
సాక్షి, విజయవాడ : కరెప్షన్ అనే పదానికి దూరంగా ఉండాలని అది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాలను గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2019ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కరెప్షన్ అనే పదం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అని గవర్నర్ తెలిపారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు జరగనున్న విజిలెన్స్ వారోత్సవాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.