 వేలు కట్టబెట్టి వచ్చినా నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వాట్సప్ వీడియోల ద్వారా బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
నీవు లేని.. జీవితం మాకొద్దు
కమ్మర్పల్లి(బాల్కొండ) : కూతురి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్లో చోటుచేసుకుంది. రెండు నెలల కిత్రం అనారోగ్యంతో చిన్నారి కూతురు మృతి చెందడంతో దంపతులిద్దరు తీవ్ర మనస్థాపం చెందారు. అప్పటి నుంచి కూతురును పదేపదే తలచుకుంటూ నీవు లేక సమాజంలో బతకలేకపోతున్నాం.. అంటూ డైరీలో రాసి శనివారం ఉదయం గరిపె సందీప్(30), పూజ(26) ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన గరిపె సందీప్, పూజ దంపతుల కూతురు సహన(5) అనారోగ్యంతో రెండు నెలల కిత్రం మరణించింది. దీంతో దంపతులిద్దరూ డిప్రెషన్లోకి వెళ్లారు. కూతురుని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి వెళ్లి పడుకోవడం, కూర్చోవడం, ఏడ్వడం చేశారు. గ్రామస్తులు, సన్నిహితులు వారిని ఇంటికి తీసుకువచ్చి సముదాయించారు. కూతురును తలచుకుంటూ పదేపదే ఏడుస్తూ తీవ్ర మనస్తాపం చెందిన దంపతులిద్దరూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు తల్లి సత్తెమ్మ, తండ్రి బాలయ్య, రెండు నెలల కొడుకు మణిదీప్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మురళి సంఘ టన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆకలైతే అన్నం తింటున్నం.. మనసునైతే పడతలేదు ఆకలైతే అన్నం తింటున్నం, కానీ మనసునైతే పడతలేదని దంపతులిద్దరు డైరీలో రాసుకున్నారు. డైరీలో పాపపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. నీవు లేని ఈ సమాజంలో మేమేందుకుండాలి.. చనిపోవాలనుకుంటున్నాం అని రాశారు. కూతురును మరిచిపోలేకపోతున్నాం.. చనిపోతున్నాం అని రాసుకున్నారు. -
కాకతీయ కాలువకు పెరిగిన నీటి విడుదల
బాల్కొండ : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నుంచి 6500 క్యూసెక్కులకు నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం పెంచారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని నీటి విడుదలను పెంచినట్లు వారు తెలిపారు. సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1059.40(12.95 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పెరగడంతో జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. మూడు టర్బయిన్ల ద్వారా 10.70 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. -
లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి
► టార్గెట్ 68 మిలియన్ యూనిట్లు ► ఇప్పటివరకు ఉత్పత్తి అయింది 68.17 ఎం.యూ. ► నెలాఖరులోపు మరింత పెరగనున్న ఉత్పత్తి బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలని విద్యుత్సౌధ లక్ష్యం విధించింది. టార్గెట్ దాటడంపై జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు మరో ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నిల్.. కాకతీయ కాలువకు నీటి విడుదల ద్వారా స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గతేడాది ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయలేదు. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మిలియన్ యూనిట్లే విద్యుదుత్పత్తి జరిగింది. మూడేళ్ల తరువాత ఈ సంవత్సరమే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. టార్గెట్ తక్కువే.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం దాటడం హర్షణీయమే కానీ, విధించిన లక్ష్యమే చాలా తక్కువ. వాస్తవానికి 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా కనీసం 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని గతంలో నిర్దేశించారు. ఒక్క టీఎంసీ నీటితో ఒక మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చిన సమయంలో స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో 137 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం 102 టీఎంసీల నీరు గోదావరి పాలైనా, రబీ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా 68 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి పెద్ద గొప్పేమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గత మూడేళ్లలో ఈసారే అత్యధికంగా ఉత్పత్తి కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల ఉత్పత్తిని లెక్కలోకి తీసుకొని.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని çవిద్యుత్ సౌధ నిర్ణయిస్తుంది. గత పదేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని సగటుగా లక్ష్యం నిర్దేశిస్తారు. దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. – శ్రీనివాస్రావు, జెన్కో ఎస్ఈ, ఎస్సారెస్పీ -
పొంగిపొర్లుతున్న గోదారి
రెంజల్/బాల్కొండ/నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లతో పాటు ఎగువన మహారాష్ట్రలో గల విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఆదివారం వేకువ జామునుంచి గోదావరి నది పొంగిపొర్లుతోంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మంజీర, హరిద్ర, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనకు ఆనుకుని రోడ్డు పై నుంచి వరద నీరు ప్రవహించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు స్పందించి గోదావరి పరవళ్లను పరిశీలించేందుకు వచ్చే సందర్శకులను గ్రామసరిహద్దులోనే నిలిపివేస్తున్నారు. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కందకుర్తిలో వేలాది ఎకరాల పంటలు పూర్తిగా నీటమునిగాయి. మంజీర, హరిద్ర నదుల పరీవాహకం వెంట వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి శనివారం అర్ధరాత్రి నుంచి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ 42 వర ద గేట్లను ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీలోకి.. విడుదల చేసిన మంత్రులు ఈటల, పోచారం కాకతీయ, వరద కాల్వల ద్వారా 8,200 క్యూసెక్కులు ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు లక్ష్యంగా విడుదల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీలకు చేరిన నీరు త్వరలోనే ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు : మంత్రి ఈటల మల్లన్నసాగర్కు ప్రజలే అండ.. ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం : మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాం(ఎల్ఎండీ)కు బుధవారం రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 2,200 క్యూస్కెకులు, వరద కాలువ ద్వారా మరో 6,000 క్యూస్కెల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. గురువారం వరదకాల్వ నుంచి అదే 6,000 క్యూసెక్కుల నీరు వెళ్లనుండగా, కాకతీయ కాల్వ నుంచి మాత్రం 4,400 క్యూసెక్కులు పెరగనుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో మంగళవారం 46 టీఎంసీలకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్రావు సూచన మేరకు నీటిని విడుదల చేసినట్లు మంత్రులు ప్రకటించారు. ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు చేరితే.. అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగు నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ నీటి విడుదల అనంతరం మంత్రులు ‘మీడియా’తో మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీరు చేరినందున అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికి ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు చేరుకున్నదని మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్లు వివరించారు. ఇంకా వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఆశిస్తున్నామని, తద్వారా ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చే నీటి వల్ల వరంగల్, కరీంనగర్తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు లభిస్తుందన్నారు. నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్షం : ఈటల పంటలు పండించడంలో నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం బాల్కొండ మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.. జిల్లాలో అంకాపూర్, అంక్సాపూర్ వంటి గ్రామాల్లో పసుపు, ఇతర పంటలు పండించడంతో జిల్లా దేశానికే ఆదర్శమైందన్నారు. తెలంగాణాలోని ప్రతి గ్రామం అంకాపూర్ల సాగులో ముందుండాలనే మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి ఎకరానికి నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రతి పక్షాలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మల్లన్న సాగర్కు అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిజమాబాద్ జిల్లా మొదటి నుంచి అండగా నిలిచిందన్నారు. అందుకే జిల్లాలో 9 మంది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు. మల్లన్నసాగర్కు ప్రజలే అండ : పోచారం మల్లన్న సాగర్ను అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండాలంటే ఆగస్టు వరకు ఆగాల్సి వచ్చిందంటే గోదావరి ఎగువ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్లు నిర్మించడం వల్లనే అన్నారు. అలా కాకుండా రైతులకు సకాలంలో నీరందించాలనే శాశ్వత పరిష్కారం కోసం మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి జూన్–జూలై చివరి వరకు 1000 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. అలా వృథా కాకుండా నీటిని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి మల్లన్న సాగర్కు మళ్లించుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో ముంపునకు గురవుతన్న ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ప్రకటించారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ఎస్సారెస్పీ నింపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం అ«ధ్యక్షుడు వేముల సురేందర్రెడ్డి, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి, జెన్కో డైరెక్టర్ వెంకటరత్నం, సీఈ మురళీధర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్యాదవ్, ఎంపీపీ అర్గుల్ రాధా, వైస్ ఎంపీపీ శేఖర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సామవెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి ముస్కు భూమేశ్వర్, యూత్ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి పాల్గొన్నారు. ఎల్ఎండీలో 2.4 టీఎంసీల నీరు.. అందుకే నీటి విడుదల : ఎస్సారెస్పీ ఏసీఈ శంకర్ ఎస్సారెస్పీ నుంచి బుధవారం కాకతీయ, వరద కాలువల ద్వారా మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా క్రమంగా నీటి విడుదలను పెంచుతామని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ శంకర్ తెలిపారు. ఎల్ఎండీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ భాగన ఉన్న ప్రధాన ప్రాజెక్ట్లు విష్ణుపురి, బాబ్లీ ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. గైక్వాడ్ ప్రాజెక్ట్ కూడ 75 శాతం నిండిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో ఉన్న నీటితో ఎస్సారెస్పీ మొదటి దశలో 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరందించుటకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీ లిప్ట్ వద్ద పనులు చేపట్టడానికి వీలు లేకుండా నీరు వచ్చి చేరడం వల్ల అనుకున్న సమయంలో లిఫ్ట్ పనులు పూర్తి చేయలేక పోయామన్నారు. రెండు మోటర్లు సిద్ధమయ్యయయన్నారు. ఆ రెండు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసి లక్ష్మీ కాలువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుతుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వార విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఒక్క టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా నుంచి కదలివచ్చిన నేతలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ వెంట కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి వచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్లు, కన్నూరు సంపత్రావు, పొనగండి మల్లయ్య, యేబూసి రామస్వామి, టి.రాజేశ్వర్రావు, చెల్పూరు ప్రభాకర్లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు ఎస్సారెస్పీ నీటి విడుదల సందర్భంగా మంత్రి వెంట పోచంపాడుకు వచ్చారు. -
'మల్లన్నసాగర్ను అడ్డుకుంటే ఖబడ్దార్'
బాల్కొండ (నిజామాబాద్) : మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పోటాపోటీగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ నెలరోజులుగా ఏటిగడ్డ కిష్టాపూర్లో దీక్షలు చేస్తుండగా.. మరోవైపు ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి ఆత్మహత్యలు అరికట్టాలంటూ దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే గోవర్థన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ ధర్నాచౌక్లో టీఆర్ఎస్ నిరసన తెలిపింది. ప్రతిపక్షాల దిష్టిబొమ్మను తగులబెట్టడంతోపాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మోర్తాడ్లో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లన్న సాగర్ను నిర్మించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా మల్లన్నసాగర్ను అడ్డుకుంటే ఖబడ్దార్ అంటూ మంత్రి హరీష్రావు ప్రతిపక్షాలను హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బస్వాపూర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగు గ్రామాల ప్రజల కోసం రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
కానిస్టేబుల్ బలవన్మరణం
బాల్కొండ (నిజామాబాద్) : ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి గురువారం బాల్కొండలోని నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను కడతేర్చిన భర్త
బాల్కొండ: మండలంలోని సావెల్ గ్రామంలో అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఏడడుగులు నడిచి పదికాలల పాటు కలిసి ఉంటామని బాస చేసిన భర్త కత్తితో పొడిచి చంపేశాడు. బాల్కొండ ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సావెల్ గ్రామానికి చెందిన ఎండ్ర లీల(35)ను భర్త పిరాజీ శనివారం రాత్రి హత్య చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకారాకు చెందిన పిరాజీ, లీలా దంపతులు 8 ఏళ్ల క్రితం సావెల్ గ్రామానికి రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా లీలా ఐదు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను హాస్టల్లో చేర్పించడానికి వెళ్లి, శుక్రవారం ఇంటికి వచ్చింది. రాత్రి పిరాజీ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజలు ఎక్కడికి వెళ్లావని లీలాతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో పిరాజీ లీలా తలపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై లీల అక్కడిక్కడే మృతి చెందింది. లీలాకు అక్రమ సంబంధం ఉందని తరుచూ గొడవ పడేవాడని లీలా కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా ఉదయం హోటల్లో టీ తాగి పరారయ్యాడు. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా, రైతు మృతి
ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో కోసిన పసుపు పంటను రైతు మెంటి సాయన్న(38) కళ్లం దగ్గరకు తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రైతు మెంటి సాయన్న మృతిచెందాడు. రైతు సాయన్నకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
సీఎం సారూ.. హామీలు మరిచారా!
ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది. ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు. గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ? మోర్తాడ్ : బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ‘పసుపు’.. ఊసే లేదు ! బడ్జెట్లో పసుపు పథకానికి దక్కని చోటు నిధులు కేటాయించని సర్కార్ మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. -
‘శ్రీరాంసాగరానికి’ 36 ఏళ్లు..
బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామాలంగా మార్చి ఉత్తర తెలంగాణకే కల్పతరువుగా నిలిచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నకు శ్రీరాంసాగర్గా నామాకరణం చెంది నేటికి 36 ఏళ్లు పూర్తయింది. 1978 కి ముందు శ్రీరాంసాగర్ పోచంపాడ్ గానే వెలుగొం దింది. కాగా 1978 నవంబర్ 5న ప్రాజెక్ట్కు అధికారిక పర్యాటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి పోచంపాడ్ ఉద్యోగులు ఒక విన్నపం చేశారు. ఆ విన్నపం మూలంగానే పోచంపాడ్ నేటి శ్రీరాంసాగర్గా మారింది. విన్నపం ఏమంటే...ఉతర్త తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ ఇంత మందికి ఉద్యోగాలు కల్పించిన ప్రాజెక్ట్ను పోచం‘పాడు’గా పిలువడం బాధాకరమని విన్నవిం చారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పవిత్ర గోదావరి నదీ తీరాన రామాలయం ఉంది. కావున పోచంపాడ్కు శ్రీరాంసాగర్గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే ప్రాజెక్ట్కు ఉన్న మూడు ప్రధాన కాలువలకు కూడ పేర్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజె క్ట్ శ్రీరాంసాగర్గా పిలువబడుతుంది. -
కూరగాయలతో లాభాల బాట
బాల్కొండ: మండలంలోని పలువురు రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటమార్పు చేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్ గ్రామ రైతులు పంట మార్పిడి చేసి కూరగాయలకు సాగు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన పంటలైన మొక్క జొన్న, సోయా, జొన్న, సజ్జ , పసుపు పంటలను అధిక మొత్తంలో సాగు చేయడం వల్ల డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు కూరగాయల వైపు మళ్లుతున్నారు. గేదే నిత్యం పాలిచ్చినట్లు కూరగాయల వలన రైతులకు నిత్యం డబ్బులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. అందకే ఎకరాల్లో వంకాయ, టమాట, కొతిమీర, పువ్వుగోబీ, గోబీగడ్డ , బెండకాయ, బీరకాయలను అధిక ంగా సాగు చేస్తున్నారు. అన్నివేళల పనికి వచ్చే మిరప సాగును కూడా పెంచారు, ఇలా పలు రకాల కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఆలుగడ్డను కూడా సాగు చేస్తున్నారు. పంట మార్పిడితోనే దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచించడంతో రైతులు కూరగాయల సాగుబాట పట్టారు. బుస్సాపూర్లో ఓరైతు అరఎకరంలో గోబీ, అందులోనే అంతర్ పంటగా కొతిమీర సాగు చేశాడు. ఇలా రైతులు రకరకాల ప్రయోగాలను చేస్తు ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు పొందుతున్నారు. మార్కెట్లు అందుబాటులో లేక.. కూరగాయల విక్రయాలకు రైతులకు మార్కెట్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాల్కొండ మండలంలో కూరగాయలు సాగు చేసే రైతులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లేదా ఆర్మూర్ సమీపంలో ఉన్న పెర్కిట్, అంకాపూర్ మార్కెట్లకు తీసుకెళ్లాలి. దీంతో రైతులకు రవాణా భారం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి, స్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేసి, కూరగాయలను సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. -
సాలు సాలుకో కాలిబాట
బాల్కొండ : సాధారణంగా వరిలో కాలిబాట తీసే రైతులు తూర్పు, పడమర దిశల్లో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల ఖాళీ స్థలాన్ని వదులుతారు. మోహన్రెడ్డి మాత్రం సాలుసాలుకో కాలిబాట తీస్తున్నారు. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ఇందులో మూడేళ్లుగా ఈ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధానం గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సూర్యుడు ఉదయించే దిశ నుంచి అస్తమించే దిశకు మడిలో దారం కడతాను. ఆ దారంపైనుంచి వరి నాట్లు వేస్తాను. సాలు సాలుకు ఇలాగే నాట్లు వేస్తాను. సాళ్లకు మధ్యలో ఖాళీ స్థలాన్ని వదులుతాను. ఇలా ఖాళీ స్థలాన్ని వదలడం వల్ల పంటపై సూర్యరశ్మి బాగా పడుతుంది. గాలి ఎక్కువగా సాలు దిశలోనే వీచడం వల్ల వరికర్రలకు బాగా గాలి తగులుతుంది. దీంతో పంటకు చీడపీడల బాధ తగ్గుతుంది. చీడపీడలు ఆశించినా.. సూర్యరశ్మి ప్రభావంతో తగ్గిపోతాయి. కాలి బాటల వల్ల చీడపీడల వ్యాప్తి ఉండదు. గాలి బాగా తగలడం వల్ల పిలకలు బాగా వస్తున్నాయి. కంకులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతోంది. కాలి బాటలు లేకుండా సాగు చేసిన పొలంలో కంటే గతేడాది ఎకరానికి నాలుగు బస్తాల దిగుబడి ఎక్కువగా వచ్చింది’’ అని మోహన్రెడ్డి వివరించారు. ఈ పద్ధతిలో మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నానని తెలిపారు. ఇతర ప్రయోజనాలు వరి పంటలో కాలి బాటలు వేయడం వల్ల ఎరువులు పొలం అంతా సమానంగా పడతాయి. కలుపును సునాయాసంగా తీయవచ్చు. నీరు పెట్టినప్పుడు అంతటికీ నీరందుతుందో లేదో పరిశీలించవచ్చు. {పధానంగా దోమపోటుకు టాటా చెప్పవచ్చు. వరి పంట ఈనిక దశ తర్వాత దోమపోటు వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల పంటలో తెల్ల కంకులు ఏర్పడతాయి. కాలి బాటల వల్ల దోమపోటు వేగంగా వ్యాపించదు. -
‘డి-గ్రూపు’తో రైతు డీలా
బాల్కొండ: విద్యుత్ సరఫరా కోసం అధికారులు నిర్ణయించిన డి-గ్రూపుపై రైతులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రైతులను విద్యుత్తు కోతల కంటే అధికంగా డి-గ్రూపు కలవర పెడుతోంది. నెలరోజులుగా ట్రాన్స్కో అధికారులు సాగుకు నాలుగు గ్రూపులుగా విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. అంతకు ముందు మూడు గ్రూపులలో విద్యుత్ను స రఫరా చేసేవారు. ప్రస్తుతం నాలుగో గ్రూపుగా డి-గ్రూపు ద్వారా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ రుత డి పంటలకు నీరందించే రైతులు డి-గ్రూపుతో తీవ్ర కలవరానికి గురవుతున్నారు. రాత్రి పూట పంటకు ఎలా నీరందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు గం టల విద్యుత్ను ఐదు గంటలకు కుదించారు. అందులోనూ ఇన్కమింగ్ పేరిట రెండు గంటల కోతలు విధిస్తున్నారు. దీని భావమేమిలో? విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని నాలుగో గ్రూపు ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ, పగలు ఏదో ఒకగ్రూపు ఖాళీగానే ఉంచుతున్నారు. లోడ్ తగ్గించడానికే అయితే, అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో రెండు గ్రూపులలో విద్యుత్ సరఫరా చేస్తే ఫలితం ఉంటుందని రైతులు అం టున్నారు. అలా కాకుండా నాలుగు గ్రూపులుగా విభజించి, మూడు గ్రూపుల ద్వారానే విద్యుత్ సరఫరా చేయడం వెనుక మర్మం ఏమిటో తెలియక వారు కలవరపడుతున్నారు. ట్రాన్స్కో అధికారుల పూటకో నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలు ఎండి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా, అధికారులలో ఎలాం టి మార్పులేదు. వరి సాగుచేసే ప్రాంతంలో రాత్రి కరెంట్ సరఫరా ఉంటే వరి పంటకు నీరందించవచ్చు. ఆరు తడిపంటలు పండించే ఆర్మూర్ సబ్ డివిజన్ లాంటి ప్రా ంతంలో డి-గ్రూపు వృథా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలకు రైతులు దగ్గరుండి నీటి సరఫరా చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. ట్రాన్స్కో అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. సాగుకు విద్యుత్ సరఫరా వేళలు ప్రస్తుతం సాగుకు నాలుగు గ్రూపులలో అధికారులు విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. ఎ- గ్రూపులో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు, బి- గ్రూపులో ఉదయం తొమ్మిది గంటల నుంచి పగలు రెండు గంటల వరకు, సి-గ్రూపులో పగలు రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు, డి-గ్రూపులో రాత్రి పది గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. ఇక అనధికార కోతలకు లెక్కే లేదు. -
విత్తన తిప్పలు తప్పాయిలా
