
డ్రైనేజీ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్
విశాఖసిటీ: ప్రజలు ఇబ్బంది పడే చోట చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నిసార్లు చెప్పాలి.? వర్షాకాలం వచ్చేస్తున్నా డ్రైనేజీ నిర్మాణం పూర్తికాకపోతే ఎలా? నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలంటూ జీవీఎంసీ కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’లో ఈనెల 31న ‘మురుగు కాల్వలో కాసుల వేట’ పేరుతో ప్రచురితమైన కథనంపై కమిషనర్ స్పందించారు. గురువారం ఉదయం కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు.
కోస్టల్ బ్యాటరీ నుంచి చేపట్టిన యూజీడీ కల్వర్టు పనుల్ని జూన్ నెలాఖరునాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ చెబుతున్నప్పటికీ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీచ్ సందర్శకులకు అసౌకర్యం కలగకుండా నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈలు వినయ్కుమార్, పల్లంరాజు, ఈఈలు గణేష్కుమార్, మహేష్, కేశవరెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.