
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకోసం ఒక్కో మంత్రికి రూ.2 కోట్ల చొప్పున 16 మంది మంత్రులకు రూ.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఈ మొత్తానికి అనుమతి ఇచ్చింది. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలు, వాటి పరిధిలోని నియోజకవర్గాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల చేసేందుకు అధికారం ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి ఆమోదం, అమలు, నిర్వహణ, పద్దుల తదితరాలకు నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారని.. అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తారన్నారు.