బాల్కొండ : రెంజర్లకు చెందిన రైతు బొమ్మెన భూమేశ్వర్కు రెండెకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో సోయా, మరో ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా సోయా పండిస్తున్నాడు. మొదటి రెండేళ్లు సోయా విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. పండించిన పంటలోంచి విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం గురించి తెలుసుకున్నాడు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్నాడు. విత్తనాలను ఉత్పత్తి చేసి వాటితోనే ఖరీఫ్లో పంట సాగు చేస్తున్నాడు. విత్తనోత్పత్తి గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సోయా పంట చేతికి రాగానే ఒక బస్తా సోయా విత్తనాలను వేరుగా ఆర బెట్టాను. తేమ శాతం 12కు చేరుకున్న తర్వాత మట్టి పెళ్లలను, పగిలిన, ముక్కిన విత్తనాలను తీసివేశాను. తర్వాత కార్బండిజమ్, మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించి, మళ్లీ ఎండలో ఆరబెట్టాను. రెండు రోజుల తర్వాత ప్లాస్టిక్ బస్తాలో నింపి, తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. సోయా పంట విత్తే సమయంలో విత్తనాలను మళ్లీ ఆర బెట్టాను. 100 విత్తనాలను తీసుకొని నీటిలో నానబెట్టాను. అందులోంచి 80 శాతం కంటే ఎక్కువ విత్తనాలకు మొలకలు వచ్చాయి. దీంతో విత్తనాలను పొలంలో చల్లాను. ఎకరానికి 40 కిలోల విత్తనాలు సరిపోయాయి. 80 శాతం కంటే ఎక్కువే మొలకెత్తాయి. పంట బాగా ఎదుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి తెగులూ సోకలేదు. పూత కూడా బాగానే వస్తోంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా’’ అని వివరించాడు. -
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
బాల్కొండ : తెలంగాణ రాష్ర్టంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముప్కాల్ ఉన్నత పాఠశాలలో *21.20 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులందరికీ ఆంగ్ల విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలను 15 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. విద్యా విలువ వెల కట్ట లేనిదాన్నరు. విద్యా అందరికి బ్రహ్మస్త్రం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే... ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం లేకనే కూలి పనిచేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారన్నారు. ప్రభుత్వ పా ఠశాలల్లో మంచి విద్యనందిస్తే ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపుతారన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించని వారు కూ డా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. వారందరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. కరెంట్ కొరతను అధిగమిస్తాం.. రాష్ట్రంలోప్రస్తుతం విద్యుత్తు కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. తెలంగాణకు 8 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటే ప్రస్తుతం సగం నాల్గు వేల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో 24 గంటల విద్యుత్తును అందిస్తామన్నారు. సా గుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వా ల హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి భ రతం పడుతామన్నారు. అడ్డగోలుగా ఇళ్లు కేటాయించుకుని బిల్లులు కాజేసిన పెద్దల భరతం పట్టి కేసులు పెడుతామన్నారు. అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. బోగస్ బిల్లులను రికవరీ చేస్తామన్నారు. ఈనెల 19 నిర్వహించే కుటుంబ సర్వేకు అందరు సహకరించాలని కోరారు. తెలంగాణకు అన్యాయం సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పోచారం అన్నా రు. మండలంలోని పోచంపాడ్ కూడలీ వద్ద గల బాలికల గురుకుల పాఠ శాలలో నూతనంగా *1.5 కోట్ల నిధులతో నిర్మించిన వసతి గృహన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాఫేధర్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతు.. సొమ్ము మనదైతే.. సోకు ఆంధ్రోళ్లు చేశారన్నారు. తెలంగాణ నిధులు, ఉద్యోగులను కొల్లగొట్టారన్నారు. సన్మానాలు వద్దు... మీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పూల మాలలతో స న్మానాలు చేయడం వద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలతోనైన సన్మానించ వచ్చన్నారు. సన్మానాల పేరిట గంటల సమయాన్ని వృథా చేసుకోవడం సరికాదన్నారు. -
ట్రాన్స్కోనా మజాకా!
బాల్కొండ/రెంజల్/నిజామాబాద్ నాగారం: వ్యవసాయానికి కరెంటు సరఫరా వేళలలో పూటకో నిర్ణయం తీసుకుంటూ ట్రాన్స్ కో అధికారులు రైతులను అయోమయంలో పడవేస్తున్నారు. ఆదివారం నుంచి సరఫరా వేళలను మార్చారు. కానీ, ఇన్కమింగ్ పేరిట కోతలను తీవ్రం చేశారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు కరెంట్ కట్ చేస్తే, 11.20 గంటలకు వచ్చింది. మళ్లీ శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు, ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 1.20 వరకు, 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇన్కమింగ్ పేరిట విద్యుత్ కోతలను విధిం చారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు మూడు గ్రూపులలో కరెంటును సరఫరా చేసిన ట్రాన్స్కో అధికారులు ఆదివారం నుంచి దానిని నాలుగు గ్రూపులకు మార్చారు. సరఫరాలో అధిక లోడ్ పడకుండా ఉండాలనే గ్రూపులుగా విభజించామని గతంలో ట్రాన్స్కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ‘డి’ గ్రూపు వేళలను చూస్తే, రెండు గ్రూపులలో ఒకే సారి సరఫరా ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. రాత్రి కరెంట్కు ఎగనామం పెట్టడానికే ‘డి’ గ్రూపును సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమి తీరు! ఎ గ్రూపులో రాత్రి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బి గ్రూపులో 12 గంటల నుంచి 2 గంటల వరకు, సి గ్రూపులో 2 గంటల నుంచి 4 గంటల వరకు స రఫరా చేస్తారు. డి గ్రూపులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎ, బి, సి గ్రూపులలో రాత్రి పూట ఇచ్చే క రెంటుపై అధిక లోడ్ పడదా? సరఫరాకు అంతరాయం జరగదా? ఇది అధికారులకే తెలియాలి. -
స్వర్ణోత్సవ శోభ వచ్చేనా!
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పునాది రాయి పడి నేటితో 51 ఏళ్లు పూర్తికాగా, 52వ వసంతం మొదలవుతోంది. 1963 జూలై 26న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎస్సారెస్పీ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. గతేడాది 50 ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణోత్సవాల నిర్వహణ కు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు తగి లిందని ప్రభుత్వం కుంటిసాకు చెప్పింది. అధికారులు స్వర్ణోత్సవ వేడుకలకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ మోక్షం కలగలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ప్రాజెక్టు స్వర్ణోత్సవం జరుపుతుం దని అందరూ ఊహించారు. అయితే అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గా నీ ఎలాంటి చర్యలు చేపట్టినదాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్ పై ఇన్నాళ్లు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించారనే వచ్చిన విమర్శలు ఇక నుంచి కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎస్సారెస్పీని పట్టించుకోవాలని ఆయక ట్టు రైతులు కోరుతున్నారు. స్వర్ణోత్సవ సంబురాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మాయని మచ్చ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో 2007-2010 వరకు జరిగిన పనుల్లో అవినీతి అక్రమాల పంచాయతీ ఎడతెగకుండా సాగడం ప్రాజెక్ట్ అభివృద్ధికే ప్రతి బంధకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల గైడ్ వాల్స్, కాలువల లైనింగ్ పనులు 2007-10 వరకు మూడేళ్లలో రూ. 278 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో డివిజన్-2 నుంచి 227 పనులు, డివిజన్ -5 నుంచి 406 పనులు, డివిజన్-1 నుంచి 1247 పనులు చేపట్టారు. అయితే పనుల్లో అక్రమాలు జరిగాయంటూ,పనులు చేయకుండనే బిల్లులు ఎత్తారని అనేక ఆరోపణాలు వచ్చాయి. దీంతో తీగా లాగితే డొంక కదిలింది. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగి ప్రాజెక్ట్ అధికారులను ఒక కుదుపు కుదిపాయి. 