
కాపీ అండ్ పేస్ట్
- గత ఏడాది కేటాయింపులే
- జిరాక్స్ కాపీలా బడ్జెట్
- డెల్టా ఆధునికీకరణకురూ.332.51 కోట్లు
- పులిచింతలకు రూ.208.94 కోట్లు
- పోర్టుకు, ఎయిర్పోర్టుకు కోటి రూపాయలే...
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాపీ అండ్ పేస్ట్లా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కేటాయింపులనే ఈ ఏడాదీ కొనసాగించింది తప్ప కొత్తగా ఇచ్చినవేమీ లేవు. గతేడాది బడ్జెట్కు జిరాక్స్ కాపీలా ఈ ‘ఓటాన్ అకౌంట్’ ఉందని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులలో జిల్లాకు, విజయవాడ నగరానికి మొండిచెయ్యే మిగిలింది. ఒకవైపు విజయవాడ - గుంటూరు నగరాలను మెట్రోనగరాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్రం విభజన బిల్లులో పేర్కొంటే.. దానికి భిన్నంగా ఒక్క రంగంలో కూడా నిధులు కేటాయించకుండా ఈ ప్రాంత అభివృద్ధిపై తమకు ఎంత చిన్నచూపో కిరణ్ సర్కార్ నిరూపించింది.
విజయవాడకు నిరాశే...
విజయవాడ నగరానికి సంబంధించిన ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. జేఎన్ఎన్యూఆర్ఎంకు సంబంధించి నిధుల కేటాయింపు జరగలేదు. నగరానికి రావాల్సిన బకాయిలు, గ్రాంటుల ప్రస్తావనే లేదు. జేఎన్ఎన్యుఆర్ఎంకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ.150 కోట్ల వరకు రావాల్సి ఉంది. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు.
‘సూపర్’కు రూ.50 లక్షలు...
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.50 లక్షలు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. విజయవాడలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ప్రకటించినా, ఫలితం మాత్రం కనపడలేదు. మరోవైపు గత ఐదేళ్లుగా విజయవాడలో శిల్పారామం ఏర్పాటుకు ప్రతిపాదనలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బడ్జెట్లో నాలుగు ప్రాంతాలలో ఏర్పాటుచేసే శిల్పారామాలకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు.
సాగునీటికి పాత కేటాయింపులే...
సాగునీటి కేటాయింపులు మినహాయిస్తే మిగిలిన ఏ రంగంలోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఈ ఏడాది బడ్జెట్లో పులిచింతల, కృష్ణాడెల్టా ఆధునికీకరణకు కేటాయింపులు ఏమాత్రం పెంచలేదు. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది రూ.208 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కూడా అదే మొత్తానికి పరిమితం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసేసినా, చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయి. దీనిలో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయాలంటే గుంటూరు, నల్గొండ జిల్లాల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇవేమీ జరగలేదు. దీంతో ఈ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు.
కృష్ణాడెల్టా ఆధునికీకరణకు గత ఏడాది బడ్జెట్లో రూ.332 కోట్లు కేటాయించగా ఈ ఏడాదీ అదే మొత్తాన్ని కేటాయించారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి రూ.4,573 కోట్ల వ్యయ అంచనాతో పరిపాలనా అనుమతి రాగా ఇప్పటివరకు రూ.500 కోట్ల లోపే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు 2013-14కి పూర్తి కావాల్సి ఉంది. ఒక ఏడాది పొడిగించినా ఏడాదిలో నాలుగువేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కేటాయింపులు చూస్తే మరో పదేళ్లకు గానీ ఈ ఆధునికీకరణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడటం లేదు. తారకరామ ఎత్తిపోతల పథకానికి మరో ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించారు.
పోర్టుకు కోటి రూపాయలే...
మచిలీపట్నం పోర్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటిలాగానే కోటీ 72 లక్షలు కేటాయించి చేతులు దులుపుకొంది. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో విమానాశ్రయ విస్తరణకు కేవలం కోటి రూపాయలు కేటాయించారు. గత రెండేళ్లుగా ఇవే కేటాయింపులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ మరమ్మతులకు కోటి రూపాయలు కేటాయించారు.
ప్రకాశం బ్యారేజీ దిగువభాగంలో ఆప్రాన్ పూర్తిగా దెబ్బతిని ఉంది. దీన్ని పూర్తిగా ఆధునికీకరించడానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో కేటాయించిన కోటి రూపాయలు ఏ మూలకు వస్తాయన్నది ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది. మున్నేరుపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు రూ.8.70 కోట్లు కేటాయించింది. మొత్తం మీద ఓటాన్ అకౌంట్ పేరుతో ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశనే మిగిల్చింది.