
ఉన్నఫలంగా 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్య తగ్గి
శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025
లోకోపైలెట్ల పోస్టులను తగ్గిస్తూ..
కాజీపేట క్రూ డిపో కేంద్రంగా 2020లో 623మంది లోకోపైలెట్లతో నడిచింది. 2023 నవంబర్ నాటికి ఆ సంఖ్య 501కి తగ్గింది. 2025 మార్చి నాటికి 470 పోస్టులకు పడిపోయింది. ఈ విధంగా రోజు రోజుకూ కాజీపేట క్రూ డిపో స్థాయిని తగ్గిస్తున్నట్లు లోకోపైలెట్లు ఆందోళన చెందుతున్నారు. 2020 మేలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం 542 పోస్టులకు పడిపోయిందని, గత 5 ఏళ్లలో 248 పోస్టులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర్వులు జారీచేసిన దక్షిణ మధ్య రైల్వే●
● స్థానిక రైల్వే క్రూ లాబీ నిర్వీర్యమయ్యే ప్రమాదం
● గతంలోనే క్రూ లింక్ల తరలింపు..
● ఆందోళనలో కాజీపేట రన్నింగ్ స్టాఫ్
● ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని విజ్ఞప్తి
కాజీపేట రూరల్: ఉత్తర, దక్షిణ దేశప్రాంతాలకు గేట్ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్ కేంద్రంగా కాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారా.. అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందులోభాగంగానే ముందస్తు ఆలోచనతో గతంలో క్రూలింక్లను విజయవాడకు తరలించడం.. తాజాగా లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కాజీపేట డివిజన్ కలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వేడివిజన్ అయితే ఉన్నతాధికారులు విజయవాడ, సికింద్రాబాద్ విడిచి స్థానికంగానే ఉండాల్సి వస్తుందన్న ఆలోచనతో ముందస్తుగా అడ్డురాయి వేసినట్లు స్థానిక లోకోపైలెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని అర్హతలు ఉన్నా.. అడ్డంకులు
నిజాం రైల్వే కాలంలో ఏర్పాటైన కాజీపేట జంక్షన్ దినాదినాభివృద్ధి చెంది ఒక డివిజన్కు కావాల్సిన అన్ని అర్హతలు సంపాదించుకుంది. ఉద్యోగాల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశతో ఉన్నారు. ఈక్రమంలోనే రైల్వే వ్యాగన్, కోచ్ఫ్యాక్టరీలు రావడంతో ప్రజల ఆశలు పెరిగాయి. తదనంతరం కాజీపేట రైల్వే డివిజన్కు అడుగులు పడుతున్న నేపథ్యంలో కొందరు రైల్వే అధికారులు కాకుండా కుట్రకు పాల్పడుతున్నారని లోకోపైలెట్లు, రైల్వే నాయకులు అంటున్నారు.
గూడ్స్ లోకోపైలెట్ల సంఖ్య సైతం తగ్గింపు..
కాజీపేట క్రూ డిపో కేంద్రంగా గూడ్స్ లోకోపైలెట్ల పోస్టులను కూడా తగ్గిస్తున్నారని లోకోపైలెట్లు అంటున్నారు. గూడ్స్ లోకోపైలెట్ల నుంచి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలెట్, మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలెట్ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ, విజయవాడలో ఉన్న సికింద్రాబాద్ డివిజన్కు చెందిన క్రూ డిపోలో ఖాళీలను పెంచి భర్తీ చేశారని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల కాజీపేటకు చెందిన సంబంధిత కోచింగ్ ఖాళీల్లో గూడ్స్ లోకోపైలెట్లు 30మంది పనిచేస్తున్నారని తెలిపారు. అధికారులు రిక్వెస్ట్ బదిలీలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కాజీపేట రైల్వే క్రూ డిపో స్థాయి రోజురోజుకూ తగ్గుతుందని లోకోపైలెట్లు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ రైల్వేజోన్ కోసమేనా?
విశాఖపట్టణం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఈ జోన్ను అభివృద్ధి చేసేందుకు కొందరు అధికారులు ఇదంతా చేస్తున్నారని లోకోపైలెట్లు అంటున్నారు. విజయవాడ డివిజన్ విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని, కాజీపేటలో లోకోపైలెట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడలో సికింద్రాబాద్కు చెందిన లోకోపైలెట్లుగా పనిచేస్తున్న డిపోలలో కలుపుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు రైల్వే జీఎం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చి కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం కాకుండా, కాజీపేట డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని లోకోపైలెట్లు కోరుతున్నారు.

ఉన్నఫలంగా 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్య తగ్గి

ఉన్నఫలంగా 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్య తగ్గి