87 మంది ఇంజినీర్లు నోటీసులు అందుకోగా, 21 మంది ఇంజినీర్లు సస్పెండ్ అయ్యారు అయినా సమస్య తొలిగి పోలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లు రాక గుండె పోటుతో మరణించినా, ఆపనుల తాలూకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం కరుణించడంలేదు. అందుకు కారణం పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడమే! అధికారులు బంగారు గుడ్లు పెట్టే బాతుల ఎస్సారెస్పీని వాడుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వర్క్ ఆర్డర్ చేయడమంటే ప్రాజెక్ట్ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చేయని పనులకు కూడ బిల్లులు అందించారని విమర్శలున్నాయి. ఫలితంగా శిక్ష కూడ అనుభవించారు. అయినా ఎస్సారెస్పీని ఆపనులు మచ్చలాగా వెంటాడుతునే ఉన్నాయి. చివరికి పనులు ఎంత వరకు నాణ్యతతో చేపడితే అంతవరకు కొలతలు చేసి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముందుగా బిల్లులు మంజూరైన కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని మూడేళ్ల క్రితం నోటీసులు కూడ ఇచ్చింది. అయితే రికవరీ మాత్రం జరగలేదు. ఇతర పనులు కొలతలు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చె ందుతున్నారు.రెండేళ్ల క్రితం ఎల్ఎండీలో రూ. 30 లక్షల పనులు చేసి బిల్లులు అందక ఒక నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు గుండె పోటుతో మృతి చెందాడు. కాగా ఎస్సారెస్పీ పనులు అంటేనే ప్రభుత్వాలకు విసుగు వచ్చేల అవినీతి జరిగిందని అంటున్నారు. దీంతో ఏపని చేపట్టినా నిధులు మంజూరు కావడం లేదంటున్నారు. ప్రస్తుతం ఒక పనికి అధికారులు అంచన విలువ తయారు చేసి ప్రతి పాదనలు పంపిణీ చేసేందుకు జంకుతున్నారు. బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం వలన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడంలేదు. కొత్త ప్రభుత్వంలోనైన ఎస్సారెస్పీకి మహర్దశ పట్టాలని రైతులు కోరుతున్నారు. -
‘లక్ష్మీ’ లిఫ్ట్ రాత మారేనా..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, సరస్వతి కాలువలతో సమానంగా లక్ష్మీ కాలువకు నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో, 2007లో ప్రాజెక్ట్లో 1,045 అడుగుల నీటిమట్టం వద్ద రూ.25 కోట్లతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. కాని ఏడేళ్లు కావస్తున్నా ఇంత వరకు పనులు పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా పనులు ముందుకు సాగి లక్ష్మీ లిప్ట్ రాత మారుతుందా అని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్లో ప్రస్తుత ఏడాది నీరు అధికంగా ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. నీరు లేనప్పుడు పాలకులు పట్టించుకోలేదు. దీంతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు అందని గిఫ్ట్గా మారింది. ఉద్దేశం ఇది... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం కోల్పోయిన జిల్లా రైతాంగానికి ఎంతో కొంత నీరందిస్తున్న ఏకైక కాలువ లక్ష్మీ. ఆ కాలువ ద్వారా ప్రాజెక్ట్ నుంచి 1,064 అడుగుల నీటిమట్టం వరకు మాత్రమే నీటి సరఫరా చేపట్టవ చ్చు. దీంతో లక్ష్మీ కాలువ ఆయకట్టు రెండో పంటకు చివరి వరకు నీరందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్ట పోతున్నారు. వీరి నీరివ్వడానికి లక్ష్మీ లిఫ్ట్ పనులు చేపడతున్నారు. కాని ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్ను మార్చినా... లిఫ్ట్ నిర్మాణంలో సివిల్ పనులను ఒక కంపెనీ దక్కించుకోగా, మెకానికల్ పనులను కిర్లోస్కర్ అనే కంపెనీ దక్కించుకుంది. కాని పనులు నత్తకు నడక నేర్పేలా సాగించడంతో అధికారులు గతేడాది సివిల్ పనులను కాంట్రాక్ట్ పొందిన రత్న కన్స్ట్రక్షన్ను మార్చి, సూర్య కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించారు. కాని ప్రయోజనం శూన్యం. పనులు ఒక్క అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కు అన్న చందంగానే కొనసాగాయి. ఎట్టి పరిస్థితిల్లో గతేడాది పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటనలు చేశారు. కాని పనులు పూర్తి కాలేదు కదా, పిల్లర్ల స్థాయి దాటలేదు. ప్రస్తుత ఏడాది పనులు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో లిఫ్ట్ నిర్మాణ పనులను మరిచే పోయారు. గతేడాది పనులు ఓ మోస్తారుగా సాగినా, ముందస్తు కురిసిన వర్షాలు పనులను సాగనివ్వలేదు. లిఫ్ట్ నిర్మా ణ పనులను చేపట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. ఏడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ నిర్మాణ పనులను, కొత్త ప్రభుత్వం త్వరలో పూర్తి చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై, ప్రాజెక్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి లిఫ్ట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. లిప్ట్ నిర్మాణం పూర్తయితే 50 వేల ఎకరాలకు రెండు పంటలకు చివరి వరకు నీరందుతుంది. -
ఎస్సారెస్పీలోకి 0.37 టీఎంసీల నీరు
బాల్కొండ: బాబ్లీ గేట్ల ఎత్తివేతతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)లోకి 0.37 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని ముందుగా ప్రకటించినా అందులో సగం మాత్రమే నీరు వచ్చి చేరింది. మిగతాది వచ్చే అవకాశం లేదని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని వెనక్కు లాక్కునే విధంగా రివర్స్ గేట్లతో బాబ్లీ ప్రాజెక్ట్ను నిర్మించిన మహారాష్ట్ర సర్కార్... గేట్లు ఎత్తిన తర్వాత ఏమైనా మాయ చేసి ఉండవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1067.70 అడుగులు ఉంది. -
ఎట్లయినా ఎస్సారెస్పీకే నష్టం
బాల్కొండ: ‘బాబ్లీ’.. అంటూ ముద్దుగా పేరుపెట్టి.. గోదావరిపై ఆనకట్ట కట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం మనకచ్చే నీళ్లనూ దోచేస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు కట్టడంలోనే మాయ చేసింది. తన నీళ్లు తనకే.. మన నీళ్లూ తనకే వచ్చేలా కనికట్టు ప్రదర్శించింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా.. దించినా మనకేం ప్రయోజనం లేదు.. సరికదా మన నీళ్లూ వాళ్లకే వెళ్లిపోతాయి. ఇలా నిర్మించిన ‘బాబ్లీ అడ్డుకట్ట’ వల్ల ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోవడంతో.. ‘ఆయకట్టు’ కన్నీళ్లు పెడుతోంది. ఎస్సారెస్పీకి నీటి గండమే ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)కు నీటిగండం తప్పదు. బాబ్లీ గేట్లు ఎత్తిన, దించిన ఎస్సారెస్పీ నీటికి గండమే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిఉంచాలి. అయితే గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నికర జలాలు వెనక్కు వెళ్తాయి. దించితే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచి పోతుంది. ఇలా ఎత్తినా.. దించినా.. బాబ్లీలోకే నీరు వచ్చేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువన నిండిన తర్వాతే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రధానంగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల నుంచే వరద వస్తుంది. ఈ నీటితోనే ప్రాజెక్ట్ నిండు కుండలా మారుతుంది. జూలై వరకు బాబ్లీ గేట్లు మూసి వేయడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి ఆటంకం కలుగుతోంది. అనంతరం అక్టోబర్ వరకే గేట్లు తెరిచి ఉంచితే... ఎస్సారెస్పీలోకి వచ్చే వరద నీటికి గండం తప్పదు. గత పదేళ్లుగా వర్షపాతం చూస్తే.. సకాలంలో వర్షాలు కురిసింది చాలా తక్కువ. అలాంటప్పుడు ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంచితే లాభం లేదు. వరదలు వచ్చినా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ లాంటి ప్రాజెక్ట్తో పాటు ఎగువ ప్రాంతంలో నిర్మించిన 16 చెక్డ్యాంలు నిండిన తర్వాతనే మిగులు జలాలను వదులుతోంది. గేట్లు ఎత్తితే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే మనకు నీళ్లు వస్తాయని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు సంబురపడ్డారు. తీరా ఆ ప్రాజెక్ట్ నిర్మాణశైలి తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నీళ్లు సైతం వెనక్కి వెళ్తాయి. నీటిని వెనక్కు లాక్కునే విధంగా బాబ్లీ ప్రాజెక్ట్కు రివర్స్ గేట్లను నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 1072 అడుగులకు చేరిన తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు నిలిచి పోతే నికర జలాలను వారు దోచేసుకోవచ్చు. అక్టోబర్లోనే గేట్లు దించితే శ్రీరాంసాగ ర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్లోనే కిందికి దించితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచిపోతుంది. దీంతో ఖరీఫ్లో ఎస్సారెస్పీ నిండుకుండలా ఉన్నప్పటికీ.. రబీపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. బాబ్లీ ప్రాజెక్ట్ 2.74 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ అందులో నుంచి పంపింగ్ ద్వారా ఇతర జలాశయాలకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎగువ నుంచి తమకు వరదనీరు రాకపోతే శ్రీరాంసాగర్లో నుంచి దాదాపు 56టీఎంసీల నీటిని రివర్స్గేట్ల ద్వారా బాబ్లీలోకి మళ్లించుకోవచ్చు. ఇలా ఎస్సారెస్పీ మొత్తం 90టీఎంసీల్లో 56టీఎంసీల వర కు బాబ్లీ గండం ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎస్సారెస్పీపై ఆధారపడిన 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. 