విద్యుత్ షాక్తో ఇంటర్ విద్యార్థి దుర్మరణం
శుభకార్యంలో విషాదం
అక్కిరెడ్డిపాలెం: శుభకార్యానికి హాజరైన బాలుడు విద్యుత్ షాక్కు బలయ్యాడు. మేడ మీద ఆడుకుంటూ.. హైటెన్షన్ వైరు నుంచి వేలాడుతున్న మరో తీగను పట్టుకోవడంతో దుర్మరణం పాలయ్యాడు. గాజువాక సీఐ ఎ.పార్థసారధి తెలిపిన వివరాలివి. శ్రీనగర్ లైన్ 3 అఫీషియల్ కాలనీకి చెందిన అప్పలరాజు కుమారుడు గోపిశెట్టి దిలీప్కుమార్(16) గాజువాకలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చినగంట్యాడ నాయుడుగారి వీధిలో తమ బంధువుల ఇంట గురువారం జరిగిన ఓ శుభకార్యానికి గోపిశెట్టి అప్పలరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఫంక్షన్ జరుగుతుండగా దిలీప్ కుమార్ మేడ మీదకు వెళ్లి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో మేడ చివరన ఓ తీగ వేలాడుతుండగా దిలీప్ దానిని పట్టుకుని లాగాడు. ఆ వైరు హైటెన్షన్ వైరు నుంచి కొనసాగుతుండటంతో.. దిలీప్ విద్యుత్ షాక్కు గరయ్యాడు. కొంత సమయానికి మేడపైకి వెళ్లిన బంధువులు దిలీప్ కుమార్ వైరు పట్టుకుని పడి ఉండటం చూసి వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దిలీప్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నజీర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.