
మౌనికకు అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగం
నల్లబెల్లి: రైతుబిడ్డ అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాన్ని సాధించి ఆదర్శంగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన ఉడుత రాజన్న–రమనీల దంపతుల చిన్న కుమార్తె మౌనిక ప్రభుత్వం ప్రకటించిన అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–1 ఫలితాల్లో భద్రాద్రి జోన్లో 9వ ర్యాంకు సాధించింది. స్థానిక ఎస్వీఎన్ హైస్కూల్లో పదో తరగతి, హనుమకొండలోని శ్రీవేద జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ పూర్తిచేసింది. పోటీ పరీక్షలకు ప్రిపేరై ఉద్యోగానికి ఎంపికై ంది. మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం, పలువురు బుధవారం ఆమెను అభినందించారు.
కొమ్మాల
అంగడి టెండర్ ఖరారు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి టెండర్ను బుధవారం ఖరారు చేసినట్లు ఎంపీఓ ప్రభాకర్ తెలిపారు. అంగడిలో భాగంగా కొమ్మాల గ్రామపంచాయతీ వాటా కింద ఏడాదికి 20 వారాలపాటు ప్రతి శనివారం అంగడి నిర్వహించడానికి టెండర్ ఖరారు చేసినట్లు వివరించారు. అంగడి మొత్తం ఐదు గ్రామపంచాయతీల పరిధిలో ఉండగా కొమ్మాల వాటా కింద సీల్డ్ కవర్ ప్రక్రియ ద్వారా అధికారులు రూ.48,51,396 అప్సెట్ ధర నిర్ణయించారని పేర్కొన్నారు. ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా అదే గ్రామానికి చెందిన బాలోజీ నాగయ్య రూ.49,01,000కు టెండర్ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది వర్తి స్తుందన్నారు. పశువులకు రూ.200, మేకలు, గొర్రెలకు రూ.100,లారీ,జీప్కు రూ.50, ఆ టో, హోటల్, దుకాణం, బండ్లకు రూ.30 చొ ప్పున అంగడిలో వసూలు చేయాలని, అంతకు మించి చేస్తే టెండర్ రద్దు చేస్తామని ఎంపీఓ హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గైని శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రెమల్లి శంకర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విశ్వనాథపురంలో పారువేట
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని విశ్వనాథపురానికి పారువేటకు తోడ్కొని వెళ్లారు. రథోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను గ్రామంలోని శివాలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పారువేట, చక్రతీర్థం అనంతరం రాత్రి శ్రీపుష్పయాగం, నాగవెల్లి జరిపించారు. అర్చకులు రామాచారి, ఫణి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లకు
14 ప్రత్యేక బృందాలు
● నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● సమీక్షలో గ్రేటర్ కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల కోసం ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగం ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కమర్షియల్ ట్రేడ్ వసూళ్లను వేగవంతం చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు జవాన్లతో కాజీపేట సర్కిల్కు 7, కాశిబుగ్గ సర్కిల్కు 7 బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.