
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత (ఫైల్)
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ సూచనలు, వ్యక్తిగత పరిశుభ్రత పాఠించాలి. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ ఒక్క రోజుతో అయిపోయిందని అనుకోవద్దు. రేపటి నుండి కూడా ముందు జాగ్రత్తలు అందరూ పాటించాలి. ప్రభుత్వం అండగా ఉంది.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు.