Water Resources Department
-
ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి కాలువల నిర్వహణ, నియంత్రణను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) కింద ఉన్న వెయ్యికిపైగా చిన్న లిఫ్ట్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్షించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,379 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. జనవరి 18న ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 35 మీటర్లు పూర్తయిందని అధికారులు వివరించారు. ఇంకా 1,344 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను విశాఖకు తీసుకువెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి.. పనులు గాడిన పెట్టాలని సూచించారు. భూగర్భజలాల పెంపుపై మంత్రులతో కమిటీ..రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. నిధుల సమీకరణకు కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు. భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక కోసం పంచాయతీరాజ్, అటవీ, జలవనరులు, వ్యవసాయ, పురపాలక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమీక్షలో మంత్రి రామానాయుడు, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. పర్యాటక శాఖ 20 శాతం వృద్ధి సాధించాలి పర్యాటక శాఖ 2025–26 మధ్య 20 శాతం వృద్ధిరేటును సాధించాలని, ఆ దిశగా అధికారులు పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. పర్యాటక శాఖకు ఎంత విలువైన ఆస్తులున్నాయో అంచనా వేయాలని, ఎక్కడ రెవెన్యూ ఎక్కువగా వస్తుందో... అక్కడ ప్రోత్సాహకాలు పెంచాలని చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలను ఎస్క్రో అకౌంట్ ద్వారా వెంటనే మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. -
పక్కా.. అది బ్యారేజే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. -
కృష్ణా జలాల్లో పాత వాటాలే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది. తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్తోపాటు పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్కు చెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్పూల్కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు. 50 శాతం వాటా అసంబద్ధం..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ -
కేంద్రం సాయం చేస్తే.. కృష్ణా డెల్టా, సీమకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను బనకచర్ల హెడ్రెగ్యులేటరీకి తరలించడం ద్వారా ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం దాదాపు రూ.80వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక పరిస్థితివల్ల చేపట్టే అవకాశంలేనందున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న దాదాపు 3వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను తరలించడం ద్వారా అటు కృష్ణా డెల్టాకు ఇటు రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలిగిస్తామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తీసుకెళ్తామన్నారు. 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ను నిర్మించి అక్కడ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. అందుకోసం బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ. సొరంగం నిర్మించి నీటిని తరలిస్తామన్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెళ్తాయన్నారు. అక్కడ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తామన్నారు. తద్వారా జలహారం కింద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి అవసరాలను తీరుస్తామన్నారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనట్లే!?
సాక్షి, అమరావతి : చింతలపూడి ఎత్తిపోతల నుంచి జల్లేరు రిజర్వాయర్ను ప్రభుత్వం తొలగించింది. తొలిదశలో ఎత్తిపోతల, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 25.94 లక్షల మందికి తాగునీరు అందించాలని నిర్దేశించింది. ఈ పనులను 2026, జూన్ నాటికి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖాధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల వంటి పథకాలు పూర్తయిన నేపథ్యంలో గోదావరికి వరద వచ్చే రోజులు తగ్గాయని.. నీటి నిల్వకోసం జల్లేరు రిజర్వాయర్ను నిర్మించకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందవని తేల్చిచెబుతున్నారు.మెట్టప్రాంతాలను సుభిక్షం చేసేలా..వాస్తవానికి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించి, సుభిక్షం చేయాలనే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2008, అక్టోబరు 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆయకట్టుకు నీళ్లందించడం కోసం జల్లేరు రిజర్వాయర్ పనులను 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సవాల్గా మారింది. దీంతో గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 2016, సెప్టెంబరు 3న పెంచారు. ఎత్తిపోతల ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచాలని ఎస్ఎల్ఎస్సీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) చేసిన ప్రతిపాదనపై 2020, మే 20న గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టింది.ఇప్పటికే రూ.4,122.83 కోట్లు వ్యయంఆ తర్వాత.. గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోసి.. జల్లేరు రిజర్వాయర్లో 14 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం పనులకు 2008 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.4,122.83 కోట్లు వెచ్చించింది. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే తొలిదశ పంప్ హౌస్, ప్రధాన కాలువలో 36 కిమీల వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువలో 36 కిమీ నుంచి 106.25 కిమీ వరకూ పనుల్లో దాదాపు 50 శాతం పూర్తయ్యాయి. జల్లేరు రిజర్వాయర్ సహా ఈ ఎత్తిపోతల పూర్తవ్వాలంటే ఇంకా రూ.5,198 కోట్లు అవసరం. రిజర్వాయర్ పనుల కోసం 6,880 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇది సవాల్గా మారడంతో జల్లేరు రిజర్వాయర్ పనులను తర్వాత చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రిజర్వాయర్ నిర్మిస్తేనే 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమవుతుందని.. రిజర్వాయర్ నిర్మించకపోతే ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులతోపాటు నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తుండటం గమనార్హం. -
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్!
సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్ పనులను చేపడతామని బావర్ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కమీషన్ల కోసమే ఎస్క్రో అకౌంట్ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్ నాటికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్ను బావర్ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. బావర్ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్ ధ్వంసమైంది. డీఆర్ఐకి ఫిర్యాదు చేసినా.. రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ అప్పట్లో డీఆర్ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
కొలిక్కివస్తున్న పోలవరం డిస్ట్రిబ్యూటరీల వ్యయ ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వడానికి రూ.5,338.9 కోట్లు వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారవర్గాలు తేల్చాయి. జలాశయం పనులు పూర్తయ్యేలోగా కాలువలతోపాటు స్ట్రిబ్యూటరీలను కూడా పూర్తి చేసి సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీని ప్రకారం కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఆ మేరకు నిధులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలు మార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ ప్రక్రియను పూర్తి చేసి, స్ట్రిబ్యూటరీలకు భూసేకరణ చేసి, పనులకు టెండర్లు పిలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలను పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పనులు కొలిక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టులో విధ్వంసానికి కారణమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది. కుడి కాలువలో మిగిలిన పనులతో పాటు ఎడమ కాలువలలో కీలకమైన నిర్మాణాలు, జలాశయంతో కాలువల అనుసంధానం పనులు పూర్తి చేసింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేలి్చ, ప్రాజెక్టును పూర్తి చేసే విధానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని, సమాంతరంగా కొత్తది నిర్మించాలని చెప్పింది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తయిన నేపథ్యంలో వరదల్లోనూ డయాఫ్రం వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ డ్యాంను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.» పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు» కుడి కాలువ పొడవు 178.812 కిలోమీటర్లు.. » ఎడమ కాలువ పొడవు 212.32 కిలోమీటర్లు.. » పూర్తయిన కుడికాలువ పనులు » 100 శాతం ప్రాజెక్టు ద్వారా వినియోగించుకొనే జలాలు 322 టీఎంసీలు » ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు » పూర్తయిన ఎడమ కాలువ పనులు 73.07 శాతం -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేసింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
తండ్రి ఆశయం...తనయుడి సాకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలలోని నల్లమల అడవులలో వ్యాపించి ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండల శ్రేణిలో మధ్య ఖాళీ స్థలంలో వున్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ. పొడవైన సహజమైన ‘నల్లమల సాగర్’ రిజర్వాయర్ నిర్మించి, కృష్ణా నదిలో 43.5 టీఎమ్సీ వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు. తొలుత ఈ ప్రాజెక్టును ‘వెలిగొండ ప్రాజెక్టు’ అని పిలిచారు. జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబరు 27న మార్కాపురానికి 15 కి.మీ. దూరంలో గొట్టిపడియ దగ్గర నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని ‘కొల్లం వాగు’ వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ చేపట్టింది. 1994 డీపీఆర్పై ఆధారపడిన మొదటి దశ ప్రతిపాదనలో 10.7 టీఎమ్సీ నీటిని 45 రోజులలో 7 మీటర్ల వ్యాసం, 85 క్యుమెక్స్ సామర్థ్యం గల సొరంగం కాలువ ద్వారా తరలించాలని తలపెట్టారు. రెండవ దశ పనులలో భాగంగా 9.2 మీటర్ల వ్యాసం, 243 క్యుమెక్స్ సామర్థ్యం గల రెండవ సొరంగ కాలువ జతచేయబడటం వలన 30 రోజుల వరద నీటితోనే జలాశయం నిండే అవకాశం ఏర్పడింది. మార్కాపురం, యర్రగొండ పాలెంల నుంచి పలు సార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని కరువు ప్రాంతాలకు సాగు నీరు, త్రాగునీరు అందించడానికి పోరాటం చేసిన పూల సుబ్బయ్య పేరు మీద ఈ ప్రాజెక్టుకు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ అనే పేరు పెట్టారు. వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పనులను పరుగులెత్తించారు. 2020లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడమే కాక, కొండంత అవినీతి జరిగింది. వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీపీ పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తు న్నారనే నెపంతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం వలన రూ. 49.49 కోట్లు దుర్వినియోగం కాగా, వైఎసార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వలన ప్రభుత్వ ఖజానాకు రూ. 61.67 కోట్లు మిగిలిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో 6.686 కి.మీ (మొదటి సొరంగం 4.331 కి.మీ. రెండవ సొరంగం 2.355 కి.మీ.) తవ్వకం పని మాత్రమే జరిగింది. కాగా వైఎస్సార్, జగన్ల పాలనా కాలంలో 31 కిలోమీటర్ల దూరం తవ్వకం జరగడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించినా కాంట్రాకరుకు లబ్ధి, ఖజా నాపై భారం పడిందే కానీ పని వేగం మాత్రం పెరగలేదనేది కాదనలేని సత్యం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నల్లమల సాగర్ నుంచి ఐదు కాలువల ద్వారా నీటిని నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్, ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతా లకు మొత్తం 30 మండలాలలోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4,49,000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్న స్వర్గీయ డా‘‘ వైఎస్ఆర్ లక్ష్యం నెరవేరుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లా లోని 23 మండలాలకు చెందిన 3.36 లక్షల ఎకరాలకూ, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకూ, కడప జిల్లా లోని రెండు మండలాలకు చెందిన 29 వేల ఎకరాలకూ ఆయకట్టుకు సాగు నీరు, 30 మండ లాల్లోని కరువు పీడిత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటి సౌకర్యం లభిస్తుంది. తండ్రి ఆశయాలను సాకారం చేసిన తన యునిగా, కరవు ప్రాంతాలకు నీరు అందించిన భగీరథునిగా జగన్ ప్రజల మన్ననలు పొందేందుకు మార్చి 5వ తేదీన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను జాతికి అంకితం చేయడం మలి అడుగుగా భావించాలి. లింగమనేని శివరామ ప్రసాద్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 79813 20543 -
కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది. కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది. బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ.. దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్ వివాదంతో కదలిన కేంద్రం సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
మీ వైఫల్యం వల్లే.. సాగర్ స్పిల్ వే సగం స్వాధీనం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్ స్పిల్వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్కుమార్ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది. ► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం. ► సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు. నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
సీఆర్పీఎఫ్ పహారాలో ‘సాగర్’
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. హక్కులు కాపాడుకోవడానికే.. తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్లో సగం స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. దీనిపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోందన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికే సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. తెలంగాణ సర్కార్ తీరుతో వివాదాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని, ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్లే గెజిట్ నోటిఫికేషన్ అమలులో జాప్యం జరుగుతోందని, దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్మోహన్ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు.. సాగర్ డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పోలీస్స్టేషన్లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు రెండు రాష్ట్రాల సీఎస్ల వాదనలు, కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్పై స్టేటస్ కో కొనసాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివాదంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేశారు. కొనసాగుతున్న నీటి విడుదల రెండో రోజు సాగర్ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్గేట్లు, హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తును పరిశీలించారు. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలాల వాటాను తేల్చి, నీటిని పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై న్యాయసలహా, తెలంగాణ సర్కార్ అభిప్రాయం తీసుకుని కొత్త గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్పై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి. కానీ.. ప్రస్తుత జల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉత్పన్నమైంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ♦ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించారు. ♦ గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతను తేల్చాలి. ♦ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాలి. దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టు హక్కులను పరిరక్షించేలా ఎగువ ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని రూపొందించాలి. ♦ కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలి. ♦ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశిస్తూ.. దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. ♦ ఉమ్మడి రాష్ట్ర పరిధిలో జీడబ్ల్యూడీటీ (గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరిలో నీటి లభ్యతను నిర్ధారించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాలు తేల్చడానికి ఐఎస్ఆర్డబ్ల్యూడీ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు) చట్టం–1956 సెక్షన్–4(1) ప్రకారం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ♦ జీడబ్ల్యూడీటీ అవార్డుతో పాటు విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తుండటాన్ని అనేక సార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ♦ ఆ ప్రాజెక్టుల డీపీఆర్లను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మదింపు చేసి.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదించేవరకూ వాటిని నిలుపుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ♦ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ♦ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం.. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన మేరకు ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గోదావరి జలాలను పంపిణీ చేయాలి. ♦ జీడబ్ల్యూటీడీ అవార్డు ద్వారాగానీ విభజన చట్టం ద్వారాగానీ రెండు రాష్ట్రాలకు ఇప్పటిదాకా గోదావరి జలాలను ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. కానీ.. తెలంగాణ సర్కార్ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమంగా కాళేశ్వరం(450 టీఎంసీలు), దేవాదుల మూడో దశ (22 టీఎంసీలు), తుపాకులగూడెం బ్యారేజ్ (100 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (100 టీఎంసీలు), వాటర్ గ్రిడ్ (32.58 టీఎంసీలు), లోయర్ పెన్గంగపై బ్యారేజ్లు (6.55 టీఎంసీలు), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్కు తరలింపు (3 టీఎంసీలు) ప్రాజెక్టులను చేపట్టింది. నికర జలాల్లో మిగులు లేకుండానే.. ♦జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో పాటు 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తేల్చింది. ♦ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం బ్యారేజ్, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు 659.691 టీఎంసీల కేటాయింపు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.20 టీఎంసీలు అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ డిమాండ్ 775.891 టీఎంసీలు. బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కే వరద జలాలపై పూర్తి హక్కు ఉంటుంది. ♦తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 471.686 టీఎంసీలను వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు అవసరం. అంటే.. తెలంగాణ డిమాండ్ 649.802 టీఎంసీలు. గోదావరిలో 1,430 టీఎంసీల నికర జలాలు ఉంటాయని వ్యాప్కోస్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. 1425.693 టీఎంసీలు అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదు. ♦గోదావరి నికర జలాల్లో మిగులు లేకున్నా సరే.. 714.13 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా అక్రమంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలుగుతుంది. ♦ గోదావరి జలాల వినియోగం, పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోయినా తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును 2015లో చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అనేకసార్లు కోరినా పెడచెవిన పెట్టి.. 2018, జూన్ 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ♦అంతర్రాష్ట్ర జల వివాదం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి చెల్లదు. -
