ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 13 రోజుల పాటు.. అంటే ఈనెల 28 వరకు మాత్రమే నిర్వహించాలని బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 13 రోజుల పాటు.. అంటే ఈనెల 28 వరకు మాత్రమే నిర్వహించాలని బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. అందులో ముందుగా ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ మరునాడు సెలవు ఇవ్వకూడదని నిర్ణయించారు. మొత్తం పది బిల్లులను ఆమోదించాలని అన్నారు. బిల్లులు పెట్టినప్పుడు మాత్రం రెండోపూట కూడా సభను నిర్వహించాలని తెలిపారు. కాగా, శాసనసభ చరిత్రలో అతి తక్కువ రోజులు నిర్వహించే బడ్జెట్ సమావేశాలు ఇవే కావడం విశేషం.
అయితే ఈ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కనీసం నెలరోజులైనా సమావేశాలు ఉండాలని, అప్పుడే ప్రజాసమస్యల మీద చర్చించడానికి వీలుంటుందని చెప్పింది. దీంతో.. మళ్లీ సమావేశమై అదనపు రోజుల గురించి చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.