10.50లక్షల ఎకరాలు ప్రశ్నార్థకం బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల ఎస్సారెస్పీ ఆయకట్టులో సాగవుతున్న 10.50 లక్షల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఒక్క టీఎంసీ నీటితో 20వేల ఎకరాల పంటకు నీరందించవచ్చని అధికారుల లెక్కలే తెలుపుతున్నాయి. అంటే 56 టీఎంసీల నీటితో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. ఉత్తర తెలంగాణలోని నల్గొండ,ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీటిని అందిస్తుంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఎస్సారెస్పీ ఆయకట్టులో 60 శాతం ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు స్పందించి శ్రీరాంసాగర్ ఆయకట్టును కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
పాట పాడు.. పదవి కొట్టు
న్యూస్లైన్ నెట్వర్క్ : జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలు జోరందుకున్నాయి. గ్రామాలలో ఈ స్థానాలకు పోటీ ఏర్పడిన నేపథ్యంలో గ్రామ పెద్దలు వేలం పాటలు నిర్వహించ టం, ఎక్కువ డబ్బులు చెల్లించినవారికి పదవులు కట్టబెట్టడం సర్వ సాధారణంగా మారింది. గ్రామస్తులు తీర్మానం చేసుకున్న ప్ర కారం వేలం పాటలో పదవిని దక్కించుకు న్న వ్యక్తికి పోలింగ్ రోజు ఓట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలు గ్రామాలలో సోమవా రం ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలను నిర్వహించారు.సమాచారం అందుకున్న పోలీ సులు, అధికారులు వెళ్లేలోపు చాలా గ్రామాల లో వేలంపాట తంతును పూర్తి చేసుకున్నట్లు స మాచారం. పలు గ్రామాలలో జరిగిన వేలం పాటల వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 3.50 లక్షలకు బాల్కొండ : బాల్కొండ మండలం నాగంపేట్ ఎంపీటీసీ స్థానానికి సోమవారం గ్రామస్తులు వేలం నిర్వహించినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో గ్రా మానికి చెందిన టీడీపీ నాయకుడు తన తల్లిని అభ్యర్థిగా నిలబెడుతూ రూ. 3.50 లక్షలకు వే లం పాటలో పదవి దక్కించుకున్నట్లు తెలిసిం ది. అయితే సమాచారం అందుకున్న తహశీల్దార్ పండరీనాథ్, ఆర్మూర్ రూర ల్ సీఐ గోవర్ధనగిరి, ఎస్ఐ సురేశ్ గ్రామానికి వెళ్లి విచారించగా ఎలాంటి వేలం నిర్వహిం చలేదని గ్రామస్తులు తెలిపారు. రామేశ్వర్పల్లిలో భిక్కనూరు : భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి ఎంపీటీసీ స్థానానికి సోమవారం వేలం పాడినట్టు తెలిసింది. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా ఆ సామాజిక వర్గానికి చెం దిన నలుగురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో గ్రామ బీసీ సం ఘం నేతలు సమావేశమై వే లం ఎంపీటీసీ స్థానానికి వేసినట్టు తెలిసింది. వేలంలో అత్యధికంగా రూ.3.09 లక్షలు చెల్లించడానికి ముం దుకు వచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. సదరు మహిళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని కులపెద్ద లు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై గ్రామానికి చెందిన బీసీ సంఘం నేతలను సం ప్రదించగా అలాంటిదేమీ లేదని పేర్కొన్నా రు. అధికారులు అడ్డుకున్నారు ధర్పల్లి : ధర్పల్లి మండలం మైలారం గ్రామం లో సోమవారం ఎంపీటీసీ పదవికి వేలం పాటను అధికారులు అడ్డుకున్నారు. మైలా రం, కేశా రం గ్రామాలకు కలిపి ఒకే ఎంపీటీసీ స్థానం ఉంది. మైలారంలో 1,233 మంది, కేశారంలో 532 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మైలారం వాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తినే ఎంపీటీసీ సభ్యుడిగా గెలిపిం చుకోవాలని భావించారు. ఇందుకోసం గ్రామ సమీపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుని వేలం పాటలు నిర్వహించారని సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నాయకులు కొం దరు పోటీ పడినట్లు తెలిసింది. విషయం తెలిి సన వెంటనే ఎస్ఐ అంజయ్య, తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ మదన్మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వేలం జరుగకుండా నిలిపివేశారు. గ్రామపెద్దల నుంచి హా మీ పత్రాన్ని తీసుకున్నారు. వేలం పాటతో అ భ్యర్థిని బరిలోకి దింపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, అప్పటికే ఎం పీటీసీ స్థానానికి ఓ అభ్యర్థి రూ. 4.50 లక్షలు వేలం పాడి ఖరారు చేసుకున్నట్లు సమా చారం. తహశీల్దార్ రాకతో ఆగిన వేలం కోటగిరి : కోటగిరి మండలంలోని రాయకూర్ గ్రామంలో ఓప్రధాన రాజకీయపార్టీకి చెందిన నాయకులు ఎంపీటీసీ స్థానానికి వేలం వేసేం దుకు యత్నించారు. సమా చారం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్రావ్ గ్రామానికి చేరుకునే లోగా అక్కడి నుంచి నాయకులు చిత్తగించారు. దీంతో తహశీల్దార్ గ్రామంలో వేసిన టెంటును సిబ్బందిచే తొలగించారు. -
మళ్లీ విద్యుత్ కోతలు షురూ ఉదయం తీసివేయడంతో
గృహిణుల ఇబ్బందులు రైతుల ఇక్కట్లు రానున్న రోజులపై ఆందోళన బాల్కొండ,న్యూస్లైన్ :అకాల వర్షాలతో విద్యుత్ కోతలకు ఊరట లభించిందని సంతోషపడ్డ రైతులకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువ లేదు. గృహ అవసరాలకు విద్యుత్ కోతలను ట్రాన్స్కో అధికారులు అధికారికంగా మళ్లీ రెండు రోజుల నుంచి విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు సబ్స్టేషన్ ఉన్న గ్రామంలో 8 గంటలు, పల్లెల్లో 12 గంటలు విద్యుత్ కోతలు విధించారు. వారం పది రోజుల పాటు అకాల వర్షాలు కురవడంతో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో ట్రాన్స్కో అధికారులు గృహ అవసరాలకు విద్యుత్ కోతలను ఎత్తివేశా రు. రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపాడోలేదో సాగు విద్యుత్ డిమాండ్ పెరగడంతో మళ్లీ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలంలో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ల్లో నీరు సమృద్ధిగా ఉంది. అకాల వర్షాలతో ప్రాజెక్ట్లకు అనుకొని జలకళ వచ్చి పడింది. విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతోంది. అయినా విద్యుత్ కోతలు విధించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కోతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గృహిణుల అవస్థలు.. ఉదయం ఆరు గంటల నుంచే విద్యుత్ కోతలు విధించడంతో ఇళ్లలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీళ్లు లభించక కోతల అనంతరం విద్యుత్ సరఫరా వరకు వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యుత్ కోతలు ఎత్తి వేయాలి. లేదా విద్యుత్ కోతల వేళాల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు. నాలుగో ఫీడర్ రైతులు తీవ్ర ఇబ్బందులు.. సాగుకు విద్యుత్ లోడ్ను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాన్స్కో అధికారులు నాలుగు ఫీడర్లలో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాని నాలుగో ఫీడర్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి ఫీడర్లో ఉదయం 4.15 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు , రెండో ఫీడర్లో ఉదయం 9.15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాల వరకు, మూడో ఫీడర్ 2.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నాలుగో ఫీడర్లో రాత్రి 7.15 నుంచి అర్ధరాత్ర 12.15 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా చేయడంతో పంటలకు రైతులు నీరు అందించ లేక పోతున్నారు. రాత్రి కరెంట్ వ ల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నాలుగో ఫీడర్పై పరిశీలన చేయాలని రైతులు కోరుతున్నారు. -
