ఓటుకు కోట్లుపై ఏపీ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే పది నిమిషాల పాటు వాయిదా పడింది. కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ఆరంభమయ్యాయి. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ...స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరపాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. సభ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ...ఫలితం లేకపోవటంతో సమావేశాలను పది నిమిషాలపాటు వాయిదా వేశారు.