
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 ( కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా జిల్లాలోని మిర్చి మార్కెట్ను ఈ నెల 31 వరకు మూసివేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మిర్చి రైతులు గుంటూరు మిర్చి మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి మిర్చి యార్డ్ తెరిచేంతవరకు రైతులు రావొద్దని ఆయన సూచించారు. సోమవారం నుంచి గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడి ఉండొద్దని కలెక్టర్ శామ్యూల్ తెలిపారు. (31వరకు ఏపీ లాక్డౌన్ )
ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 31 వరకు యార్డుకు మిర్చిని తీసుకురావద్దని, రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.