శ్రీరాంసాగర్ వద్ద ఆహ్లాదం కరువు
బాల్కొండ,న్యూస్లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా చేపట్టిన పార్కు ఏర్పాటు పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. అయితే పార్కును ప్రారంభించి నెలన్నర కావస్తున్నా పర్యాటకులను లోకిని అనుమతించడం లేదు. దీంతో పార్కు పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు. కనీసం పార్కు గేటును కూడా తీయడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగాన రూ. 6 కోట్ల నిధులతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పార్కు పనులు పూర్తి కావడంతో గతేడాది డిసెంబర్ 29న రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పార్కును ప్రారంభించారు. అయితే ఆరోజు నుంచి పార్కును మాత్రం తెరవడం లేదు. పార్కును కాంట్రాక్టర్ల మేలు కోసం నిర్మించారా లేక పర్యాటకానికా అంటూ పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. నిరాశ చెందుతున్న పర్యాటకులు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వస్తాయి. అప్పుడు ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతారు. ఆ సమయంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు వస్తున్నారు. వసతులు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కు తెరవక పోవడంతో నిరాశతో వారంతా వెనుదిరి వె ళుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం... పార్కులోకి ఇంత వరకు ఒక్క పర్యాటకుడిని కూడా అధికారులు అనుమతి లభించలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తిచేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తిచేశారు. ఆ తర్వాత పార్కు పర్యవే క్షణను సిబ్బందిని నియమించడం మరిచారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. పార్కు పచ్చదనంతో కళకళలాడాలంటే ప్రతిరో జు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. కాని ఒక్కరూ కూడా దిక్కులేరు. ఏదైనా ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
ఆయన ఎందుకు వచ్చారో?
బాల్కొండ, న్యూస్లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జోగ్దండ్ శుక్రవారం ఎస్ఆర్ఎస్పీని సందర్శించడం ప్రాజెక్టు అధికారులు, రైతులను కలవరపరుస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన 50 ఏళ్లలో గైక్వాడ్ ప్రాజెక్టు సీఈ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సమాచారం ఉన్నప్పటికీ ఎస్ఆర్ఎస్పీ ముఖ్య అధికారులు హాజరుకాకపోవడం వెనక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గైక్వాడ్ సీఈ ఎస్ఆర్ఎస్పీ వద్దకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబ్లీ నిర్మాణంపై సుప్రీం కోర్టు గతేడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం మహా సర్కారు అక్టోబర్లో బాబ్లీ గేట్లను దించింది. జూన్లో గేట్లను ఎత్తివేయాలి. ఏపీ, మహారాష్ట్ర మధ్య జలవివాదం తలెత్తకుండా త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుందని సుప్రీం తీర్పులో పేర్కొంది. ఈ కమిటీలో గైక్వాడ్ సీఈ సభ్యుడు కానున్నారా, అందుకోసమే ఎస్ ఆర్ఎస్పీని సందర్శించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు బాబ్లీ ప్రాజెక్టు ముప్పుగా పరిణమించింది. దీనికితోడు మహారాష్ట్ర ప్రాజెక్టుల సీఈలు ఈ ప్రాజెక్టు నీటి నిల్వ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను తెలుసుకునిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో నిల్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి గడిచిన పదేళ్లలో ఎలాంటి ఇన్ప్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రాలేదని రికార్డులు తెలుపుతున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టు కింద ఉన్న సిద్ధేశ్వర, ఎల్దరి, మజ్గావ్ ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. గైక్వాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 102 టీఎంసీలు. ఇప్పటికి ప్రాజెక్టు ఖాళీగానే ఉందని సమాచారం. అలాంటప్పుడు గైక్వాడ్ సీఈ ఎస్ఆర్ఎస్పీ ఇన్ఫ్లో వివరాలను అడగడం వెనుక మతలబు ఏమిటో తెలియడం లేదు. -
ప్రమాదకరంగా కాకతీయ కాలువ
బాల్కొండ,న్యూస్లైన్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ (కాకతీయ కాలువ) పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ కాలువ ద్వారా జిల్లా ప్రజలకు స్వల్పంగా ప్రయోజనం చేకూరినా, కాలువ అవసరం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ నుంచి అధికారులు రబీ సీజన్లో ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేపడుతున్నారు. కాని నీటి ప్రవాహానికి కాలువ క్రమంగా కొన్ని చోట్ల కోతకు గురవుతోంది. ప్రాజెక్ట్ నుంచి 100 మీటర్ల దూరంలోనే కోతకు గురవడం గమనార్హం. మండలంలోని మెండోరా, రెంజర్ల శివారులో కాలువ ప్రమాదకరంగా మారింది. ఏక్షణాన గండిపడుతుందోనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు రెండు పక్కల చేసిన సిమెంట్ లైనింగ్ పూర్తిగా చెడిపోయింది. దీంతో గండి పడే ప్రమాదం పొంచిఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. దీంతో రోజురోజుకు సిమెంట్ లైనింగుకు పగుళ్లు వచ్చి లైనింగ్ పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. కాలువపై 9లక్షల 68 వేలఎకరాల ఆయకట్టు కాకతీయ కాలువ పై సుమారు 9లక్షల 68 వేల ఎకరాల ఆయకట్టు ఆధార పడిఉంది. ఇంత ఆయకట్టు ఆధారపడి ఉన్న కాలువ ప్రథమార్థంలోనే ప్రాజెక్ట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కాలువ పూర్తి గా కోతకు గురై గండి పడే ప్రమాదం ఏర్పడింది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. దీనిపై మరో ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉంది. 2006 లో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. కాని కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల సిమెంట్ పూర్తిగా పెచ్చులూడి పోయింది. కాలువ నిర్మాణ క్రమంలో లైనింగ్ కు సిమెంట్ బిల్లలు వేశారు. కాని ఈ బిల్లలను గుర్తుతెలియని దుండగులు కాలువ కట్ట నుంచి ప్రతి ఏడాది ఎత్తుకెళుతున్నారు. దీంతో నీరు ప్రవహించినప్పుడు కట్ట కోతకు గురవుతూ గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఏడువేల క్యూసెక్కుల కంటే దాటని పరిస్థితి కాకతీయ కాలువ పూర్తి నీటి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. కాని కాలువ లైనింగ్ పనులు శిథిలావస్థకు చేరడంతో గత రెండేళ్లు గా ఏడు వేల క్యూసెక్కుల కు మించి నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నా ఎక్కడ గండి పడుతుందోనని ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి కి తీరని నష్టం వాటిల్లుతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఎస్సారెస్పీ కాలువల పనుల మరమ్మతులంటేనే ప్రభుత్వాలకు ఒకింత నిర్లక్ష్యం మనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కాలువ పనులకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
వరుసపెట్టి ఎనిమిదిళ్లలో చోరీలు
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దొంగల రెచ్చిపోయారు. వరుసపెట్టి ఎనిమిది ఇళ్లల్లో చోరీలు చేసి బీభత్సం సృష్టించారు. చోరీలను అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దొంగల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడిన చోరులు ఇప్పుడు జనావాసాలనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చోరీలను అడ్డుకున్నవారిపసై దాడులు చేయడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బారి నుంచి తమను కాపాడాలని పోలీసులను కోరుతున్నారు. -
మూడు ముక్కలాట!
సాక్షి, నిజామాబాద్ : మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో సరికొత్త సమీకరణలకు దారితీసింది. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ క్యాడర్లో సంతోష్రెడ్డి రాకతో మూడో గ్రూపు కూడా తయారవుతోంది. ఈ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి వర్గీయులకు, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఈరవత్రి అనిల్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పలు మండలాల్లో అభివృద్ధి పనుల విషయంలో గతంలో ఇరు వర్గీయులు బహిరంగంగానే గొడవలకు దిగిన సందర్భాలున్నాయి. ఈ పోరు తారాస్థాయికి చేరడంతో ఇరువర్గాల నేతలు ఓ ఒప్పందానికి వచ్చారు. తాజాగా ఇప్పుడు సంతోష్రెడ్డి కూడా పార్టీలో చేరడంతో మరో పవర్ పాయింట్ ఏర్పడినట్లయ్యింది. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న సంతోష్రెడ్డి ఆయన ఆశీస్సులతో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. స్పష్టమైన హామీతోనే సంతోష్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడైన వాసుబాబును బరిలోకి దించాలనే యోచనలో సంతోష్రెడ్డి ఉన్నా రు. ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. గ్రామాల్లో తిరుగుతూ తన అనుచరులను కలుస్తున్నారు. ఇటీవల వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇలా నియోజకవర్గం తెరపైకి మూడో నేత కూడా రావడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఏ నేత వైపు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ సభలు, జైత్రయాత్రల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, బాల్కొండల్లో నేతలు విజయోత్సవ సభలను నిర్వహించారు. తాజాగా బోధన్లో తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల బహిరంగసభ కూడా జరిగింది. ఆయా నియోజకవర్గ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభలు, సమావేశాలను నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం ఇంకా తెలంగాణ విజయోత్సవ సభ జరగలేదు. ఇక్కడ ఎవరు ఈ సభను నిర్వహిస్తారనే విషయంపై సైతం చర్చ మొదలైంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెండు నెలల క్రితమే ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా.. విలీనమైనా.. ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న సురేశ్రెడ్డి కూడా బాల్కొండ వైపు దృష్టిసారించాల్సిన పరిస్థితి అనివార్యం కానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇక్కడ మూడు ముక్కలాట ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బలి తీసుకుంటున్న క్రాసింగులు
బాల్కొండ, న్యూస్లైన్ : మండలంలోని పోచంపాడ్ కూడలి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రహదారిని దాటుతూ రోడ్డు ప్రమాదాలకు గురైనవారి వివరాలు చూస్తే భయమేస్తోంది. 2009 సంవత్సరంలో 14 మంది, 2010లో 8 మంది, 2011లో 13మంది, 2012లో 15 మంది 2013లో ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. అసలే ట్రాఫిక్ నియమాలు తెలియక సతమతమవుతున్నవారు రోడ్డు ఎలా దాటాలో తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైవే అథారిటీ అధికారులూ ప్రయాణికుల యోగ క్షేమాలను పట్టించుకున్న దాఖాలాలు లేవు. నాలుగు లైన్ల రహదారి అయిందని సంతోషపడాలో, రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి బాధపడలో తెలియని స్థితిలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతి ప్రమాద కరం ముప్కాల్ క్రాసింగ్ మండలంలోని ముప్కాల్ బైపాస్వద్ద ఉన్న జాతీయ రహదారి క్రాసింగులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. పొలాలకు వెళ్లేందుకు వేరే దారి లేక రైతులు జాతీయ రహదారిని దా టుతూ ప్రమాదలకు గురవుతున్నారు. ఆ క్రాసింగ్ నుంచి మం డలంలోని పలుగ్రామాలకు దూరభారం తగ్గేలా మరో దారి ఉండటంతో ప్రయాణికులు సైతం రోడ్డును క్రాస్ చేస్తున్నా రు. క్రాసింగ్ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు ఎలాంటి నిరోధకాలు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొడుతున్నాయి. హైవే క్రాసింగుల వద్ద ప్రమాదాలు నివారించడానికి ఆర్డీఓతో పరిశీలన చేయించి, గతంలో జిల్లా యంత్రాంగం హైవే అథారిటీకి పలు సూచనలు చేసింది. క్రాసింగుల వద్ద స్టాపర్లు పెట్టాలని అప్పటి ఆర్మూర్ డీఎస్పీ నర్సింహా సూచించినా హైవే అధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు ఇది చేయాలి, అది చేయాలని మాట్లాడుతారు. తర్వాత ఊసెత్తరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దిం చి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలంటున్నారు. చాకిర్యాల్ వద్దా అంతే మండలంలోని చాకీర్యాల్ వద్ద గల క్రాసింగ్ సైతం ప్రమాదాలకు నిలయంగా మారింది. అక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైతులకు అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రెండు క్రాసింగ్ల వద్ద వెంటనే అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. తాజాగా పోచంపాడ్ క్రాసింగ్ తాజాగా పోచంపాడ్ క్రాసింగ్ ప్రమాదాలకు నిలయంగా మారిం ది. మంగళవారం జరిగిన ప్రమాదంలో విద్యార్థినితో పాటు, ఆమె తండ్రి మృతి చెందడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైవే పై ఉన్న నిబంధనలు తెలియక కొందరు, హైవే అధికారులు నిర్లక్ష్యంతో మరి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు.