
శేషాచలం అడవుల్లో మృతి చెందిన ఎర్రచందనం కూలీలు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో హత్య, కిడ్నాప్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పులలో 20 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు.
మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఈనెల 11న చెన్నై నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదు 12న స్టేషన్కు చేరింది. తన భర్త శశికుమార్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసి 302, 364 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా మునియమ్మాల్ హైకోర్టుకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ప్రతి వాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది.