బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం | BT College former glory | Sakshi
Sakshi News home page

బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం

Jul 20 2015 2:50 AM | Updated on Sep 3 2017 5:48 AM

బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం

బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం

బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తామని ముగ్గురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు...

- శతవార్షికోత్సవంలో ఎమ్మెల్యేలు తిప్పారెడ్డి, చింతల, శంకర్
- యూనివర్సిటీ చేయడానికి కృషిచేస్తామని హామీ
మదనపల్లె సిటీ :
బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తామని ముగ్గురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలో ఆదివారం సాయంత్రం బీటీ కళాశాల శత వార్షికోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. మొదట వారు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సభలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ బీటీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని, ఇలాంటి కళాశాల నేడు దీనస్థితికి చేరుకోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు పూర్వవైభవం వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాల్లో కళాశాలను యూనివర్సిటీగా చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు.

పీలేరు ఎమ్మెల్యే, కాలేజీ పూర్వ విద్యార్థి చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కాలేజీలో 1981-84లో డిగ్రీ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఇంతటి స్థాయిలో ఉన్నానంటే కాలేజీనే కారణమని స్పష్టం చేశారు. గతంలో ఉన్న కాలేజీ ప్రస్తుతం దాని ప్రభావం మసకబారడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. కాలేజీ పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత తనపై కూడా ఉందన్నారు. ఈ కళాశాలలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డితో పాటు పలువురు చదివిన విషయాన్ని గుర్తు చేశారు.  తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ మాట్లాడుతూ  కళాశాలను యూనివర్శిటీ  స్థాయికి తెచ్చేలా శాసనసభలో తన వాణిని వినిపిస్తామని తెలిపారు. పడమటి మండలాలకు కళాశాలను యూనివర్సిటీ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.
 
ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన బీటీ కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ ఆర్‌జేడీ పద్మావతి, జోళెంపాళెం మంగమ్మ, కాలేజీ కరస్పాండెంట్ వివేకానంద, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణరాణి, బీసెంట్ ట్రస్టు కార్యదర్శి సుధాకర్, లైజన్ ఆఫీసర్ ప్రసాదరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు రాజన్, బగ్గిడి గోపాల్, కాలేజీ మాజీ చైర్మన్లు రాందాస్‌చౌదరి, కంభం నాగభూషణరెడ్డి, కళాధర్, సుధాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్‌బాలాజీ, మాజీ ఎంపీపీ వల్లిగట్ల వెంకటరమణ, కాలేజీ అధ్యాపకులు, పూర్వపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement