
తెలంగాణ పోలీస్ జట్టులో ఇప్పాయిపల్లివాసి
కుల్కచర్ల: మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వేణుగోపాల్ ఆల్ ఇండియా పోలీస్ వాలీబాల్ క్లస్టర్ పోటీల్లో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం హర్యానాలో జరుగుతున్న పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా వేణుగోపాల్ సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
అంగన్వాడీ టీచర్ మృతి
కేశంపేట: అనారోగ్యంతో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన అల్వాల అనుబంధ గ్రామం తులవానిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఎల్గమోని రవీందర్యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ షబనాహుస్సేన్, ఐసీడీఎస్ మాజీ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, శమంతకమణి , పలువురు అంగన్వాడీ టీచర్లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు సీడీపీఓ అందజేశారు.
రికవరీ ఫోన్ల అప్పగింత
ధారూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాలు, తండాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాధితులకు తొమ్మిది సెల్ఫోన్లను అప్పగించినట్లు ఎస్ఐ అనిత తెలిపారు.
నాలుగు టిప్పర్లు, జేసీబీ సీజ్
కడ్తాల్: నిబంధనలకు విరుద్ధంగా మట్టితరలిస్తుండగా పోలీసులు దాడులు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని సర్వేనంబర్ 321/1లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి నాలుగు టిప్పర్లు, ఓ జేసీబీని స్టేషన్కు తరలించారు. ఈ మేరకు జేసీబీ, టిప్పర్ డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులు మునావత్ శ్రీను (గానుగుమార్లతండా), నేనావత్ శ్రీను(పుల్లేరుబోడ్ తండా)పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
వరద కాల్వను పూడుస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి వచ్చే వరద కాల్వను పూడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సురంగల్కు చెందిన గడ్డం వెంకట్రెడ్డి తహసీల్దార్ గౌతమ్కుమార్ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సురంగల్లోని పెద్ద చెరువులోకి కనకమామిడి వైపు నుంచి వరదకాల్వ వస్తుందని.. నజీబ్నగర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 73, 74 వద్ద న్యాయవాది వలీ వరదకాల్వను పూర్తిగా పూడ్చివేసి తన పొలంలో కలుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని కాలువ పూడ్చివేయడాన్ని అడ్డుకోవాలని కోరారు.
ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు!
మణికొండ: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్హౌస్లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్హౌస్లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్స్టేషన్లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్హౌస్లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.

తెలంగాణ పోలీస్ జట్టులో ఇప్పాయిపల్లివాసి

తెలంగాణ పోలీస్ జట్టులో ఇప్పాయిపల్లివాసి
Comments
Please login to add a commentAdd a comment