
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మాణం పూర్తి చేయడానికి నాబార్డు ఆంధ్రప్రదేశ్ నీటివనరుల అభివృద్ధి సంస్థ( ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి ఈ రుణాన్ని నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్(ఎన్ఐడీఏ)కింద మంజూరు చేసిందని నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం సీజీఎం ఎస్ సెల్వారాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేశారు. (చదవండి: ‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’)
చింతలపూడి పధకం కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాల్లోని 410 గ్రామాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా 4.80 లక్షల ఎకరాల ఆయకట్టకి ఖరీఫ్ పంటలకి మూడు దశల్లో 53.50 టీఎంసీల సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు. అంతే కాకుండా జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మార్చి 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. (చదవండి: నగదు లేకున్నా ఆర్టీసీలో ప్రయాణం!)