Fact Check: కృష్ణాడెల్టాను ఎండబెట్టింది మీ చంద్రబాబే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడమే పనిగా పెట్టుకున్న రామోజీ కుక్క తోకలా తన బుద్ధి కూడా వంకరేనని రామోజీరావు ఎప్పటికప్పుడు తన రాతల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే.. కృష్ణాడెల్టా చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 2019, 2020, 2021, 2022లలో ఖరీఫ్కే కాదు.. అధికారికంగా రబీ పంటకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల కృష్ణా బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లోనే కాదు.. కృష్ణా డెల్టాలోనూ తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలను రక్షించి.. రైతులకు దన్నుగా నిలవడానికి జలవనరుల శాఖాధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమర్థవంతంగా నీళ్లందించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పైగా.. పులిచింతల నీటికి గోదావరి (పట్టిసీమ) జలాలను జతచేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందిస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ.. సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తుంటే రామోజీరావు అది చూసి క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. నిజాలను దాచేసి.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలను వల్లెవేస్తూ.. ‘కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు’ అంటూ పెడబొబ్బలు పెడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తన విషపుత్రిక ఈనాడులో రామోజీ విషం చిమ్మారు. ఇందులోని ప్రతి అక్షరంలో ఆయన అక్కసు తప్ప వీసమెత్తు నిజంలేదు. కృష్ణా డెల్టాకు 85.81 టీఎంసీలు సరఫరా.. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023–2024 ఖరీఫ్ పంటలకు జూన్ 7న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటివరకూ 85.81 టీఎంసీల నీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు.. మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణాడెల్టాకు అందించింది. ముందస్తు ప్రణాళికతో.. నిజానికి.. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతోపాటు రాష్ట్రంలోనూ తక్కువగా వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జునసాగర్లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదలచేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ.. కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా.. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం రానంతవరకూ కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను జూలై 21న ఆన్చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జతచేసి.. కృష్ణా డెల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలుచేయడంవల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వచేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే.. మూసీ ద్వారా వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పంటలు పచ్చగా.. ► ఇక కృష్ణా బేసిన్లోనే కాదు.. కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబరు నెలల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించకపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. ఇదీ వాస్తవం. కానీ, నీళ్లందకపోవడంవల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కసు వెళ్లగక్కారు. ► అలాగే, దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలుచేస్తూ.. ఒక వారంపాటు సగం నిర్ధేశిత ప్రాంతాలకు.. మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నప్పుడు మిగతా నిర్దేశిత ప్రాంతాల్లోని కాలువల్లో ప్రవాహం ఉండదు. అప్పుడు చివరి భూములకు రైతులు ఆయిల్ ఇంజన్లతో కాలువల్లో నిలిచి ఉన్న నీటిని తోడిపోసుకుని పంటలు కాపాడుకోవడం అక్కడక్కడ జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ‘ఈనాడు’ గగ్గోలు పెట్టింది. ► అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ ఒకేఒక్క పంటకు అరకొరగా నీళ్లందించారు. ఆ సమయంలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి. కృష్ణా తూర్పునకు 52.69.. పశ్చిమానికి 33.12 టీఎంసీలు.. కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 5,30,136 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. వారబందీ విధానాన్ని అమలుచేస్తూ ఆయకట్టుకు నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. ఏలూరు కెనాల్కు రోజూ 800 క్యూసెక్కుల నుంచి 1,200 క్యూసెక్కులు ఇప్పటివరకూ సరఫరా చేశారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రభుత్వం ఇలా అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ► కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలు ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా.. పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగుచేశారు. వాటికి ఇప్పటివరకూ 33.12 టీఎంసీలు అందించారు. ► పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసెక్కులను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. ► అలాగే, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ఏఎం ఛానల్ పరిధిలోని ఆయకట్టుకు, బాపట్ల జిల్లాలో బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని ఆయకట్టుకు సోమవారం నుంచి వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తారు. ► మరోవైపు.. సీఎం జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ► ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వఉన్నాయి. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత వరకూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి.. మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్ స్లూయిస్ ద్వారా నీరువదిలి.. వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. పులిచింతలతో కృష్ణా డెల్టా సుభిక్షం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి.. 2009 నాటికే దానిని చాలావరకూ పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ఠ స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వచేయవచ్చు. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించకపోవడంవల్ల ప్రాజెక్టులో అరకొరగా నీటిని నిల్వచేసి.. తక్కువ నీటిని సరఫరా చేసి.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణాడెల్టా రైతుల కడుపుకొట్టారు. కానీ, వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తిస్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేసి.. నాలుగేళ్లుగా డెల్టాలో ఏటా రెండు పంటలకు నీళ్లందించారు. అలాగే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తుండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే. -
కృష్ణా జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశంపైనా చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్–89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదావరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటాయింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు. అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్కు తరలిస్తున్నప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటాయించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. -
ప్రకాశం బ్యారేజ్కు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్లో ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
Fact Check: అక్షరం అక్షరంలో అక్కసు..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్కు ఆపాదించడం.. వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ నీతిమాలిన రోత రాతలను అచ్చేయడంలో తనకు అలుపే లేదని రామోజీరావు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటున్నారు. కుక్క తోకలా తన బుద్ధీ ఎప్పటికీ వంకరేనని చాటుకోవడానికి ఆయనకు ఆయనే తెగ పోటీపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోత రాతలను అచ్చేయడాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ‘పోలవరంలో ఇదేం దారుణం?’ శీర్షికన ‘ఈనాడు’లో తాజాగా ప్రచురించిన కథనం. ఆ కథనంలోని ప్రతి అక్షరంలో కాంట్రాక్టర్గా తన కొడుకు వియ్యంకుడిని తప్పించారనే కోపం.. డీపీటీ (దోచుకో పంచుకో తినుకో)కి అడ్డుకట్టపడిందనే అక్కసు.. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తుండటంపై అసూయ కన్పించింది తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అసలు నిజాలు ఇవీ.. ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్ల మధ్య సీపేజీ (ఊట నీరు) అంచనాలకు మించి 30 రెట్లు అధికంగా వచ్చింది.. వాస్తవం: కమీషన్లకోసం కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు.. రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ప్రాజెక్టు ప్రోటోకాల్కు విరుద్ధంగా.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలొచ్చే పనులు చేపట్టి, కమీషన్లు వసూలుచేసుకుని డీపీటీ విధానంలో పంచుకుతిన్నారు. ఈ క్రమంలోనే గోదావరి వరదను మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేయకుండానే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించి చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదం చేసింది. ఇందులో మరో ఘోరం ఏమిటంటే.. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఎగువ కాఫర్ డ్యామ్ను పాక్షికంగా నిర్మించి, ఇరువైపులా 650 మీటర్ల ఖాళీ ప్రదేశం.. దిగువ కాఫర్ డ్యామ్ను పాక్షికంగా నిర్మించి, రెండు వైపులా 480 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉంచింది. కాఫర్ డ్యామ్లు అనేవి తాత్కాలిక కట్టడాలు మాత్రమే. వాటి పునాదుల గుండా సీపేజీ రాకుండా సాధారణంగా జెట్ గ్రౌటింగ్ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో ఎగువ కాపర్ డ్యామ్ పునాదిని పటిష్టపరిచారు. 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. టీడీపీ సర్కార్ ఎగువ కాఫర్ డ్యామ్లో వదిలేసిన ఖాళీ ప్రదేశాల గూండా 13.5 మీటర్లు/సెకను అంటే గంటకు దాదాపు 40 కిమీల వేగంతో ఆ వరద ప్రవహించడంవల్ల జెట్ గ్రౌటింగ్ బలహీనపడి సీపేజీ అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగింది. దానివల్లే రెండు కాఫర్ డ్యామ్ల మధ్యలోకి సీపేజీ నీరు చేరుతోంది. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ సర్కార్దే. కానీ, మీ దోపిడీని కప్పిçపుచ్చుకునే క్రమంలో ఆ చారిత్రక తప్పును వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే ఎలా రామోజీ? ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణాన్ని తమ అనుమతిలేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ఇది చెయొద్దని చెప్పినా వినడంలేదని నాలుగు రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి పీపీఏ అధికారులు తీసుకెళ్లారు. దీనికి ఆయన విస్తుపోయారు.. వాస్తవం: రామోజీరావు జర్నలిజం విలువల పతనానికి ఇది పరాకాష్ట. కేంద్ర జల్శక్తి శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించడం సాధారణమే. ఆ క్రమంలోనే గతనెల 29న ఓ సమావేశాన్ని నిర్వహించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినడంలేదని.. అనుమతులు తీసుకోకుండానే రెండు కాఫర్ డ్యామ్ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు దిగువ కాఫర్ డ్యామ్ కుడి గట్టున బటర్ఫ్లై తూము నిర్మిస్తున్నారని పీపీఏ అధికారులు ఫిర్యాదు చేసినట్లు.. దీనికి కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి విస్తుపోయినట్లుగా అవాస్తవాలను రామోజీరావు చిత్రీకరించారు. ఆ సమావేశంలో ఏ బల్ల కింద నక్కి విన్నావ్ రామోజీ? అసలు జరిగిన విషయం ఏమిటంటే.. రెండు కాఫర్ డ్యామ్ల మధ్యన చేరిన సీపేజీ నీటిని బయటకు పంపే పద్ధతిని సాంకేతికంగా మదింపు చేసి.. నిపుణులతో చర్చించి ఆర్థికంగా తక్కువ భారమయ్యేలా ఓ ప్రతిపాదనను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దిగువ కాఫర్ డ్యామ్కు ఆనుకుని కుడి వైపున ఉన్న తిప్పకు అంచులో పైపు తూములు నిర్మించి.. వాటికి నాన్–రిటర్న్ వాల్వులు అమర్చి.. వాటి ద్వారా సముద్ర మట్టానికి 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నీటిని గ్రావిటీపై బయటకు పంపి, మిగిలి ఉన్న నీటిని పంపుల ద్వారా తోడిపోసే విధానాన్ని సూచించింది. ఆ ప్రతిపాదనకు అనుమతి వచ్చేలోగా విలువైన సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో పీపీఏకు సమాచారమిచ్చే సన్నాహక పనులనే జలవనరుల శాఖ చేపట్టింది. ఇదీ వాస్తవం. ఈనాడు ఆరోపణ: ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీపై తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు.. వాస్తవం: ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందే సీపేజీపై ఐఐటీ నిపుణులు అంచనా వేసినప్పుడు.. పునాదిని జెట్ గ్రౌటింగ్తో పటిష్టవంతం చేస్తే సీపేజీ పరిమితికి లోబడే ఉంటుందని లెక్కించారు. కానీ, టీడీపీ సర్కారు కమీషన్ల కోసం ప్రాజెక్టును పణంగా పెట్టింది. ప్రాజెక్టు ప్రోటోకాల్కు విరుద్ధంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు చేపట్టి.. వాటిని పూర్తిచేయలేక ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల 2019–20లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా దెబ్బతింది. దీనివల్లే సీపేజీ అధికంగా ఉంది. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసేందుకే అభూత కల్పనలతో కథనాన్ని వండివార్చావన్నది వాస్తవం కాదా రామోజీ? -
5 ప్రాధాన్య ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తికావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం 22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్లు జారీ చేయాలన్నారు. -
గైడ్ బండ్ సమస్య చిన్నదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్లో కొద్దిమేర జారడం చిన్న సమస్యేనని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని నిపుణుల కమిటీ తేల్చింది. గైడ్ బండ్ ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణం కాదని, స్పిల్ వే మీదుగా వరద సులువుగా వెళ్లేలా చేయడానికి నిర్మించింది మాత్రమేనని స్పష్టంచేసింది. గోదావరికి సాధారణంగా ఆగస్టులో భారీ వరదలు వస్తాయని, ఆలోగా గైడ్బండ్కు తాత్కాలిక ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. తాత్కాలిక దిద్దుబాటు చర్యల ప్రతిపాదనను నాలుగు రోజుల్లోగా పంపితే.. దానిలో మార్పులుంటే చేసి సీడబ్ల్యూసీకి పంపి తక్షణమే ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రతిపాదన మేరకు జూలైలోగా గైడ్ బండ్ తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిపుణుల కమిటీతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ మరోసారి సమావేశమై.. గైడ్ బండ్ను పటిష్టం చేయడానికి తాత్కాలిక, శాశ్వత చర్యలపై చర్చించింది. సీడబ్ల్యూసీకి వారంలో నివేదిక గైడ్ బండ్లో కొంత భాగం కాస్త జారడానికి కారణాలపై రాష్ట్ర అధికారులతో నిపుణుల కమిటీ మేధోమథనం జరిపింది. నిపుణుల కమిటీలోని నలుగురు సభ్యులూ.. నాలుగు రకాల అభిప్రాయలు వెల్లడించటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఢిల్లీలో మరోసారి సమావేశమై గైడ్ బండ్ జారడానికి కారణాలపై వారంలోగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇస్తామని పాండ్య తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల ప్రతిపాదన ఇదీ గైడ్ బండ్ ఎత్తు 51.32 మీటర్లు. పొడవు సుమారు 134 మీటర్లు. ఇందులో కొన్ని చోట్ల 3 మీటర్లు, కొన్ని చోట్ల ఆరు మీటర్ల మేర కాస్త జారింది. జారిన ప్రదేశాల్లో ఇప్పటికే పెద్ద రాళ్లు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాటిపైన మళ్లీ పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటి మధ్య సిమెంటు మిశ్రమం (స్లర్రీ) పోయాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాబియన్లు వేయాలని పేర్కొంది. దీనివల్ల వరద ఉద్ధృతిని గైడ్ బండ్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా స్పిల్ వేకు ఎగువన ఏర్పడే సుడిగుండాలను నియంత్రించి, వరదను సులువుగా దిగువకు వెళ్లేలా చేయడానికి 2:1 నిష్పత్తిలో గైడ్ బండ్ నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారమే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొంతమేర జారడంతో సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం చేయించాలని నిపుణుల కమిటీ సూచించింది. గైడ్ బండ్ను 3:1 నిష్పత్తిలో నిర్మిస్తే స్పిల్ వే వద్ద వరద ప్రవాహం ఎలా ఉంటుందో అధ్యయనం చేయించాలని పేర్కొంది. గైడ్ బండ్ నిర్మాణ ప్రాంతంలో వరద సమయంలో, వరద తగ్గాక మట్టిని సేకరించి, నాణ్యతపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లో అధ్యయనం చేయించాలని పేర్కొంది. వాటి ఆధారంగా గైడ్ బండ్ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే డిజైన్ను రూపొందిస్తామని వెల్లడించింది. -
డిజైన్కు తగ్గట్టుగానే పోలవరం గైడ్ బండ్ నిర్మాణం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్కు తగ్గట్టుగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ను నాణ్యంగా నిర్మించినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిపుణుల కమిటీ తేల్చింది. కానీ.. గైడ్ బండ్ కొంత భాగం కాస్త జారిందని, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విషయంపై మేధోమథనం జరిపింది. మట్టి పరీక్షల నివేదికలను పరిశీలిం చింది. గైడ్ బండ్ జారిన ప్రాంతానికి తాత్కాలిక మరమ్మతులపై నాలుగు రోజుల్లోగా ప్రతిపాదన ఇస్తే.. దాన్ని సరిచూసి సీడబ్ల్యూసీకి నివేదిస్తామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తక్షణం మరమ్మతుల చేయాలని, ఆ తర్వాత గైడ్ బండ్ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్కే సిబాల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) డైరెక్టర్ చిత్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్నందన్కుమార్ సభ్యులుగా సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. స్పిల్ వే, గేట్లు, స్పిల్ చానల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. గైడ్ బండ్ను సమగ్రంగా పరిశీలించింది. పరిమితికి లోబడే ఎగువ కాఫర్ డ్యామ్ లీకేజీలు గతేడాది గోదావరికి భారీ స్థాయిలో వచ్చిన వరదలను దీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచింది. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్ డ్యామ్లో లీకేజీలను రీచ్లవారీగా ఎప్పటికప్పుడు అధునాతన హైడాల్రిక్ డాప్లర్ టూల్తో కొలుస్తున్నామని రాష్ట్ర అధికారులు కమిటీకి వివరించారు. హైడ్రాలిక్ డాప్లర్ టూల్లో రికార్డయిన గణాంకాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. ఎగువ కాఫర్ డ్యామ్లో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని పేర్కొంది. వరదల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ కాఫర్ డ్యామ్ భద్రతను పర్యవేక్షించాలని సూచించింది. యథాస్థితికి తెచ్చే పనులపై సంతృప్తి గత ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసిన దిగువ కాఫర్ డ్యామ్ నాణ్యతపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ప్రధాన డ్యామ్ వద్ద వరద ఉధృతికి ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులను పరిశీలించింది. ఈ పనులు పూర్తయ్యాక డయాఫ్రం వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రం వాల్ వేసే పనులు చేపడతామని రాష్ట్ర అధికారులు వివరించారు. శుక్రవారం నిపుణుల కమిటీ మరో సారి రాష్ట్ర అధికారులతో సమావేశమై.. సాంకేతిక అంశాలపై చర్చించనుంది. క్షేత్ర స్థాయి పర్యటన.. అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. -
పోలవరం చకచకా..
గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బతింది. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడమే కాదు.. వాటిని చక్కదిద్దడం కోసం రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే.. అప్పట్లో ఆ పనులను రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో అప్పగించారు కాబట్టి. ఆ తప్పిదాలన్నింటినీ సరిదిద్దుతూ.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. టీడీపీ సర్కార్ హయాంలో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక తిన్నెలు కోతకు గురై ఏర్పడిన అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తయితే.. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తయిన నేపథ్యంలో వాటి మధ్య గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ (ప్రధాన) డ్యామ్ పనులు చేపట్టి.. గడువులోగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు. మంగళవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. 9.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ దిగి నేరుగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు చేరుకున్నారు. మండుటెండలో కలియతిరుగుతూ.. మండుటెండలో తీవ్రమైన ఉక్కపోత మధ్య సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను ఒక గంటా 40 నిమిషాలపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గైడ్ వాల్లను పరిశీలిస్తూ.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గత సీజన్లో వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచిన పనులను పరిశీలించారు. టీడీపీ సర్కార్ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్లో రెండు వైపులా 800 మీటర్లు ఖాళీ వదిలేసి, అరకొరగా చేసిన పనులను.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 44 మీటర్ల ఎత్తుతో పూర్తయిన ఎగువ కాఫర్ డ్యామ్ పనులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను పరిశీలించారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను పరిశీలిస్తూ.. దిగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గోదావరి వదరల ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాన్ని పూడ్చి.. 31.5 మీటర్ల ఎత్తుతో ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసిన ఆ డ్యామ్ను పరిశీలించారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలలో ఇసుకను నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను నిశితంగా పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించడంపై అధికారులతో చర్చించారు. సీఎం చొరవ వల్లే నిధులు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్దే మీటింగ్ హాల్లో జల వనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశను పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం జారీ చేసిందని జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపంతో చేపట్టిన పనుల వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి యథా స్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. బిల్లుల చెల్లింపులో కాంపొంనెంట్(విభాగాల) వారీ విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని అధికారులు వివరించారు. మీ (సీఎం) చొరవ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు గైడ్ వాల్లో ఏర్పడిన చిన్న సమస్యను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లతోనే గైడ్ వాల్ పనులు చేశామని చెప్పారు. ప్రస్తుత సమస్యను కూడా సీడబ్ల్యూసీకి నివేదించామన్నారు. గైడ్ వాల్లో ఉత్పన్నమైన సమస్యను సరిదిద్దడం పెద్ద విషయం కాదని.. సీడబ్ల్యూసీ అధికారులు పరిశీలించాక.. వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని వివరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్య మీడియా మన రాష్ట్రంలో ఉందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు స్ట్రక్చర్తో ఏమాత్రం సంబంధం లేని గైడ్ వాల్లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని కూడా పాజిటివ్గా తీసుకుని సరిదిద్దే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి పినిపే విశ్వరూప్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కీలక పనుల్లో గణనీయమైన ప్రగతి పోలవరం ప్రాజెక్టులోని కీలక పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు పూర్తి చేశామని.. 48 రేడియల్ గేట్లను పూర్తి స్థాయిలో అమర్చామని.. రివర్ స్లూయిస్ గేట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ పూర్తయిందని చెప్పారు. జల విద్యుత్కేంద్రంలో సొరంగాల తవ్వకం పూర్తయిందని.. అప్రోచ్ ఛానల్ తవ్వకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాన్ని ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు పూర్తయ్యాయన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను నింపడానికి అవసరమైన ఇసుకను వంద శాతం ఆ ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఆ ఇసుకను అగాధాలలో నింపే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్యాప్–2లో యధాస్థితికి తెచ్చే పనులను త్వరగా పూర్తి చేసి.. వీలైనంత తొందరగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్నారు. ఈ పనులు పూర్తయితే.. గ్యాప్–2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి.. వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించడం ద్వారా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత, కొత్త డయాఫ్రమ్ వాల్ను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. పునరావాసం కల్పనపై ప్రత్యేక దృష్టి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 నిర్వాసిత కుటుంబాలకుగాను 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించామని చెప్పారు. మరో 8,288 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగంగా చేస్తున్నామన్నారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్లోకి 36 గ్రామాలు వస్తాయని తేలిందని, ఆ గ్రామాల్లోని 16,642 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక.. షెడ్యూలు ప్రకారం నిర్వాసితులను అక్కడికి తరలించాలని సూచించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకట్టుకునేలా బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. పర్యాటకుల కోసం అధునాతన సదుపాయాలతో హోటల్ ఏర్పాటు చేయాలన్నారు. -
2025 జూన్కు పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా, సలహాదారు వెదిరె శ్రీరాంలతో కలిసి మంత్రి షెకావత్ సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి (ఇన్చార్జి) శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, పీపీఏ సీఈవో శివ్నందన్కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి షెకావత్కు ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్లు పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని చెప్పారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెస్తున్నామన్నారు. మళ్లీ వరదలు వచ్చేలోగా ఈ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఈలోగా గ్యాప్–1లో ప్రధాన డ్యామ్ పనులు చేపడతామన్నారు. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా నిర్మించే వాల్ డిజైన్ను తక్షణమే ఖరారు చేయాలని సీడబ్ల్యూసీని కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల స్థానంలో లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను పూడ్చి, వైబ్రోకాంపాక్షన్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దశలవారీగా నీటి నిల్వ ప్రాజెక్టులో మూడు దశల్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఈఎన్సీ చెప్పారు. తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. ఈ స్థాయిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని వివరించారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు 45.72 మీటర్ల పరిధిలోకే వస్తాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రెండో, మూడో ఏడాది 45.72 మీటర్ల పరిధిలోని మొత్తం 1,00,006 కుటుంబాలకు పునవాసం కల్పించి.. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునవాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు. ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్ చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టులపై గోదావరి బోర్డులో చర్చ పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు అనుమతి లేకుండా చేపట్టారని, వాటి డీపీఆర్లు పంపి, ఆమోదం తీసుకోవాలని రాష్ట అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ... తెలంగాణ కూడా అనుమతి లేకుండా కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ తదితర ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ విషయాన్ని గోదావరి బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమైనవేనని, పోలవరం పూర్తయితే ఆ రెండు ఎత్తిపోతలను మూసేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టామన్నారు. అప్పట్లోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. దాంతో.. అనుమతి లేని ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్నందన్కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్హెచ్పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్హెచ్పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్హెచ్పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
పోలవరం డయాఫ్రమ్వాల్పై 28లోగా నివేదిక
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ పాపాల వల్ల.. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్వాల్ (పునాది) భవితవ్యాన్ని తేల్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డయాఫ్రమ్వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు గతనెల 26 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఎన్హెచ్పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల బృందం హైరిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్ టోమోగ్రఫీ విధానాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. ఈనెల 28లోగా రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లకు ఆ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) బృందం పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్వాల్ను మార్చి 4న క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. డయాఫ్రమ్వాల్ సామర్థ్యం బాగున్నట్లు ఎన్హెచ్పీసీ నివేదిక ఇస్తే.. ప్రధాన డ్యామ్ పనులకు డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్హెచ్పీసీ తేల్చితే.. దాన్ని సరిదిద్దాలా? లేదంటే పాతదానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్వాల్ నిర్మించాలా? అనే అంశాలపై సీడబ్ల్యూసీ, ఐఐటీ(ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్) ప్రొఫెసర్లతో మార్చి 5న డీడీఆర్పీ బృందం మేధోమథనం జరుపుతుంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా డయాఫ్రమ్వాల్ భవితవ్యాన్ని తేల్చుతుంది. -
పోలవరం నావిగేషన్ కెనాల్పై కదలిక
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్పై కేంద్రం కదిలింది. కేంద్ర షిప్పింగ్, పోర్టుల శాఖ కార్యదర్శి సుదాన్‡్షపంత్, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) చైర్మన్ సంజయ్ బందోపాధ్యాయ, సీడబ్య్లూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్ కుశ్వీందర్ వోరా, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్నందన్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలతో గురువారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ జలమార్గం–4లో పేర్కొన్న క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్ను అభివృద్ధి చేయాలంటే రూ.876.38 కోట్ల వరకు ఖర్చవుతుందని సమావేశంలో రాష్ట్ర అధికారులు వివరించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం ఇప్పటికే నావిగేషన్ కెనాల్, మూడు లాక్లు, టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం చేపట్టిన నావిగేషన్ కెనాల్ను చిన్న పడవల రవాణాకు ఉపయోగించుకుని.. దానికి సమాంతరంగా క్లాస్–3 ప్రమాణాలతో మరో నావిగేషన్ కెనాల్ తవ్వి, దాన్ని భారీ నౌకల రవాణాకు వాడుకోవాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనపై అధ్యయనానికి కేంద్ర షిప్పింగ్, ఐడబ్ల్యూఏఐ, సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ వేస్తామన్నారు. రెండు నెలల్లోగా అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం నావిగేషన్ కెనాల్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకూ నావిగేషన్ కెనాల్ పనులు ఆపేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2016 నుంచి ఉలుకూ పలుకులేని ఐడబ్ల్యూఏఐ నిజానికి.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను 2004–05లోనే కేంద్రం ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు (ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీల పొడవుతో అప్రోచ్ చానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్లు.. 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్ల పనులు దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తిచేసింది. అలాగే.. ► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ► ఈ క్రమంలో 2016లో ఐడబ్ల్యూఏఐ గోదావరి, కృష్ణా నదులను జాతీయ జలమార్గం–4గా ప్రకటించి.. అందులో భాగంగానే ధవళేశ్వరం నుంచి భద్రాచలం స్ట్రెచ్ను చేర్చింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. ► క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్ను నిర్మించాలంటే.. 1.423 కి.మీల పొడవున అప్రోచ్ ఛానల్ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్ఎస్డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్లు.. 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ► ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుందని.. ఆ మేరకు నిధులు విడుదలచేస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకమార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. కానీ, ఐడబ్ల్యూఏఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జలాశయం పూర్తవుతుండటంతో.. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ పనులు చేపట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్శక్తి శాఖ రంగంలోకి దిగింది. జాతీయ జలమార్గం ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ పనులను చేపట్టాలని ఐడబ్ల్యూఏఐకు సూచించింది. ఈ క్రమంలోనే గురువారం కేంద్ర జల్శక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. -
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలకు శ్రీకారం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదావరి వరదలకు దెబ్బతిన్న పునాది డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలకు నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) నిపుణుల బృందం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్నందకుమార్, సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలతో ఎన్హెచ్పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్, సీనియర్ మేనేజర్లు ఎ.విపుల్ నాగర్, ఎన్.కె.పాండే, ఎం.పి.సింగ్ సమావేశమయ్యారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్ టోమోగ్రఫీ విధానాల్లో పరీక్షలు నిర్వహించడంపై చర్చించారు. తర్వాత గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్పై ప్రతి మీటరుకు ఒకచోట 20 మిల్లీమీటర్ల (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతువరకు జలవనరుల శాఖ అధికారులు వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్లను అమర్చి హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ పనులకు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్కు ఒక మీటరు ఎగువన, ఒక మీటరు దిగువన 60 ఎంఎం వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతువరకు ప్రతి 40 మీటర్లకు ఒకటి చొప్పున తవ్విన బోరు బావుల్లోకి ఎలక్ట్రోడ్లను పంపి సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభించే ఈ పరీక్షలు పూర్తవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు పరీక్షల ఫలితాలను విశ్లేషించడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద 45 రోజుల్లోగా డయాఫ్రమ్ వాల్ భవితవ్యం వెల్లడికానుందని తెలిపాయి. -
రూ.635.21 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆర్థిక బిడ్ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్.ఎల్.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్ను ఎస్.ఎల్.టి.సి. ఆమోదిస్తుంది. తర్వాత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తూ జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. -
Polavaram: కేంద్రం సానుకూల స్పందన.. పోలవరానికి రూ.5,036 కోట్లు
సాక్షి, అమరావతి: నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని.. మార్చివరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పనకు రూ.2,242.25 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.1,115.12 కోట్లలో ముందస్తుగా రూ.3,087.37 కోట్లు వెరసి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ శివ్నందకుమార్ సోమవారం సిఫార్సు చేశారు. దీన్ని ఆమోదించిన కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్.. పోలవరానికి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు గురువారం ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఒకట్రెండు రోజుల్లో మంత్రి షెకావత్ ఆమోదముద్ర వేసి, ఆర్థిక శాఖకు పంపుతారని, రీయింబర్స్ంట్ రూపంలో మంజూరు చేయాల్సిన రూ.1,948.95 కోట్లను రెండు వారాల్లోగా విడుదల చేస్తామని కేంద్ర జల్శక్తి శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి వరకూ చేయల్సిన పనులకు అవసరమైన రూ.3,087.37 కోట్లను ముందస్తుగా విడుదల చేస్తామని తెలిపాయి. వాటితో తొలిదశ పనులకు నిధుల సమస్య ఉత్పన్నం కాదని.. ఈలోగా 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,458.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ కొలిక్కి వస్తుందని వెల్లడించాయి. సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే.. పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అంటే గరిష్ఠ నిల్వ 194.6 టీఎంసీలను నిల్వచేసే స్థాయిలో పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్రంలో కదలిక.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయిన ప్రతిసారీ సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరానికి నిధులివ్వాలని కోరుతూ వస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలోనూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతోపాటు పోలవరం నిధుల అంశాన్ని జగన్ ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సత్వర పూర్తికి వీలుగా అడ్హక్ (ముందస్తు)గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని జనవరి 3న ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరానికి అడ్హక్గా నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర అధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీతో రాష్ట్ర అధికారులతో ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీ మూడుసార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో పోలవరానికి అడ్హక్గా నిధుల మంజూరుకు కేంద్ర కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్శక్తి శాఖను ఆదేశించింది. పనుల్లో మరింత వేగానికి దోహదం పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.20,702.58 కోట్లను ఖర్చుచేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రూ.4,730.71 కోట్లను వ్యయంచేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక అంటే 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ రూ.15,971.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయచేసింది. అందులో ఇప్పటివరకూ రూ.13,098.57 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,873.30 కోట్లను రీయింబర్స్ చేయాలి. కేంద్ర జల్శక్తి శాఖ సూచనల మేరకు.. రీయింబర్స్ చేయాల్సిన రూ.2,873.30 కోట్లతోపాటు అడ్హక్గా మార్చివరకూ భూసేకరణ, సహాయ పునరావాసం కల్పనకు రూ.2,286.55 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.2,118 కోట్లు వెరసి రూ.7,278 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ, పీపీఏ రూ.5,306.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి శాఖకు సిఫార్సు చేశాయి. ఈ నిధుల విడుదలైతే పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ కృషితోనే.. ముఖ్యమంత్రి కృషివల్లే పోలవరానికి రూ.5,036.32 కోట్ల విడుదలకు కేంద్ర జల్శక్తి శాఖ అంగీకరించింది. ఇందులో రాష్ట్రచేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను రీయింబర్స్మెంట్ రూపంలోనూ.. మార్చివరకూ చేయాల్సిన పనులకు అవసరమైన రూ.3,087.37 కోట్లను విడుదల చేస్తుంది. ఇవి విడుదలైతే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమవుతాయి. సాంకేతికపరమైన సమస్యలను కేంద్రం త్వరితగతిన పరిష్కరిస్తే గడువులోగా ప్రాజెక్టును పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – శశిభూషణ్కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ -
అవుకు రిజర్వాయర్ వద్ద రెండో టన్నెల్ రెడీ
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం(టన్నెల్)లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ను నింపడానికి మార్గం సుగమమైంది. ఇది దుర్భిక్ష రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో నాటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీల పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా 5.7 కి.మీల పొడవున సొరంగం (అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో ఒక్కొక్కటి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలు) తవ్వకం పనులు చేపట్టారు. మహానేత హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయలేని టీడీపీ సర్కార్ అవుకు సొరంగాలలో ఒక్కో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉండటం వల్ల కూలిపోవడం)లో పనులు చేయాలి. వాటిని చేయలేని టీడీపీ సర్కార్.. ఒక సొరంగంలో 165 మీటర్ల పొడవున సొరంగానికి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి.. దాన్ని వరద కాలువతో అనుసంధానం చేసింది. దీని వల్ల పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చు. గండికోట రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడం వల్ల 26.85 టీఎంసీలకుగాను నాలుగైదు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కార్ నిల్వ చేయగలిగింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోనూ నిర్వాసితులకు పునరవాసం కల్పించపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ 4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగింది. పైడిపాలెం రిజర్వాయర్లో 6 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నిల్వ చేసింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు ఏర్పడిన లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేసేవారు. పూర్తయిన అవుకు సొరంగాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఈఎన్సీ సి.నారాయణరెడ్డి రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ వేసి.. వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. మరో అడుగు ముందుకు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో రెండో సొరంగం(టన్నెల్)లో ఫాల్ట్ జోన్(కూలిన ప్రాంతం)లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. అత్యాధునిక పోలింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాలీయురిథేన్ యురెథేన్ ఫోమ్ గ్రౌటింగ్ చేస్తూ ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకం పనులను రెండ్రోజుల క్రితం పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 134 మీటర్లు పూర్తి చేశారు. నెలాఖరుకు మిగతా 131 మీటర్ల లైనింగ్ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుసాధ్యం చేశాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో 160 మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేయడాన్ని సవాల్గా తీసుకున్నాం. హిమాలయాల్లో సొరంగాలు తవ్వే నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సొరంగాన్ని పూర్తి చేయించాం. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి కాలువ ద్వారా తరలించవచ్చు. ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. – శశిభూషణ్కుమార్, ముఖ్య కార్యదర్శి జలవనరుల శాఖ సామర్థ్యం పెంచే పనుల్లో వేగం పెంచాం అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద మూడో టన్నెల్ తవ్వకం పనులు చేపట్టాం. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అప్పుడు గాలేరు–నగరి ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే పది రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ను నింపి, ఆయకట్టుకు నీళ్లందివచ్చు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, జల వనరుల శాఖ -
భూగర్భ జలం పుష్కలం.. నీటి సంరక్షణలో దేశంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్
ఎండిన బోరు బావికి జీవకళ ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భీమేష్. అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన రైతు. ఆరు ఎకరాలు పొలం ఉంది. గతంలో 1,250 అడుగులు తవ్విన బోరు బావి ఎండిపోవడంతో పొలం బీడుగా మారింది. 2020 నాటికి పుట్లూరు మండలంలో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వాన నీటిని ఒడిసిపట్టి చెరువులను నింపుతుండటంతో ఎండిన భీమేష్ బోరుబావికి జలకళ వచ్చింది. నాలుగు ఎకరాల్లో బత్తాయి, రెండు ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసిన భీమేష్ రెండో పంటగా మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యాడు. సాక్షి, అమరావతి: పాతాళగంగ పైపైకి వస్తోంది. ఎండిన బోరు బావుల నుంచి జలధారలు ఉబికి వస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 5.83 మీటర్లు అంటే కేవలం 19.13 అడుగుల్లోనే నీళ్లు లభ్యమవుతుండటంతో భూగర్భ జల వనరులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం భారీగా తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్రాల భూగర్భ జలవనరుల శాఖలు, కేంద్ర భూగర్భ జలమండలి విభాగం ఈ ఏడాది నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 667 మండలాల పరిధిలో 1,669 ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధ్యయనం చేశారు. జలసంరక్షణలో ఏపీ టాప్... ► నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు పడటంతో దేశంలో భూగర్భ జలాలు సగటున 15,453.69 టీఎంసీలు పెరిగాయి. ఇందులో సగటున 14,058.06 టీఎంసీలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే 8,445.85 టీఎంసీలు (60.80 శాతం) మాత్రమే వినియోగిస్తున్నారు. ► రాష్ట్రంలో సగటున 741 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ నైరుతి రుతుపవనాల కాలం ముగిసే నాటికి, అంటే అక్టోబర్ ఆఖరుకు 799.03 మి.మీ. వర్షపాతం కురిసింది. సాధారణ కంటే 7.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. రుతుపవనాల కాలం ప్రారంభమయ్యే నాటికి అంటే 2022 మే 30 నాటికి రాష్ట్రంలో సగటున 8.33 మీటర్లలో భూగర్భ జలమట్టాలు ఉండగా రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ 31 నాటికి సగటున 5.83 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. సగటున 2.5 మీటర్ల (8.21 అడుగులు) మేర రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. ► రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భ జలమట్టం అత్యధికంగా 5.56 మీటర్ల మేర శ్రీసత్యసాయి జిల్లాలో పెరిగింది. శ్రీకాకుళం జిల్లా రెండో స్థానం (4.82 మీటర్లు), ఏలూరు జిల్లా మూడో స్థానం (4.43 మీటర్లు)లో నిలవగా 0.62 మీటర్లు తగ్గడం ద్వారా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ► భూగర్భ జలాలు 637 మండలాలలో పుష్కలంగా లభ్యమవుతున్నాయి. మరో 19 మండలాల్లో జలమట్టం సమస్యాత్మకంగానూ, ఐదు మండలాల్లో అత్యంత సమస్యాత్మకంగానూ, ఆరు మండలాల్లో ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ ఆరు మండలాల పరిధిలోని 387 గ్రామాల్లో ఎడాపెడా భూగర్భ జలాలను తోడివేయడమే దీనికి కారణం. ► రాష్ట్రంలో భూగర్భ జలాలు 961.61 టీఎంసీల మేర పెరిగాయి. ఇందులో 913.23 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే ఏటా సగటున 15 లక్షల బోరు బావుల ద్వారా సాగు, తాగు నీటి అవసరాల కోసం 263.09 టీఎంసీలు (28.8 శాతం) మాత్రమే వాడుకుంటున్నారు. దేశంలో సగటున 60.8 శాతం మేర భూగర్భ జలాలను వాడుకుంటుండగా, రాష్ట్రంలో 28.8 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలో భద్రపరచడం, పొదుపుగా వాడకం ద్వారా నీటి సంరక్షణలో ఏపీ అగ్రగామిగా నిలిచింది. లభ్యతలో విజయనగరం ప్రథమ స్థానం రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యతలో విజయనగరం జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేవలం 1.99 మీటర్ల (6.5 అడుగులు)లో విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. బాపట్ల జిల్లా రెండో స్థానంలో (2.21 మీటర్లు), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూడో స్థానంలో(2.33 మీటర్లు) నిలిచాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏలూరు జిల్లాలో భూగర్భ జలమట్టం 17.94 మీటర్లకు (58.85 అడుగులు) దిగజారడం గమనార్హం. తీవ్ర వర్షాభావ ప్రాంతంలోని రాయలసీమ కంటే ఏలూరు జిల్లాలో భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉంది. -
పోలవరానికి నిధులు!
సాక్షి, అమరావతి: పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రూ.పది వేల కోట్లను ముందస్తు (అడ్హక్)గా ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ వినతిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రిచా శర్మ చెప్పారు. ఈ అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశం తర్వాత పోలవరానికి అడ్హక్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో 15 అంశాల అజెండాతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. పీపీఏ సభ్యులైన రిచా శర్మ ఇందులో పాల్గొన్నారు. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా సీఎం జగన్ ప్రతిపాదించిన మేరకు అడ్హక్గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు. దీనిపై రిచా శర్మ, చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ అడ్హక్గా నిధులు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రీయింబర్స్ నిధులివ్వండి.. ఈ సీజన్లో మార్చి వరకూ పనులకు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 2,807 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ నెల 21న జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ అంశాలను వివరించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో చెప్పారు. ప్రణాళికాయుతంగా పూర్తి.. గోదావరికి జూన్లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గతేడాది ఆమోదించిన వర్కింగ్ షెడ్యూల్కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో పీపీఏ కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనులను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికపై సర్వ సభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు. గోదావరిలో వరద ప్రవాహం 24 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో పనులు ప్రారంభించామని, జనవరి ఆఖరుకు దిగువ కాఫర్ డ్యామ్ను డిజైన్ మేరకు 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన ఉన్న నీటిని తోడివేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–1లో పనులు ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని పీపీఏ ఆదేశించింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనుల పరీక్షలను నిర్వహించి సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఫిబ్రవరికి భూ ఉపరితలం స్థాయికి పూర్తి చేయాలని నిర్దేశించింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను ఆమోదించారు. తొలిదశలో కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలు, రెండో దశలో మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని పీపీఏ సూచించింది. డిసెంబర్లో పీపీఏ సమావేశాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహించి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చిద్దామని రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనకు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అంగీకరించారు. రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం తరలింపుపై కూడా సానుకూలంగా స్పందించారు. బ్యాక్ వాటర్పై రీ సర్వేకు నిరాకరణ గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంతోపాటు తమ భూభాగంలో 827 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) రేఖ తమ భూభాగంలో లేదని, ఎఫ్ఆర్ఎల్కు మించి జలాలు వెనక్కి ఎగదన్నడం వల్ల తమ భూభాగం ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఎల్ రేఖ ఏపీ భూభాగంలోనే ఉంటుందని, కావాలంటే క్షేత్రస్థాయిలో చూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్కు, బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధమే ఉండదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదని సూచించారు. ఈ దశలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇప్పటికే అధ్యయనం చేశామని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావమే ఉండదని అందులో తేలిందని, మళ్లీ అధ్యయనం చేసే ప్రశ్నే లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు ప్రాంతాల రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీ రెండు దఫాలు సమావేశాలు నిర్వహించాయని గుర్తు చేశారు. జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ త్వరలో ముంపు ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. -
సత్వరం పోలవరం పూర్తిచేయడమే అజెండా
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేయడమే అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన హైదరాబాద్లోని పీపీఏ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. పీపీఏ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలి. ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించి, సమస్యలను పరిష్కరించడం ద్వారా సత్వరమే పూర్తి చేయడానికి ఈ సమావేశాలు దోహదపడాలనేది కేంద్రం ఉద్దేశం. కానీ, ఏడాదిగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కోరుతున్నా పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ స్పందించడం లేదు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ రాసిన లేఖకు ఎట్టకేలకు స్పందించిన అయ్యర్... పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు సకాలంలో నిధులు విడుదల చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పనుంది. నిర్వాసితులకు పునరావాసం కింద చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని తాము చేసిన ప్రతిపాదనను అమల్లోకి తేవాలని కోరనుంది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పనుల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ భవితవ్యం, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పూడ్చే విధానాలను తక్షణమే తేల్చి... ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై చర్చించనుంది. ఈ సీజన్లో దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తిచేయడంతోపాటు వరద ప్రారంభమయ్యేలోగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని అనుమతులు సత్వరమే వచ్చేలా చేయాలని డిమాండ్ చేయనుంది. -
ఎన్హెచ్పీసీ సూచనల మేరకు పోలవరం పనులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) వారు పరిశీలించిన అనంతరం వారి సూచనల మేరకు పనుల్లో ముందుకెళతామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన ఆదివారం పోలవరం ప్రాజెక్టు అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్, గ్యాప్–1 పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టిందని, ఈ సీజన్లో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేపట్టాలని భావిస్తున్నామని, ఏజెన్సీ వారు సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉన్న ఇబ్బందల్లా డయాఫ్రమ్ వాల్ స్థితిగతులు తెలుసుకోవడమేనన్నారు. ఎన్హెచ్పీసీ వారు డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత వారి సూచనల మేరకే పనులు చేపట్టాల్సి ఉంటుందని, వారి సూచనలు లేకుండా పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. వారు వచ్చి పరిశీలించడానికి డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిలో మునిగి ఉందని, ఆ నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నామని చెప్పారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ స్థితిగతులు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించామన్నారు. మంత్రి వెంట జలవనరుల శాఖ ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈ సుధాకర్, మెగా సంస్థ ప్రతినిధులు, అదికారులు ఉన్నారు. -
పాపికొండలకు పోటెత్తారు
రంపచోడవరం/దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు ఆదివారం తొలిరోజే పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఎక్కువమంది టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండు బోట్లలో 112 మంది పర్యాటకులు బయలుదేరారు. మూడునెలల విరామం తరువాత పర్యాటక, పోలీసు, రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారుల పర్యవేక్షణ, సూచనల మధ్య పాపికొండల పర్యాటకం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి రెండు బోట్లు ఉదయం 11 గంటలకు బయలుదేరాయి. మొదటి బోటుగా గోదావరి గ్రాండ్లో 82 మంది ఉన్నారు. వీరిలో బోటు పైభాగంలో 46 మంది, లోపల 36 మంది కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండోబోటు భగీరథిలో 30 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని టికెట్ ఆధారంగా అనుమతించారు. తొలిరోజు కావడంతో బోట్లు బయలుదేరేందుకు కొంత ఆలస్యం అయింది. రోజూ ఉదయం 9 గంటలకే పర్యాటకులతో బోట్లు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. బెంగళూరు నుంచి కూడా కొందరు పర్యాటకులు పాపికొండల విహారానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది గోదావరిలో ప్రయాణించి పాపికొండల అందాలు చూడాలని కోరిక ఉంది. అయితే పాపికొండల రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. తిరిగి పాపికొండలకు బోట్లు తిరుగుతాయని చెప్పారు. దీంతో 8 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వచ్చాం. పాపికొండల టూర్కు రావడం చాలా ఆనందంగా ఉంది. – సుష్మ, పర్యాటకురాలు, బెంగళూరు జాగ్రత్తలు పాటించాలి.. పాపికొండల విహారయాత్రను విజయవంతంగా ముగించేందుకు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. బోట్లో ప్రయాణించేటప్పుడు, తిరిగి బోట్ పాయింట్కు వచ్చేవరకు లైఫ్ జాకెట్లు తీయవద్దు. రోడ్డు ప్రయాణానికి, నీటిపై బోటులో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. బ్యాలెన్స్పై ఆధారపడి ఉంటుంది. గోదావరిలో బోటు వెళ్తున్నప్పుడు అటూ ఇటూ తిరగడం, అందరూ ఒకవైపు రావడం, తొంగిచూడడం చేయకూడదు. ఇలాచేస్తే బోటు ఒరిగిపోతుంది. సంతోషకరమైన ప్రయాణానికి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం. – సురేష్బాబు, సీఐ రంపచోడవరం -
లబ్ధి కోసమే ఎన్వోసీ!
సాక్షి, అమరావతి: సీఐడీ నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 467 (వాల్యుబుల్ సెక్యూరిటీ ఫోర్జరీ) తమకు ఎంతమాత్రం వర్తించదన్న టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ వాదనను హైకోర్టు ప్రాథమికంగా తోసిపుచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సెక్షన్ వారికి వర్తిస్తుందని అభిప్రాయపడింది. ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతోనే జల వనరుల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందారని, అందువల్ల అది వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనతో న్యాయస్థానం ప్రాథమికంగా ఏకీభవించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్పై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ తెలుసుకునేందుకు ఆ కేసు డైరీని తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నంలో పంట కాలువకు చెందిన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు జల వనరుల శాఖ ఎన్వోసీని ఫోర్జరీ చేశారంటూ ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడు, రాజేష్లపై సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అయ్యన్నపాత్రుడు, రాజేష్ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి విచారణ జరిపారు. అరెస్ట్ చేయొద్దంటే ఎలా...? సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఎన్వోసీని ఫోర్జరీ చేశారని, అందువల్ల అది ఐపీసీ సెక్షన్ 467 కింద వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఐపీసీ సెక్షన్ 30 చదివి వినిపించారు. దీని ప్రకారం న్యాయపరమైన హక్కు కల్పించేది ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీయే అవుతుందన్నారు. ఈ సెక్షన్ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఉదహరిస్తూ దాని ప్రకారం ప్రస్తుతం పిటిషనర్లు పొందినట్లు చెబుతున్న ఎన్వోసీ వాల్యు బుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపించడం సరికాదని పొన్నవోలు పేర్కొన్నారు. లేని డాక్యుమెంట్ ఆధారంగా భవనం కట్టారని, ఇందుకోసం ఫోర్జరీ ఎన్వోసీ సృష్టించారన్నారు. అసిస్టెంట్ ఈఈని బెదిరించి ఎన్వోసీపై సంతకం చేయించి ముద్ర వేయించారని తెలిపారు. నిందితులను ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకే వారిని అరెస్ట్ చేశామని నివేదించారు. కేసు నమోదు తరువాత వాస్తవాలను రాబట్టేందుకు నిందితులను అరెస్ట్ చేసే హక్కు దర్యాప్తు అధికారులకు ఉందన్నారు. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని, అరెస్ట్ చేయవద్దంటే సంబంధిత సెక్షన్ను చట్టం నుంచి తొలగించడమే మేలన్నారు. నిందితుల అరెస్ట్పై ఏ చట్టంలో కూడా ఎలాంటి నిషేధం లేదన్నారు. అయ్యన్న లాంటి వారి వల్ల దోపిడీ రాజ్యం తయారైందని, అలాంటి వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తే అది రామరాజ్యం అవుతుందన్నారు. కక్ష సాధింపు... అంతకు ముందు అయ్యన్న, రాజేష్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గతంలో తాము ఎన్వోసీ పొందామని, వాటి కాపీలను ఓ కేసులో హైకోర్టు ముందుంచామన్నారు. వాటిని జారీ చేసిన తేదీకి, ఫోర్జరీ తేదీకి పొంతన లేదన్నారు. ఏ రకంగానూ తమకు 467 సెక్షన్ వర్తించదన్నారు. మిగిలినవన్నీ సాధారణ సెక్షన్లేనని, వాటికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని పేర్కొన్నారు. కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం పరీక్షలు నవంబర్ మధ్యంతరం నుంచి మొదలవుతాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. వీటి తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలు నడుస్తున్న సమయంలోనే మరోవైపు దిగువ కాఫర్డ్యాం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోగా ఆర్అండ్ఆర్ పనుల్లో ప్రాధాన్యతగా క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అధికారునలు సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: ‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’ గోదావరిలో నిరంతరం ప్రవాహం ►1990 తర్వాత అత్యధికంగా వరద ► జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద. ►ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కుల వరద. ► ఆగస్టు 19న 15.92లక్షల క్యూసెక్కుల వరద. ►సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద. ► ఇప్పటికీ రెండున్నరల లక్షల క్యూసెక్కులకు పైగా వరద. ►1990లో 355 రోజుల ప్రవాహం. 7,092 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ►1994లో 188 రోజుల వరద, 5,959 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. ► 2013లో 213రోజుల వరద, 5,921 టీఎంసీల నీరు సముద్రంలోకి. ► 2022లో 136 రోజుల వరద, 6,010 టీఎంసీల నీరు సముంద్రంలోకి. ►కృష్ణానదిలో కూడా 1164.10 టీఎంసీల నీరు సముద్రంలోకి. ►వంశధారలోకూడా వరద జలాలు, 119.2 టీఎంసీలు సముద్రంలోకి ► నాగావళి ద్వారా 34.8 టీఎంసీలు సముద్రంలోకి ►పెన్నా నుంచి 92.41 టీఎంసీలు సముద్రంలోకి. ► ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్లగ్ కుషన్ పెట్టుకోగా రిజర్వాయర్లు అన్నింటిలో దాదాపు 90శాతం నీటి నిల్వ. ►గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు ప్రక్రియ ప్రారంభం. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు. ►విజయనగరం జిల్లా తారక రామ తీర్థసాగర్ పనులు నవంబర్లో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాలమేరకు మహేంద్ర తనయ పనులు పునరుద్ధరణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.852 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేసి త్వరలో టెండర్ ప్రక్రియను ఖరారు చేస్తామని, అవుకు టన్నెల్ పనులు కూడా పూర్తికావొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి వెలిగొండ టన్నెల్ –2లో మిగిలి ఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా జూన్ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లిఫ్ట్ స్కీంల నిర్వహణ కోసం ఎస్ఓపీ ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలన పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే వీటి నిర్వహణపై ఒక ఎస్ఓపీ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని, ప్రభుత్వం నుంచి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకునేలోగా తొలిదశ కింద ఇంకా పునరావాసం కల్పించాల్సిన తొమ్మిది వేల కుటుం బాల నిర్వాసితులకు నిధులను వేగంగా రీయింబర్స్ చేస్తామని తెలిపింది. కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్ను 30.5 మీటర్ల స్థాయికి పూర్తి చేసి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో నీటిని తోడి డయాఫ్రమ్ వాల్ పటిష్టతను తేల్చడం, అగాధాల పూడ్చివేత పరీక్షలు పూర్తి చేయాలని సూచించింది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్పై, అగాధాల పూడ్చివేత విధానంపై సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. ఆ మేరకు డయాఫ్రమ్ వాల్ను చక్కదిద్ది అగాధాలను పూడ్చి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని పేర్కొంది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మకు లేఖ రాశారు. జల్ శక్తి శాఖ నిధులను త్వరితగతిన విడుదల చేసి డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుందని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు. తొలిదశ పూర్తికి రూ.10,911 కోట్లు అవసరం.. పోలవరం తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధులపై జలవనరుల శాఖ అధికారులతో చర్చించి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 6న జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలి దశ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు జల్ శక్తి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం జగన్ కృషితో కదలిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని మోదీతో జరిగిన ప్రతి సమావేశంలోనూ 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులివ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలో జనవరి 3న ప్రధాని మోదీతో ఢిల్లీలో సీఎం జగన్ సమావేశమై విభజన సమస్యలు పరిష్కరించడంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నియమించే కమిటీతో చర్చించేందుకు కేంద్ర కమిటీని ఏర్పాటు చేయాలని పీఎంవోని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ క్రమంలో జనవరి 24న కమిటీల సమావేశంలో వెల్లడైన అంశాలను ఆగస్టు 22న జరిగిన భేటీలో ప్రధానికి సీఎం జగన్ వివరించారు. విభజన సమస్యలను పరిష్కరించడంతోపాటు పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి అడ్హక్గా రూ.పది వేల కోట్లు విడుదల చేయాలని వి/æ్ఞప్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పీఎంవో కమిటీ పోలవరానికి అడ్హక్గా రూ.పది వేల కోట్లను విడుదల చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ను పీఎంవో ఆదేశించింది. -
అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు నీటి రంగం అభివృద్ధిని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్ – ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాలను దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ‘ఈనాడు’ చేస్తోందని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టుల నిధులను గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా ఖర్చు చేసి, కాంట్రాక్టుల రూపంలో అనుయాయులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, పనులు మాత్రం జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందన్నారు. వంశధార నిర్వాసితులకు అదనపు ప్రయోజనం వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా 27,800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 225 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి కలుగుతోందని తెలిపారు. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్ ద్వారా కిడ్నీ వ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. ఈ నిర్వాసితులకు అదనపు ప్రయోజనం కల్పించేందుకు సీఎం జగన్ రూ. 217 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా హీర మండలం రిజర్వాయర్కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనుసంధానంతో 18,527 ఎకరాల స్థిరీకరణ వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల స్థిరీకరణకు, 4 మండలాల్లోని 38 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.145 కోట్ల నిధులకు అనుమతిచ్చిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో 43% పనులు పూర్తయ్యాయని, భూ సేకరణలో కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన పనులు ఆగాయని చెప్పారు. మిగతా పనులకు రూ.137 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. ఈ పనులను కూడా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తారకరామతీర్థ సాగరం ద్వారా 16 వేల ఎకరాలకు నీరు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. ఈ పనులు 59 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలో కాంట్రాక్టర్ను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామన్నారు. పునరావాస కార్యక్రమాలను ముందుగానే పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.7,214 కోట్లతో బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీనిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖతోపాటు ఇతర ప్రాంతాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు తరలించాలనేది లక్ష్యమన్నారు. తొలి దశలో రెండు ప్యాకేజీల్లో గత ప్రభుత్వం 2017–18లో రూ.2,022కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా పురోగతి లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, అంచనాలను రూ.17,411కోట్లకు పెంచిందన్నారు. ఫేజ్–2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టిందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుంచి 102వ కిలోమీటరు పొడవున శ్రీకా కుళం జిల్లా నడిగెడ్డ వరకు నీటిని తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 7,500 ఎకరాల భూసేకరణ త్వరగా జరుగుతోందని, 60 శాతం మేర డిజైన్లకు అనుమతి లభించిందన్నారు. మడ్డువలస రెండో దశ పనులు 79% పూర్తి మడ్డువలస రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5టీఎంసీల నీరిచ్చే లక్ష్యంతో రెండో దశ పనులను చేపట్టామని ఈఎన్సీ చెప్పారు. దీనివల్ల జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే 79 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు చేయలేకపోవడంతో రూ.26.9కోట్లతో సవరిం చిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించిందన్నా రు. వచ్చే ఖరీఫ్కు ఈ పనులు పూర్తవుతాయన్నారు. తోటపల్లి బ్యారేజి 83% పూర్తి విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి బ్యారేజ్ పనులను ప్రభుత్వం చేపట్టిందని నారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.123.21 కోట్లతో మిగిలిన పనులను రెండు ప్యాకేజిలుగా చేపట్టామన్నారు. ఈ పనులు 2023 జూన్కి పూర్తవుతాయన్నారు. రూ.854 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 1,200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్కు తరలించే ప్రధాన ఉద్దేశంతో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్టు నారాయణరెడ్డి తెలిపారు. 2.1 టీఎంసీల నీటిని నిల్వచేసే ఈ రిజర్వాయర్ ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియల్లో ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, రూ.854.25 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను చేపట్టి 2024 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జీడబ్ల్యూడీటీ) ప్రకారమే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. జీడబ్ల్యూడీటీ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు వెనుక భాగంలో వరద నీటి మట్టం ఎంత ఉంటుందో, ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతే ఉంటుందని తేల్చి చెప్పింది. బ్యాక్ వాటర్పై అధ్యయనం చేశాకే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది. ముంపు ప్రభావంపై సాంకేతికంగా వాస్తవాలను వివరించి, ప్రభావిత రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 7న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి నివేదిక ఇవ్వాలని ఈనెల 6న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తా వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ అధికారి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ల అధికారులు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకే.. పోలవరం నిర్మాణానికి అంగీకరిస్తూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిని జీడబ్ల్యూడీటీ ఆమోదించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. గోదావరికి వందేళ్లలో గరిష్టంగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అదే స్థాయిలో పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందన్నారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు వదిలేసేలా స్పిల్ వే డిజైన్ను సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించిందన్నారు. ఆ డిజైన్ ప్రకారమే కేంద్రం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను 2009 నాటికే ఇచ్చిందని.. ఆ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. ఒడిశా, చత్తీస్గఢ్లలో ముంపు నివారణకు సీలేరు, శబరి నదులకు కరకట్టల నిర్మాణానికి ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వందల సార్లు ఆ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని చెప్పారు. ఈ కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అధ్యయనమే ప్రామాణికం పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిన నేపథ్యంలో పర్యావరణ అనుమతిని పునఃసమీక్షించే వరకు పనులు నిలిపివేయాలని ఒడిశా, చత్తీస్గఢ్ కోరడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిజైన్ ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ చేసిన అధ్యయనంలో భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగరం, భద్రాద్రి విద్యుత్కేంద్రం, గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ అని, అది చేసిన బ్యాక్ వాటర్ సర్వేనే ప్రామాణికమని స్పష్టంచేశారు. బ్యాక్ వాటర్తో ముంపు ఉండదని సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేల్చిందని చెప్పారు. గోదావరికి గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్ట్ పార్టీతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరగా, ఆ స్థాయిలో గోదావరికి వరద వచ్చే అవకాశమే లేదని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది నీటిని నిల్వ చేయడం వల్ల శబరి, సీలేరు ద్వారా వరద ఎగదన్ని తమ ప్రాంతం ముంపునకు గురైందన్న ఒడిశా వాదనను పీపీఏ సీఈవో కొట్టిపారేశారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటినే నిల్వ చేయలేదని, అందువల్ల వరద ఎగదన్నిందని చెప్పడం సబబు కాదని అన్నారు. ఈ ఏడాది వరదలకు తమ రాష్ట్రాంలోనూ గిరిజన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చత్తీస్గఢ్ అధికారులు చెప్పగా.. ఇంద్రావతి వరదల వల్లే ఆ ప్రాంతం ముంపునకు గురైందని సీడబ్ల్యూసీ అధికారులు తేల్చిచెప్పారు. -
బ్యాక్ వాటర్ ముప్పు ఒట్టిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపు ముప్పు ఉంటుదన్నది ఒట్టి అపోహేనని ఆదిలోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐఐటీతో తెలంగాణ ప్రభుత్వం.. రూర్కీ ఐఐటీతో ఒడిశా సర్కార్ చేయించిన అధ్యయనాలలోనూ ఇదే అంశం స్పష్టమైంది. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టాక, ప్రాజెక్టులోకి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా వెనుక భాగంలో వరద నీటి మట్టం పది సెంటీమీటర్లు అంటే 1/3 అడుగు మేర మాత్రమే పెరుగుతుందని హైదరాబాద్ ఐఐటీ, రూర్కీ ఐఐటీ అధ్యయనాలలో వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్(ఏపీఈఆర్ఎల్), 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీకో సంస్థ చేసిన అధ్యయనాలలోనూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని స్పష్టమైంది. ఇదే అంశాన్ని ఈనెల 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో నిర్వహించే సమావేశంలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ఇసుమంత కూడా ఉండదనే అంశాన్ని ఈ సమావేశంలో మరో మారు స్పష్టం చేయాలని సీడబ్ల్యూసీ కూడా నిర్ణయించింది. పెద్దగా తేడా ఉండదు.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తోందని.. దీని వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒడిశా, ఛత్తీస్గడ్ సర్కార్లు వేర్వేరుగా ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్)లు దాఖలు చేశాయి. ► వీటిపై విచారించిన సుప్రీంకోర్టు 2011 ఏప్రిల్ 11న సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ అధికారులు, నిపుణులతో ముంపు ప్రభావాన్ని తేల్చడానికి కమిటీ వేసింది. ఈ కమిటీ 2011 మే 23, 24న పోలవరంలో పర్యటించి.. సమగ్రంగా అధ్యయనం చేసి, 2011 జూన్ 14న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని.. ఈ ప్రాజెక్టు కట్టినా, కట్టకపోయినా వెనుక జలాల్లో పెద్దగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ► పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణే అత్యంత కీలకమని.. సమర్థవంతంగా నిర్వహిస్తే ఎలాంటి ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ నిపుణులు తెగేసి చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్ విధానంలో గేట్ల నిర్వహణను చేపట్టిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు. ► గోదావరికి 50 లక్షలు, 40 లక్షలు, 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు కుంట, శబరి లాస్ట్ క్రాస్ వద్ద ఏ స్థాయిలో నీటి మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు కట్టాక కూడా అదే స్థాయిలో నీటి మట్టం ఉంటుందని ఐఐటీ–రూర్కీ తేల్చింది. ► పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 150 అడుగుల గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త సర్వే చేయాలి. ఇందుకు ఏపీ పలుమార్లు లేఖ రాసినా ఒడిశా స్పందించడం లేదు. ► శబరి, సీలేరులకు కరకట్టలు కట్టినా కట్టకున్నా పెద్దగా మార్పు ఏమీ ఉండదని సీకో అధ్యయనం తేల్చిచెప్పింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు లోబడే.. ► గోదావరిపై పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 150 అడుగుల (45.72 మీటర్లు) సామర్థ్యంతో నిర్మించుకోవడానికి ఆమోదం తెలుపుతూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ► ప్రాజెక్టులో 140 అడుగుల్లో (42.672 మీటర్లు) నీటి మట్టం ఉన్నప్పుడు గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించాలని పేర్కొంది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు వెనుక భాగాన ఎలాంటి ముంపు ప్రభావం ఉండకూడదనే లక్ష్యంతో ఆ మేరకు నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) డిజైన్లు ఆమోదించింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోంది. తద్వారా ఎగువ నుంచి భారీ వరద వచ్చినా బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలపై ఏమాత్రం పడదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశం ► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలు అన్నింటితో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని ఈనెల 6న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ఈనెల 29న కేంద్రం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులతోపాటు ఏవైనా రాష్ట్రాలతో సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ నేపథ్యంలో ఈనెల 29న నిర్వహించే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై వేర్వేరు అధ్యయనాలలో వెల్లడైన అంశాలను వివరించి ఆ రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
వరుణ.. కరుణ సుజలాం.. సుఫలాం
సాక్షి, అమరావతి: గోదావరి గలగలలు.. కృష్ణమ్మ బిరబిరలు.. పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈదఫా ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేసింది. నవంబర్లో తుపాన్లు వచ్చేలోగా ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి చేసి రెండో పంటకు నీటిని విడుదల చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలకుల దూరదృష్టికి వరుణుడు కలిసి రావడంతో గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్, గండికోట, చిత్రావతి, వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు జూన్ 10న, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్కు జూన్ 30న, సాగర్ కుడి, ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), ఎల్లెల్సీ(దిగువ కాలువ), వంశధార, తోటపల్లి సహా అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతన్నలు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి వాణిజ్య పంటలను భారీ ఎత్తున సాగుచేశారు. సాగర్, కుడి ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నారుమడులు పోస్తున్నారు. నెలాఖరుకు ఆయకట్టులో ఖరీఫ్ సాగు పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. మూడేళ్ల కంటే మిన్నగా.. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్సైడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద 7.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలో కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉరకలెత్తుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, సోమశిల లాంటి భారీ ప్రాజెక్టులన్నీ నిండాయి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 983.48 టీఎంసీలుకాగా ఇప్పటికే 812.47 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో పూర్తి సామర్థ్యం మేరకు రిజర్వాయర్లలో 560.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అక్టోబర్ ఆఖరు వరకు నదుల్లో వరద ప్రవాహం కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఏడాది అన్ని బేసిన్లలోనూ నీరు భారీగా పెరగనుంది. రెండో పంటకూ అవకాశం.. గతంలో గోదావరి డెల్టాలో మాత్రమే రెండో పంటకు నీటిని విడుదల చేసేవారు. గత మూడేళ్లుగా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపుతున్న ప్రభుత్వం నీటి లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నూర్పిళ్లు కూడా సకాలంలోనే పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటం, అక్టోబర్ వరకు వరద ప్రవాహం, ఆ తర్వాత సహజ ప్రవాహం నదుల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ ఏడాది నీటి లభ్యత గత మూడేళ్ల కంటే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో సాగు మంత్రివర్గ సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగానే నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా చర్యలు చేపట్టాం. ఈ దఫా రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలలో ఏటా కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్లోనే అధిక ఆయకట్టులో పంటలు సాగుచేసే అవకాశం ఉంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ -
27 రోజులు.. 2,192 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ఈ నెలలో కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 1861 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో గోదావరి జలాలు కడలి పాలవడం గమనార్హం. ఈ నెల ముగియడానికి మరో నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 75 చొప్పున నాలుగు రోజుల్లో మరో 300 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. అంటే.. జూలై ముగిసే నాటికి కనీసం 2,492.93 టీఎంసీలు సముద్రంలో కలవనున్నాయి. సాధారణంగా జూలైలో గోదావరికి భారీ వరదలు రావు. ఈ నెలలో సాధారణంగా 100 నుంచి 500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయి. ఇంతకంటే అధికంగా గోదావరి జలాలు కడలి పాలయ్యే అవకాశాలు తక్కువ. 2013 జూలైలో తొలి సారిగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అది కూడా జూలై ద్వితీయార్థంలో రావడంతో 2,033.86 టీఎంసీలు కడలి పాలయ్యాయి. ఇప్పటివరకూ అదే అత్యధిక రికార్డు. కానీ.. ఈ ఏడాది చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ద్వితీయార్థంలోనూ కొనసాగుతున్నాయి. కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీలు సముద్రంలో కలవడం ద్వారా 2013 జూలైలో సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత గోదావరి ఈ ఏడాది బద్దలు కొట్టడం గమనార్హం. మూడుసార్లు గరిష్ట ప్రవాహం వచ్చినా.. సాధారణంగా గోదావరి నదికి ఆగస్ట్ నెలలో మాత్రమే గరిష్ట ప్రవాహం వస్తుంటుంది. అందుకు భిన్నంగా.. గోదావరి చరిత్రలో 1861, 1988, 1989 సంవత్సరాల్లో జూలై నెలలో గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద ప్రవాహాలు వచ్చాయి. కానీ.. ఈ ఏడాది జూలై 16న ధవళేశ్వరం బ్యారేజీలో 26.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో జూలైలో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. 1861 నుంచి ఇప్పటివరకూ గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేశారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 6న అత్యధికంగా 28,05,773 క్యూసెక్కుల ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి రాగా.. గోదావరి చరిత్రలో ఇది రెండో అత్యధిక వరద ప్రవాహంగా నమోదైంది. వరద జలాల మళ్లింపునకు సర్కారు యత్నం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రం పాలవుతున్న ఈ నీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకుని.. రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించి వాటిని సుభిక్షం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లోకి పోసి.. సోమశిల (పెన్నా)కు తరలించేందుకు ప్రణాళిక రచించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) అనుసంధానం ద్వారా 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి ఎన్డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రణాళిక రచించింది. -
మళ్లీ గోదా‘వడి’!
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పాయతోపాటు.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవాహిస్తుండటంతో గోదావరిలో శనివారం వరద ఉధృతి పెరిగింది. తాలిపేరు ఉప్పొంగడంతో రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దాంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 44.50 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు 43 అడుగుల కంటే దిగువకు వరద మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఎగువన బేసిన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్లోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్లోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజ్లలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో 48 గంటలు బేసిన్లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. పోటెత్తిన శబరి భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న గోదావరి వరదకు శబరి ప్రవాహం తోడవడంతో పోలవరం వద్ద వరద ప్రవాహం 7,79,341 క్యూసెక్కులకు పెరిగింది. నీటి మట్టం 32.910 మీటర్లకు చేరుకుంది. దాంతో జల వనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ, వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాత్రి 9 గంటలకు నీటి మట్టం 12.30 అడుగులకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 5,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 10,48,887 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్ఎస్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్ఆర్ఎల్) నష్టం ఉండదని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొత్త వివాదాలు సృష్టించవద్దు ‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్ వాటర్ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు. భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా? భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు. వరదలపై ఈనాడు వక్రబుద్ధి గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు. అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్ను అధికారులు కంట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు. -
శాంతిస్తున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి, పాడేరు/సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం, ఏలూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరపివ్వడం.. ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతిస్తోంది. ఉప నదులు ఉప్పొంగడంతో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శించటాన్ని చూసి చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి వస్తున్న వరద ప్రవాహం 24,84,356 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి మట్టం 21.10 అడుగులకు పడిపోయింది. గోదావరి డెల్టాకు 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 24,74,856 క్యూసెక్కుల (213.87 టీఎంసీలు)ను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్లోకి వచ్చే వరద క్రమేణ తగ్గనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాల్లో వర్షాలు తెరపినిచ్చాయి. దాంతో ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరి తదితరాలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇది గోదావరిలో వరద తగ్గుముఖం పట్టేలా చేస్తోంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్లోకి వచ్చే వరద 9.28 లక్షల క్యూసెక్కులకు, దానికి దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్లోకి వచ్చే వరద 9.45 లక్షల క్యూసెక్కులకు, ఆ బ్యారేజ్కు దిగువన సీతమ్మసాగర్లోకి వస్తున్న వరద 16.68 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో తగ్గుతున్న వరద మట్టం ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు 17,58,166 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 59.40 అడుగులకు తగ్గింది. వరద మట్టం 53 అడుగులకు తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం వరద మట్టం 48 లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరుకుంటేనే ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకుంటారు. మంగళవారానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చే వరద గంట గంటకూ తగ్గుతోంది. అయినప్పటికీ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహ మూర్తి నేతృత్వంలో జల వనరుల శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోలవరంలోకి వచ్చే వరద ప్రవాహం 20,83,779 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 38.29 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 27.54 మీటర్లకు తగ్గింది. సోమవారం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 17 నుంచి 17.50 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. వరద గండం గట్టెక్కినట్లే ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెలపై కుంపటి దిగినట్టయ్యింది. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రానికి గోదావరి లంక గ్రామాలు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. వారం రోజులుగా వీడని వరద ముంపుతో లంక గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకుని వారికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపకదిన చర్యలు తీసుకుంది. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో బాధితులకు సహాయం అందజేసేందుకు వెళుతున్న పడవ గోదావరిలో అదుపు తప్పి తిరగబడింది. వీఆర్వో లక్ష్మితో పాటు వీఆర్ఏలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్లు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు మురళీధర్రెడ్డి, అరుణ్కుమార్లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు కొనసాగుతున్నాయి. బోట్లపై రాకపోకలు సాగించే వారికి సాయం చేస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద ఉధృతితో రాజమహేంద్రవరం రోడ్డు వంతెనలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 3, 5, 6, 9, 16 బెటాలియన్లకు చెందిన 10 బృందాల్లోని 356 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం వరద ముంపు జిల్లాల్లోని 950 మంది బాధితులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో పలువురు గర్భిణులు, వృద్ధులు ఉన్నారు. లంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీరు, కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరిలో ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరుపాడు మండలంలో పర్యటించారు. పోలవరం ముంపు మండలాల్లోని 61 గ్రామాల్లో 18,707 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రతిరోజు వెయ్యి మందికి తన సొంత నిధులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం పట్టణం, మండలంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వరద తీవ్రతను పరిశీలించారు. విలీన మండలాల్లో వరద నీరు కాస్త తగ్గడంతో అధికార యంత్రాంగం, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చింతూరు నుంచి ముంపు గ్రామాలకు లాంచీల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాను వేగవంతం చేశారు. అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నెల్లిపాక వీఆర్వో కట్టం వెంకటేశ్వర్లు, విస్సాపురం వీఆర్వో ముచ్చిక వీర్రాజులపై జేసీ సూరజ్ గనోరే చర్యలకు ఆదేశించారు. -
వరదలు తగ్గాక ముమ్మరంగా పనులు చేయడానికి సిద్ధం కావాలన్న సీఎం జగన్
-
జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వరద తగ్గాక పోలవరం పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి,అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. జల వనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ఆరా తీశారాయన. పోలవరం – ముందస్తు వరదలు. ► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తు వరదలపై సమగ్ర సమీక్ష. ► పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్–1, గ్యాప్–2లు పూడ్చే పనుల అంశంపై విస్తృత చర్చ. ► రెండు గ్యాప్లను పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమన్న అధికారులు. ► ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని సీఎం జగన్కు తెలిపిన అధికారులు. ► చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాపర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందని వివరణ. ► వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తిచేస్తామని సీఎం జగన్కు వివరించిన అధికారులు. ► మరోవైపు షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాపర్డ్యాం పనులకు కూడా.. ముందస్తు వరదల కారణంగా అంతరాయం. ► గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాపర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదన్న అధికారులు. ► వరదలు పూర్తిగా తగ్గితే... ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారుల అంచనా. ► ఈ పరిస్థితి రాగానే.. ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికార యంత్రాగానికి సీఎం జగన్ సూచన. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందని సీఎం జగన్, అధికారులతో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కాంపొనెంట్ వైజ్గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్గా డబ్బులు తెప్పించుకుంటే..., ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చని అధికారులకు ఆయన సూచించారు. వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారాయన. ఈమేరకు అడహాక్గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలని, కేంద్రానికి లేఖలు కూడా రాయాలని సీఎం జగన్ తెలిపారు. పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచన. ఆగష్టులో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం ► ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ► బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, అది కూడా త్వరలో చేరుకుంటుందని వెల్లడించారు. ► అలాగే.. దసరా నాటికి టన్నెల్–2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ – 2పనులపైనా సీఎం సమీక్ష ► ఏప్రిల్లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్న అధికారులు. ► నెలవారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని సీఎం జగన్ స్పష్టీకరణ. ► వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్న అధికారులు. ► అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలంకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి,రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు, వీటితోపాటు చింతలపూడి, వైయస్సార్ పల్నాడు, మడకశిర బైపాస్ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాలను సీఎం జగన్ నిర్దేశించారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్ దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉంది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఇదే. దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి కార్యాచరణ సిద్ధంచేయాలి. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలి. దీనివల్ల ప్రజలకు వ్యాపకం దొరుకుతుంది, వలసలను నివారించగలుగుతాం. ఐటీఐ, పాలిటెట్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలు తదితర విద్యాసంస్థల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధంచేయాలి. ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జల వనరులపై చేపట్టిన సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఈఎన్సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..! -
పోలవరంపై కీలక సమావేశం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం బృందం శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆదివారం మరోసారి తనిఖీ చేస్తుంది. అనంతరం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ప్రాజెక్టు డిజైన్లు, పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులపై వెదిరె శ్రీరాం కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై ఈనెల 17న వెదిరె శ్రీరాం, నిధుల మంజూరుపై 18న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశాలను కేంద్రం నిర్వహించింది. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలించి.. వాటిని యథాస్థితికి తేవడానికి చేయాల్సిన పనులకు అయ్యే వ్యయం, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అయ్యే వ్యయంపై నివేదిక ఇవ్వాలని వెదిరె శ్రీరాంకు ఆ శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ సూచించారు. దాంతో శనివారం వెదిరె శ్రీరాం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తదితరులతో కూడిన బృందం పోలవరానికి వచ్చింది. వారు దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనులను పరిశీలించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం, డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ సూచనల మేరకు ఇసుక నాణ్యతతోపాటు 11 రకాల పరీక్షలు చేయించి.. జూలై 15లోగా నివేదిక ఇస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు వెదిరె శ్రీరాంకు వివరించారు. ఆ తర్వాత స్పిల్ వే, స్పిల్ చానల్, స్పిల్ వే గైడ్ బండ్ పనులను పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు పనులను మరోసారి పరిశీలించి.. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
వలసల నివారణకు వాటిని త్వరగా పూర్తి చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జలవనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా.. అధికారులు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సీఎం జగన్కు నివేదించారు. పోలవరంపై.. ► పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా పనులు సాగుతున్నాయని సీఎం జగన్కు వివరించారు అధికారులు. ► ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయ్యాయి. ► దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికోసం 76 శాతం జియో బ్యాగులతో ఇప్పటికే నింపామన్న అధికారులు. ► దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యిందని, ఈనెలాఖరు నాటికి డిజైన్లపై స్పష్టత వస్తుందని తెలిపారు. ► పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రీయంబర్స్ చేయాల్సిన డబ్బు రూ. 2,559.37 కోట్లు. ► వీలైనంత త్వరగా డబ్బును తెప్పించుకునే ప్రయత్నాలు చేయాలన్న సీఎం. ► పీపీఏ అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రతి పనీ జరుగుతుందని తెలిపారు. ► పనులు వేగంగా పూర్తిచేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తన డబ్బు ఖర్చు చేస్తోంది. ► చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రీయంబర్స్ జరిగేలా చూడాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశంలో రీయంబర్స్ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతి ► నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్కు తెలియజేశారు. ► అవుకు టన్నెల్ పనులపైనా సమీక్ష జరగగా.. పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించిన అధికారులు ► 2014–19 మధ్య గత ప్రభుత్వ హయాంలో టన్నెల్ –1 కు సంబంధించి కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పనిమాత్రమే గత ప్రభుత్వ హయాంలో సాగింది. ► 2019 – 2022 వరకు కేవలం మూడేళ్ల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన పని 2.8 కిలోమీటర్లు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్ పనులు జరిగాయి. ► టన్నెల్ –2 కు సంబంధించి 2014–2019 మధ్యలో రోజుకు 1.31 మీటర్ల పని జరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 2019–22 మధ్య కాలంలో రోజుకు 2.46 మీటర్లు పని జరిగింది. ► ప్రస్తుతం వెలిగొండలో నెలకు 500 మీటర్లపైన పని జరుగుతోంది. ► సెప్టెంబరులో టన్నెల్–1 ద్వారా నీటి విడుదలకు అధికారుల ధీమా. ► టన్నెల్–1 ద్వారా నీటిని పంపిస్తున్న సందర్భంలోనే టన్నెల్–2లోనూ కొనసాగనున్న పనులు. జూన్, 2023 నాటికి టన్నెల్ –2 పనులు పూర్తి. ► ఈలోగా పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపైనా సమీక్ష ► వంశధార నిర్వాసితుల కోసం అదనపు ఎక్స్ గ్రేషియా పైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ► దాదాపు రూ.226.71 కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చిస్తోంది ప్రభుత్వం. ► నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ఈ చెల్లింపులు చేస్తున్నామని సీఎం జగన్.. వెల్లడించారు. ► నిధులు మంజూరుచేస్తూ మార్చిలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయన్న అధికారులు. ► గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ పెట్టి.. దానిద్వారా హీరమండలం రిజర్వాయర్ నింపే ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్. దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ► నేరడి బ్యారేజీ నిర్మాణం అంశంపైనా కూడా దృష్టిపెట్టాలని ఆదేశాలు. ► గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. రాయలసీమ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష ► తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఉన్న కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. ► నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని.. వాటిని నివారించాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని.. తద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో వలసలు నివారించడానికి ఈ ప్రాజెక్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ► చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని సీఎం జగన్ ఆదేశం. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం జగన్.. ఆయా ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్ కెనాల్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్ –2 (కోడూరు వరకు), జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిప్ట్ ఇరిగేషన్ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిప్ట్ స్కీం, ఎర్రబాలి లిప్ట్ ఇరిగేషన్ స్కీం నుంచి యూసీఐఎల్ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు(కుందూ నది), రాజోలి బండ డైవర్షన్ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిప్ట్ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలవరం ప్రాజెక్ట్ సవాళ్లను ఎదుర్కొనే కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధించిన కసరత్తును ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్, ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని 8 మంది నిపుణుల బృందం పూర్తి చేసింది. గోదావరి వరదల ఉధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్, వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని నిపుణుల బృందం రూపొందించింది. డయా ఫ్రమ్ వాల్ పరిస్థితిని అంచనా వేసి.. దాని పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. బావర్ సంస్థ ఇచ్చే నివేదిక, గోతులను పూడ్చే విధానంపై డీడీఆర్పీకి పోలవరం సీఈ సుధాకర్బాబు పంపనున్నారు. సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని వారంలోగా డీడీఆర్పీ ఖరారు చేస్తుంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ సూచనల మేరకు ప్రొఫెసర్ రాజు నేతృత్వంలోని బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్లలో ఇసుకను నింపి పూడ్చే పనులు పరిశీలించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పరిశీలించింది. శనివారం పోలవరంలో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం సమావేశమైంది. రెండు కాఫర్ డ్యామ్ల మధ్యన నీటిని తోడకుండానే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్ చేస్తూ.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని రూపొందించింది. ప్రధాన డ్యామ్ డయా ఫ్రమ్ వాల్ పటిష్టతపై అధ్యయనం చేసే బాధ్యతను బావర్కు అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత డయాఫ్రమ్ వాల్తో అనుసంధానం చేయాలా లేదంటే ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలా అన్న అంశాన్ని డీడీఆర్పీకి నివేదిస్తారు. డీడీఆర్పీ ఖరారు చేసే విధానాన్ని సీడబ్ల్యూసీకి పంపి.. అది ఆమోదించిన విధానం ప్రకారం ఆ పనులు చేపడతారు. -
పోలవరం సహా ప్రాధ్యాన్య ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష
-
త్వరలో ‘అపెక్స్’ భేటీ!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమావేశం అజెండాను రూపొందించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లను కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆదేశించారు. గతేడాది జూలై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును అజెండాలో ప్రధానంగా చేర్చాలని సూచించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్ల సమర్పణ, మదింపు అంశాన్నీ పొందుపరచాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సూచించిన మేరకు మిగతా అంశాలను అజెండాలో చేర్చి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో చర్చించి అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లతో చర్చించి వారు అందుబాటులో ఉండే రోజు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని షెకావత్ నిర్వహించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించింది. రెండో భేటీ 2020 అక్టోబర్ 6న జరిగింది. మూడో భేటీని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యేలోగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. -
Polavaram Project: పోలవరం పనులు భేష్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై కేంద్ర జల్ శక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. జల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్, సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఈ కమిటీ మంగళవారం పోలవరం ఎడమ కాలువను పరిశీలించింది. బుధవారం ప్రాజెక్టు స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, అనుసంధానాల పనులు, జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు, గ్యాప్–1లను, పునరావాస కాలనీలను తనిఖీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. వివరాలను ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ, సహాయ పునరావాస విభాగం అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగవంతం చేయాలని కమిటీ ఆదేశించింది. పనుల వివరాలను మ్యాప్ ద్వారా తెలుసుకుంటున్న కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ జాయింట్ కమిషనర్ అనూప్కుమార్ శ్రీవాత్సవ 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఈ వ్యయాన్ని సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 2019లోనే ఆమోదించిందని వివరించారు. ఆ తర్వాత రివైజ్ట్ కాస్ట్ కమిటీ రూ.47,727.87 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించిందన్నారు. సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని చెప్పారు. దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి కూడా నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఒకటిగానే లెక్కించి, నిధులివ్వాలని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై గోయల్ సానుకూలంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నివేదికను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి మరోమారు తీసుకెళ్తామని అన్నారు. పెట్టుబడి అనుమతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు. డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను మే నాటికి, ఎగువ కాఫర్ డ్యామ్ను జూన్ మొదటి వారానికే పూర్తి చేసి.. జూన్ 11న అప్రోచ్ చానల్ మీదుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. 2018లో పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మించే ప్రదేశంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం, ఇసుక పొరలను పటిష్టం చేసే డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనుల ప్రారంభం ఆలస్యమవుతోందన్నారు. ఈనెల 7న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య వస్తున్నారని, అప్పుడు ఈ డిజైన్ను కొలిక్కి తెస్తామని, దాన్ని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వెంటనే ఆమోదించేలా చూడాలని కోరారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. పెండింగ్లో ఉన్న డిజైన్లను వేగంగా ఆమోదించాలని సీడబ్ల్యూసీకి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. డిజైన్ ఆమోదం అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీల సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) రూపకల్పన తుదిదశలో ఉందని, అవి పూర్తికాగానే టెండర్లు పిలిచి.. వాటి పనులను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. కమిటీ సభ్యులు గురువారం ఉదయం పోలవరం కుడి కాలువ పనులను తనిఖీ చేస్తారు. శుక్రవారం విజయవాడలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై కృష్ణా బోర్డు అధ్యయనం
సాక్షి, అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టును తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించిన కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వర్కింగ్ ప్రోటోకాల్ను ఖరారు చేయడంపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే నేతృత్వంలో సీఈలు రవికుమార్ పిళ్లై, శివరాజన్లతో కూడిన సమన్వయ కమిటీ సోమవారం కర్నూలు జిల్లాలోని హంద్రీ–నీవా (మల్యాల పంప్హౌస్), ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించింది. ఆ తర్వాత తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించింది. అక్కడి నుంచి ఎస్సార్బీసీ కాలువ మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు చేరుకుంది. అక్కడి నుంచి వెనక్కి వచ్చే సమయంలో ఎస్సార్బీసీ 12వ కి.మీ. వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ మీటర్లను పరిశీలించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఎస్సార్బీసీ ఏర్పాటు చేసిన టెలీమీటర్ ద్వారా ప్రతి చుక్క నీటిని లెక్కించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డి సమన్వయ కమిటీకి వివరించారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ శ్రీశైలానికి బయలుదేరింది. సమన్వయ కమిటీ వెంట ఏపీ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ కేఏ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
తెలంగాణ డీపీఆర్లను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడానికి చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పిస్తూ తెలంగాణ సర్కార్ పేర్కొన్న నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని స్పష్టంచేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా జలాలను కొత్త ట్రిబ్యునల్ పంపిణీ చేసే వరకూ తెలంగాణ డీపీఆర్లను ఆమోదించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేంద్ర జల్శక్తి శాఖ, గోదావరి బోర్డులకు లేఖ రాసింది. అలాగే, గత నెల 30న సీతారామ ఎత్తిపోతల పథకం తొలిదశ డీపీఆర్పై కూడా అభ్యంతరం వ్యక్తంచేస్తూ లేఖ రాసింది. మిగతా ఐదింటిపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్శక్తి శాఖకు, గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏదీ? ► మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఉన్నాయి. తెలంగాణకు ఎగువనున్న రాష్ట్రాల నుంచే 11 ఉప నదులు ప్రవహించి గోదావరిలో కలుస్తున్నాయి. ఒక్క శబరి మాత్రమే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది. ఇక భౌగోళికంగా ఏపీకి ఎగువనున్న తెలంగాణ ఏడాది పొడవునా గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉంది. ► 2016, జనవరి 21న జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా కొత్త ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారే కోరింది. ► అనంతరం.. అదే ఏడాది నవంబర్ 16న జరిగిన బోర్డు నాలుగో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఏపీ వాటా 775.9.. తెలంగాణ వాటా 649.8 టీఎంసీలు. ఇక 2004లో వ్యాప్కోస్ చేసిన అధ్యయనం ప్రకారం 2 రాష్ట్రాల పరిధిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ► రెండు రాష్ట్రాలు కలిపి ఇప్పటికే 1425.7 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నీటి లభ్యతలేదు. మిగులు జలాలు ఏపీవే.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. జీ–1 నుంచి జీ–11 సబ్ బేసిన్ల వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలతోపాటూ మిగులు జలాలు ఏపీకే దక్కుతాయి. ► గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ 320 టీఎంసీలు.. తెలంగాణ 450.3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు చేపట్టాయి. దీంతో ఏపీ ప్రాజెక్టులకు 1,095.9, తెలంగాణ ప్రాజెక్టులకు 1,100.1 టీఎంసీలు కలిపి మొత్తం 2,196 టీఎంసీల అవసరం ఉంది. కానీ, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కొత్తవే. వీటితోపాటూ కాళేశ్వరం సామర్థ్యాన్ని అదనంగా 225 టీఎంసీలకు.. సీతారామ సామర్థ్యాన్ని మరో 30 టీఎంసీలకు పెంచే ప్రాజెక్టులూ కొత్తవే. ► కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతలపై 2018లోనే అభ్యంతరాలు వ్యక్తంచేశాం. కానీ, సీడబ్ల్యూసీలో కొన్ని విభాగాలు అనుమతులిచ్చాయి. వాటిని తక్షణమే పునఃసమీక్షించాలి. ► ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా ఆయకట్టు దెబ్బతింటాయని.. వాటిని అడ్డుకుని దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని 2020, జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు తొమ్మిదో భేటీలో కోరాం. ► 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో 2 రాష్ట్రాలకు గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని ఆదేశించారు. ► ఏపీ హక్కులను దెబ్బతీసేలా.. అనుమతిలేకుండా తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని షెకావత్కు అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ లేఖ ఇచ్చారు. ట్రిబ్యునల్కు విరుద్ధంగా నీటి మళ్లింపు ► గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మళ్లిస్తోంది. జీ–10 సబ్ బేసిన్లో ఎగువనున్న ప్రాజెక్టుల వినియోగానికి 301.34 టీఎంసీలను మినహాయించుకుని.. పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టి అనుమతిచ్చింది. ► దీంతో జీ–10 సబ్ బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు కేటాయించిన 20 టీఎంసీలుపోనూ.. మిగిలిన 281.34 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంటుంది. ► ఇక ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లించకూడదని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ అవార్డును పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సమర్పించిన డీపీఆర్లను ఆమోదించవద్దు. తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులు ఇవే.. ► పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి (తుపాలకులగూడెం బ్యారేజీ) ► సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ► ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం ూ చనాకా–కొరటా బ్యారేజీ ► చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం ూ మొడికుంట వాగు ప్రాజెక్టు కేంద్రం, గోదావరి బోర్డుకు వాస్తవాలను చెప్పాం గోదావరి జలాల వినియోగంలో వాస్తవాలను కేంద్రానికి, గోదావరి బోర్డుకు వివరించాం. తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టింది. వీటి డీపీఆర్లను పరిశీలించవద్దని.. ఆమోదించవద్దని కోరాం. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కూ లేఖ రాశాం. తెలంగాణ డీపీఆర్లన్నింటినీ అధ్యయనం చేసి.. వాటిపైనా లేఖలు రాస్తాం. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరుతాం. – జె. శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ -
Irrigation Projects: పనుల్లో వేగం పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం, వెలిగొండ, వంశధార ఫేజ్–2, స్టేజ్–2తో పాటు అన్ని ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్పిల్ వేను పూర్తి చేసి.. గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశామని చెప్పారు. దిగువ కాఫర్ డ్యాం పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ పనులను పూర్తి చేశామని.. దిగువ కాఫర్ డ్యామ్ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి.. ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించి.. గడువులోగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించామని వివరించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పోలవరం కాలువల ద్వారా నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,033 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు ►కేంద్రంతో చర్చించి పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ఎప్పటికప్పుడు రీయింబర్స్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో సమన్వయం చేసుకుని.. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడటం ద్వారా గడువులోగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. ►పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ ఒక్క నిర్వాసితుడికి ఇబ్బంది లేకుండా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా పునరావాసం కల్పించాలి. నవంబర్లో నెల్లూరు బ్యారేజీ పూర్తి ►పెన్నా నదిపై నెల్లూరు బ్యారేజీని నవంబర్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి. ఆలోగా సంగం బ్యారేజీని కూడా పూర్తి చేయాలి. తద్వారా పెన్నా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలి. ►గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఆగస్టు నాటికి టన్నెల్ పూర్తి చేసి.. గాలేరు–నగరి వరద కాలువకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ►వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనుల్లో మరింత వేగం పెంచాలి. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ►వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనులను మే నాటికి పూర్తి చేసి, ప్రాజెక్టును రైతులకు అందుబాటులోకి తేవాలి. నేరడి బ్యారేజీపై ఒడిశాతో సంప్రదింపులు ►నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలి. ►తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్లో çపూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించేందుకు సంబంధించిన పనులను తక్షణమే పూర్తి చేయాలి. ►మహేంద్ర తనయ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని.. శరవేగంగా పూర్తి చేయాలి. ►గులాబ్ తుపాను, అనంతరం వర్షాల వల్ల సాగునీటి కాలువలు దెబ్బతిని ఉంటే.. వాటికి సత్వరమే మరమ్మతులు చేయాలి. ఏలేరు–తాండవ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి ►కొల్లేరు సరస్సును పరిరక్షించేందుకు గోదావరి, కృష్ణా డెల్టాల్లో చేపట్టిన రెగ్యులేటర్ల పనులను ప్రాధాన్యంగా తీసుకుని.. వేగంగా పూర్తి చేయాలి. ►తాండవ–ఏలేరు అనుసంధానం పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులు వేగంగా జరిగేలా చూడాలి. ►కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన 2 బ్యారేజీలు, ఎగువన మరో బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలి. ►ఈ సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విరిగిన పులిచింతల గేటు
సాక్షి, అమరావతి బ్యూరో, సాక్షి, అమరావతి, అచ్చంపేట, జగ్గయ్యపేట : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా డ్యాంలో నీటి నిల్వను తగ్గించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్ చేరింది. ఈ దృష్ట్యా అధికారులు, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 16వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్లో నీటి నిల్వను తగ్గిస్తున్నారు. దీంతో నీటి విడుదల క్రమంగా 6 లక్షల క్యూసెక్కుల వరకు పెరగనుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులో 34.68 టీఎంసీలు నిల్వ ఉండగా, సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 16వ నంబరు గేటు నుంచి పూర్తి స్థాయిలో, మిగతా గేట్ల నుంచి.. మొత్తంగా 5,05,870 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు తగ్గితేగాని మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. మరమ్మతులకు మార్గం సుగమం సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో క్రస్ట్ లెవల్ (గేటు బిగించే మట్టం) 36.34 మీటర్లకు నీటి నిల్వను తగ్గిస్తేనే.. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చు. శుక్రవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 36.34 మీటర్లకు తగ్గుతుంది. అదే రోజు స్పిల్ వే 16, 17వ పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) మధ్య స్టాప్ లాగ్ గేటును దించి.. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి గేటును బిగిస్తామని చెప్పారు. ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతోనే.. నాగార్జునసాగర్ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 55,028 క్యూసెక్కులను విడుదల చేసిన తెలంగాణ అధికారులు.. దిగువకు వదిలే ప్రవాహాన్ని రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీలు నిల్వ ఉండటం... ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్పిల్ వే గేట్లను సంప్రదాయ పద్ధతి(రోప్)లో ఎత్తుతారు. ఒక్కో గేటును ఎత్తేందుకు ఒక్కో వైపు రెండు చొప్పున, నాలుగు రోప్(ఇనుప తీగ)లను అమర్చారు. 16వ గేటును రెండు అడుగుల మేర ఎత్తగానే ఎడమ వైపున ఉన్న ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతో గేటు ఊడిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. నిపుణుల కమిటీ వేస్తాం.. ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయన కమిటీ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఊడిపోయిన గేటును రేపు (శనివారం) సాయంత్రానికి పునరుద్ధరిస్తామని తెలిపారు. మూడు నాలుగు రోజులుగా ఈ గేటు ద్వారానే ప్రాజెక్టు దిగువకు లక్ష నుంచి రెండు లక్షల నీటిని విడుదల చేశారని, తెల్లవారు జామున నీటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గేటు ఊడినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని గేట్ల ద్వారా 5,05,870 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నామని చెప్పారు. గేట్ అమర్చేందుకు పోలవరం నుంచి ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కూడా వస్తున్నారన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు. -
'పోలవరం' పునరావాసం భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రీతిలో పునరావాసం కల్పిస్తోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ ఝా ప్రశంసించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నారని అభినందించారు. గోదావరి వరదలవల్ల గిరిజనులు ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు సహాయ పునరావాస (ఆర్అండ్ ఆర్) ప్యాకేజీ కింద పునరావాసం కల్పించడాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ‘మానిటరింగ్ కమిటీ’ని కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ గురువారం అనిల్కుమార్ ఝా అధ్యక్షతన వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎన్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు, పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఆనంద్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసేలా పనులను వేగవంతం చేశామని శ్యామలరావు చెప్పారు. నిర్వాసితులకు వేగంగా ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులను వర్చువల్ విధానంలో చూపించారు. వీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారన్నారు. వాటిని పరిశీలించిన ఝా సంతృప్తి వ్యక్తంచేశారు. ఇళ్లను వేగంగా, నాణ్యంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఈ సీజన్లో వరదలవల్ల నిర్వాసితులు, గిరిజనులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో పునరావాస కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. వారి జీవనోపాధులను మెరుగుపర్చడంపై కూడా దృష్టి పెట్టాలని ఝా సూచించగా.. శ్యామలరావు స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. -
ఆ 37 ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను వినియోగిస్తూ నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన మొత్తం 37 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పెషల్ సీఎస్కు లేఖ రాసింది. డీపీఆర్లు సమర్పించాలని ఇప్పటికే కోరినా రాష్ట్రం ఇంతవరకు స్పందించలేదని గుర్తు చేసింది. బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని గతంలో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేసింది. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు వేర్వేరు లేఖల్లో బోర్డును కోరింది. ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తోందని ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు చేసిన ప్రాజెక్టుల్లో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అలాగే కొత్తగా చేపడతామని ప్రకటించిన జోగుళాంబ బ్యారేజీ, భీమాపై వరద కాల్వ, కల్వకుర్తి పరిధిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, పులిచింతల పరిధిలో ఎత్తిపోతలు, సాగర్ టెయిల్పాండ్లో ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో 13 ఎత్తిపోతల పథకాలను చేపట్టేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా ఏపీ తెలిపింది. ఏపీ లేఖల నేపథ్యంలో స్పందించిన బోర్డు తాజాగా తెలంగాణకు లేఖ రాసింది. కాగా, శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ ఏపీ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం తెలియజేయాలని, మరో లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. -
నేను కల్కి అవతారాన్ని, నా గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వండి లేదంటే..
అహ్మదాబాద్: ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన గ్రాట్యూటీ కోసం సరికొత్తగా బెదిరించాడు ఓ మాజీ ఉద్యోగి. ఈ విచిత్ర ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జలవనరుల శాఖ మాజీ ఇంజినీర్ రమేశ్చంద్ర ఫెఫార్ ఇట తన గ్రాట్యూటీని విడుదల చేయాలని బెదిరిస్తూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో.. తనను తాను విష్ణువు కల్కి అవతారంగా చెప్పుకున్నాడు. అదే క్రమంలో తన జీతం, గ్రాట్యుటీ ఇంకా రాలేదని ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వంలో కూర్చున్న రాక్షసులు తన రూ.16 లక్షల గ్రాట్యుటీ, ఒక సంవత్సరం జీతం రూ.16 లక్షలను ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని ఆయన రాశారు. వెంటనే వీటిని విడుదల చేయకపోతే ఈ సంవత్సరం తన "దైవిక శక్తులతో" భూమిపై తీవ్రమైన కరువును సృష్టిస్తానని ఆ లేఖలో బెదిరించాడు. కాగా ఫెఫార్ చాలాకాలం విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వం ఆయనకు ముందస్తు పదవీ విరమణ ఇచ్చింది. 8 నెలల్లో 16 రోజులే ఆఫీసుకు రావడంపై ప్రశ్నిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. కాగా తన బెదిరింపులపై స్పందించిన జల వనరుల శాఖ కార్యదర్శి ఎం కె జాదవ్ మాట్లాడుతూ.. అతని గ్రాట్యుటీ ప్రక్రియలో ఉందంటూ చెప్పారు. -
పోలవరం పనులపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ప్రకారమే పూర్తిచేసిందని కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ప్రశంసించారు. గోదావరికి వరద వచ్చేలోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను సురక్షిత స్థాయికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూలైలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే సీజన్లో పనులను పూర్తిచేయడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీచేస్తామని చెప్పారు. తాజా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ప్రకారం పోలవరానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపుతామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ వర్చువల్ విధానంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ హెచ్.కె.హల్దార్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. 41.10 శాతం పూర్తి పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) పనులు 73.65 శాతం, కుడి కాలువ పనులు 91.69, ఎడమ కాలువ పనులు 70.10 శాతం.. వెరసి ప్రాజెక్టు పనులు 76.29 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు వివరించారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులు 20.19 శాతం పూర్తయ్యాయని.. మొత్తం కలిపితే 41.10 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. దీనిపై కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ స్పందిస్తూ.. స్పిల్ వే పనులను సకాలం లో పూర్తిచేశారని ప్రశంసించారు. ఎగువ కాఫర్ డ్యామ్ను జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తిచేస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పా రు. వీలైనంత తొందరగా సమగ్ర ప్రాజెక్టు నివేదక (డీపీఆర్) రూపొందించి టెండర్లు పిలుస్తామని వివరించారు. పునరావాస పనులు వేగవంతం వరద వచ్చేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని కుటుంబాలకు పునరావాసం కల్పిం చే పనులను వేగవంతం చేశామని సహాయ, పునరావాస విభాగం కమిషనర్ ఒ.ఆనంద్ తెలిపారు. దీనిపై పంకజ్కుమార్ స్పందిస్తూ జూలైలోగా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలని పంకజ్కుమార్ ఆదేశించారు. ఈ సీజన్లో చేయగా మిగిలిన పనులను వచ్చే సీజన్లో పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో 2017– 18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) సవరించిందని, రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) రూ.47,725.74 కోట్లకు ఆమోదించిందని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులిస్తే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉం టుందన్నారు. దీనిపై పంకజ్కుమార్ సానుకూలంగా స్పందించారు.కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి ఇస్తామని చెప్పారు. 2010–11 ధరల ప్రకారం పోలవరానికి కేంద్ర కేబినెట్ నిధులు మంజూరు చేసిందన్నారు. 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్కు ప్రతిపాదనలు పంపుతామని, ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. -
నేడు పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొంటారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో, వచ్చే సీజన్లో చేపట్టాల్సిన పనులు, గడవులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సమీక్షలో కోరనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో బకాయిపడిన రూ.1,600 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. నిర్వాసితులకు పురావాసం కల్పించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించనున్నారు. -
జల వనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
జల వనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవుకు సొరంగం పనులు కొలిక్కి..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్ శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్ జోన్ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్ ఫిల్లింగ్’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్ నుంచి నిపుణులను రప్పించారు. -
ప్రణాళిక ప్రకారమే పోలవరం
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్వర్క్స్ (జలాశయం), పునరావాసం, భూసేకరణ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని జలవనరుల శాఖకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) దిశానిర్దేశం చేసింది. ప్రణాళిక మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన పీపీఏ.. నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులను మరింత వేగవంతం చేయాలని సూచించింది. బుధవారం విజయవాడలోని జలవనరులశాఖ క్యాంపు కార్యాలయంలో సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన పీపీఏ సమావేశమైంది. రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ బాబురావు నాయుడు, పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన, పూర్తి చేయాల్సిన పనులపై పీపీఏ సమీక్షించింది. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మే నాటికి స్పిల్ వే పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. కాఫర్ డ్యామ్ల ఖాళీ ప్రదేశాలను మేలో భర్తీ చేసి ఎగువ కాఫర్ డ్యామ్ను 42.5 మీటర్ల ఎత్తు వరకూ పూర్తి చేస్తామని చెప్పారు. జూన్లో గోదావరికి వచ్చే వరదను స్పిల్వే మీదుగా మళ్లించి కాఫర్ డ్యామ్ల మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్)ను నిర్విఘ్నంగా చేపట్టి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆలోగా కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులు పూర్తి చేస్తామన్నారు. 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే పనులు పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ డిజైన్ల ఆమోదంపై దృష్టి... హెడ్ వర్క్స్ పనులు ప్రణాళిక మేరకు చేస్తున్నారని పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డిజైన్లను ఫిబ్రవరిలోగా సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎగువ కాఫర్ డ్యామ్ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ దాకా నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ కాంటూర్ వరకూ ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని మేలోగా పూర్తి చేయాలని అప్పుడే కాఫర్ డ్యామ్లను ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 17,760 కుటుంబాలకు పునరావాసం కలి్పంచాల్సి ఉందని, ఇందులో 11 వేల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. మిగతా 6,760 ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పునరావాసం పనులను సమన్వయం చేసుకుంటూ కాఫర్ డ్యామ్ల ఖాళీలను భర్తీ చేసి 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వివరించడంతో పీపీఏ సీఈవో అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
2022లో పోలవరం ఆయకట్టుకు సాగునీరు
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలి. పోలవరంలో తొలి ఏడాదే 41.15 మీటర్లలో 120 టీఎంసీల దాకా నిల్వ చేసే సామర్థ్యం వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆ తర్వాత దశలవారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టం(ఎఫ్ఆర్ఎల్) 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తాం. ప్రాజెక్టు ఎత్తును ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించడం లేదు. – పోలవరం వద్ద సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రూ.3,330 కోట్లతో వచ్చే మార్చి నాటికి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాస కల్పన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ 10.25 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనుల పురోగతిపై తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనుల పురోగతిని నిశితంగా గమనించారు. తరువాత ప్రాజెక్టు వద్దే జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ, సహాయ, పునరావాస విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మే చివరికి స్పిల్ వే, స్పిల్ చానల్ పూర్తి.. జూన్ నుంచి గోదావరిలో వరద ప్రారంభమవుతుందని, ఆలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ఎక్కడ జాప్యం జరిగినా మళ్లీ ఒక సీజన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు సూచించారు. వచ్చే మే నెలాఖరు నాటికి స్పిల్వే, స్పిల్ చానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. సమాంతరంగా జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు.. మే ఆఖరు నాటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని, ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడం ద్వారా వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. జలాశయం పనులకు సమాంతరంగా జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడంతోపాటు అదే వేగంతో నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్) పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ నిర్దేశించారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు జలాశయాల నిర్మాణం పూర్తయినా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయామని గుర్తు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా గతంలో ఏ రోజూ 3 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్అండ్ఆర్ను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చిత్రావతి ఆర్అండ్ఆర్కు రూ.240 కోట్లు ఇచ్చి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పది టీఎంసీలను నిల్వ చేసిందని తెలిపారు. గండికోటలో 20, కండలేరులో 60 టీఎంసీలు నిల్వ చేశామని వివరించారు. గోదావరి డెల్టాకు సమృద్ధిగా సాగునీరు.. పోలవరం కాఫర్ డ్యామ్లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసే సమయంలో గోదావరి డెల్టా రైతులకు సాగు, తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళికను ప్రజాప్రతినిధులకు తెలియజేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు. పోలవరం నిర్మాణంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కమిటీలో జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కేంద్రానికి ఎప్పటికప్పుడు బిల్లులు.. పోలవరం బిల్లులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తద్వారా రీయింబర్స్మెంట్ నిధులను వేగంగా రాబట్టవచ్చన్నారు. 2018 బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని సీఎం ప్రస్తావించారు. రీయింబర్స్మెంట్ కాకుండా పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న నేపథ్యంలో కొంత మేర నిధులను అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పీపీఏ అధికారులకు సీఎం సూచించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డ్యామ్ ఎత్తుపై విపక్షాల దుష్ప్రచారం.. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. డ్యామ్ ఎత్తును ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించడం లేదని స్పష్టం చేశారు. డ్యామ్ డిజైన్ ప్రకారం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు ఉంటుందని తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడ జలాశయాలను నిర్మించినా మొదట ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయరన్నారు. అయినప్పటికీ పోలవరంలో 41.5 మీటర్లలో తొలి దశలోనే 120 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేసే సామర్థ్యం వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు మార్చి నాటికి ఆర్అండ్ఆర్ పూర్తి చేసేందుకు రూ.3,330 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ, జలాశయంలో నీటి నిల్వను పెంచుకుటూ 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తామని వివరించారు. పోలవరం డ్యామ్ ఎత్తుపై లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడం లేదని పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి సమీక్షలో పలుమార్లు స్పష్టం చేశారు. -
జల సిరులు.. కొత్త రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులు గరిష్ట నీటి నిల్వలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ని్రష్కమించాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు మండలాలు, ప్రకాశం జిల్లాలపై మాత్రమే ఉంటుంది. అంటే, వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నట్టు లెక్క. ఈ దశలో రాష్ట్రంలోని చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో 439.361 టీఎంసీలకుగాను 378.738 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో జలాశయాల్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉండటం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో 527.86 టీఎంసీలకుగాను 514.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నవంబర్ మూడో వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉండటం కూడా ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రైతుల ప్రయోజనాలే పరమావధి ► నీటి సంవత్సరం ప్రారంభంలోనే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో వరద జలాలను ఒడిసిపట్టి.. ప్రాజెక్టులను నింపడం ద్వారా ఖరీఫ్, రబీల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ► గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఆయా ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులను విడుదల చేశారు. ► దాంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీలను ఇప్పుడు నిల్వ చేశారు. గత ఏడాది ఈ సమయానికి 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ► సోమశిల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో 77 టీఎంసీల నీరు నిల్వ చేశారు. కండలేరు రిజర్వాయర్లో చరిత్రలో తొలిసారిగా 68.03 టీఎంసీలకు గాను 60.28 టీఎంసీలను నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ కేవలం 47 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం. ► వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంసాగర్లో 17.74 టీఎంసీలకుగాను తొలి సారిగా 14.299 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 8.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గండికోట రిజర్వాయర్లో 26.85 టీఎంసీలకుగాను 18 టీఎంసీలు నిల్వ చేశారు. గత ఏడాది ఇక్కడ 12 టీఎంసీలు ఉన్నాయి. పైడిపాళెం రిజర్వాయర్లో 6 టీఎంసీలకుగాను 5.90 టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏటా 45 టీఎంసీలను నిల్వ చేశారు. ► వరద జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వరుసగా రెండో ఏటా ఖరీఫ్లో ఆయకట్టులో కోటి ఎకరాలకు ప్రభుత్వం నీటిని అందించింది. రబీలోనూ రికార్డు స్థాయిలో (గతేడాది రబీలో 22 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు) ఆయకట్టుకు నీటిని అందించే దిశగా అడుగులు వేస్తోంది. యాజమాన్య పద్ధతులతో నీటి వృథాకు అడ్డుకట్ట నీటి విలువ, వ్యవసాయం విలువ, రైతుల శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వల్లే రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగాం. ఖరీఫ్లో ఒక్క ఎకరా ఎండకుండా సుమారు కోటి ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాం. రబీలోనూ రికార్డు స్థాయిలో నీళ్లందించడానికి చర్యలు చేపట్టాం. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జల వనరుల శాఖ -
బ్యారేజీల్లో భారీగా ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్ రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. -
ఏ నిర్వాసితులకైనా ఒక్క పైసా ఇచ్చావా బాబూ!
నెల్లూరు (సెంట్రల్): ‘ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా ఇచ్చావా చంద్రబాబూ? పునరావాసానికి డబ్బివ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? నీళ్లు ఎలా వస్తాయి? గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? కమీషన్ల కోసం కక్కుర్తిపడటమేతప్ప నిర్వాసితులను ఆదుకోవాలని ఆలోచించావా? అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆర్అండ్ఆర్ అంటూ మాట్లాడతావా?..’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస కల్పన (ఆర్అండ్ఆర్) విషయాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ప్రాజెక్టు కింద దాదాపు ఏడువేల కుటుంబాలు ఉంటే చంద్రబాబు హయాంలో ఒక్క కుటుంబాన్నీ తరలించలేదని చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గండికోట ముంపువాసుల కోసం రూ.900 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వెలిగొండకు సంబంధించి ఆర్అండ్ఆర్ కింద రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. చిత్రావతి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యానికి చేర్చేందుకు ఆర్అండ్ఆర్కు రూ.51 కోట్లు ఇచ్చారన్నారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు ప్రాజెక్టు విషయంలో కూడా ఇదేవిధంగా చేయబోతున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కింద వచ్చే మార్చి నాటికి మొదటిదశలో 20 వేల ఇళ్లను తరలించనున్నట్లు తెలిపారు. గండికోట, కండలేరు, వెలుగొండ, చిత్రావతి, పోలవరం మొత్తం ప్రాజెక్టులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తిచేస్తామని చెప్పారు. చంద్రబాబుకు కేంద్ర కేబినెట్ నోట్ చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరంపై 2017లో కేంద్ర కేబినెట్లో పెట్టిన నోట్ సారాంశాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అప్పట్లో కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారే తప్ప పోలవరం అభివృద్ధిపై ఆలోచించలేదని చెప్పారు. కనీసం ఒక్క ఇంటి కన్నా పరిహారం ఇచ్చి తరలించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ఉండలేని వాళ్లు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదని, కొడుకు లోకేశ్ చూస్తే టూరిస్ట్లాగా వచ్చి పోతుంటారని విమర్శించారు. అది ఒక దిక్కుమాలిన పేపర్ పోలవరంపై వరుసగా అసత్య కథనాలు రాస్తున్న చెత్తజ్యోతి ఒక దిక్కుమాలిన పేపర్ అన్నారు. పోలవరం తగ్గిస్తున్నామని అసత్య కథనాలు రాయడం, వెంటనే టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలు పెట్టడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఆ పత్రికకు ధైర్యం ఉంటే 2017లో కేంద్ర కేబినెట్లో పెట్టిన నోట్ను ప్రచురించాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఆ పత్రికకు విలువలు పూర్తిగా పోయాయన్నారు. ఆ పేపర్ టిష్యూ పేపర్గా కూడా పనికి రాదని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీలేదు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, ఒక్క అంగుళం కూడా తగ్గకుండా పూర్తిచేస్తామని అనిల్కుమార్యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు వీళ్లకు ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్లు టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చని పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రారంభమైందని, ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనుకున్న సమయానికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. -
పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు రెండవసారి సవరించిన అంచనా వ్యయానికే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) జారీ చేసేలా కేంద్ర జల్శక్తి శాఖకు ప్రతిపాదన పంపాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే 2021 డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేయనుంది. జాప్యం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని, దీనివల్ల అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తేల్చిచెప్పాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే.. రూ.2,234.77 కోట్లు రీయింబర్స్ చేస్తామనే షరతు విధిస్తూ అక్టోబర్ 12న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి ఎల్కే త్రివేది.. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్కు లేఖ రాశారు. దీనిపై పీపీఏ అభిప్రాయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కోరింది. పీపీఏ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. షరతుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, ప్రత్యేక ఆహ్వానితునిగా సలహాదారు ఎం.వెంకటేశ్వరావు పాల్గొననున్నారు. రూ.20,398.61 కోట్లతో పూర్తి సాధ్యమేనా? కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్న మేరకు రూ.20,398.61 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అని పీపీఏను ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ), ఆర్సీసీ (సవరించిన అంచనా వ్యయ కమిటీ) ఆమోదించిన.. రెండవసారి సవరించిన అంచనా వ్యయంలో భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని తేల్చిన అంశాన్ని గుర్తు చేయనుంది. ఒక్కో జాతీయ ప్రాజెక్టుకు ఒక్కో రకంగానా? కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం జలాశయం పనులు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన, నీటి సరఫరా (కాలువలు, పిల్ల కాలువలు, ఆయకట్టు అభివృద్ధి) మొత్తాన్ని కలిపి నీటిపారుదల విభాగం వ్యయంగా పరిగణించాలి. దేశంలో 16 ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించింది. అన్ని ప్రాజెక్టులకు నీటిపారుదల విభాగం వ్యయాన్ని ఇదే తరహాలో అందిస్తోంది. కానీ పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి నీటిపారుదల విభాగం వ్యయం నుంచి నీటి సరఫరా వ్యయాన్ని తొలగించడం ఎంతవరకు న్యాయమని పీపీఏను నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.. విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేననే అంశాన్ని మరో సారి గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తరఫున, పీపీఏ పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినా, తగ్గినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే అంశాన్ని గుర్తు చేయనుంది. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చే.. 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయానికి పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీ, ఆర్సీసీ ఆమోదం తెలిపాయనే అంశాన్ని ఎత్తిచూపనుంది. ఆర్సీసీ చైర్మన్ జగ్మోహన్ గుప్తా పీపీఏలో సభ్యులని, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పీపీఏ పాలక మండలి చైర్మన్ అని, టీఏసీకీ ఆయనే నేతృత్వం వహించారని.. వారే 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి.. ఇప్పుడు 2013–14 ధరలను తెరపైకి తేవడం భావ్యం కాదని తేల్చిచెప్పనుంది. -
జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), గాలేరు–నగరి కాలువ 56.775 కి.మీ అభివృద్ధి పనుల టెండర్ ప్రతిపాదనకు జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ.. గాలేరు–నగరి కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచేలా వాటికి లైనింగ్ చేయడం, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనులకు సంబంధించిన టెండర్ ప్రతిపాదనకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం తెలిపింది. దాంతో.. ఈ రెండు పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ► పీహెచ్ఆర్ నుంచి బీసీఆర్ వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ అభివృద్ధి పనుల అంచనా వ్యయాన్ని రూ.1,061.69 కోట్లుగా నిర్ణయించింది. ► గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ కాలువలకు లైనింగ్, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనుల అంచనా వ్యయాన్ని రూ.1,269.49 కోట్లుగా నిర్ణయించింది. ► ఈ రెండు పనుల పూర్తికి 36 నెలల గడువు పెట్టింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతోనే టెండర్ నోటిఫికేషన్ను జారీచేయనుంది. ఓపెన్ విధానంలో టెండర్ నిర్వహించనుంది. ► ప్రైస్బిడ్ తెరిచిన తర్వాత.. ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనుంది. -
ఈ శాఖలన్ని ఒకే గూటికి
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన ఎన్నెస్పీ, ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఐడీసీ, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జలవనరుల శాఖగా మార్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆయకట్టు, నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రీ ఆర్గనైజేషన్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయకట్టు, ప్రస్తుతం ఉన్న పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెప్పించుకొని దాని ఆధారంగా రీ ఆర్గనైజేషన్లో తీసుకున్న నియమ నిబంధనల ప్రకారంఅమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆమోదం పొందే విధంగా పనులు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు, ప్రతి నియోజకవర్గాన్ని హద్దుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ఈఈ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాని పరిధిలో 25వేల ఎకరాల వరకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించే విధంగా రూపకల్పన చేశారు. శాఖలన్నింటినీ ఏకం చేసిన తర్వాత ఇంజనీర్లను కేటాయిస్తారు. ఎన్నెస్పీ, ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటి పర్యవేక్షణ వారే చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కేంద్రంగా ఒక సీఈ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎస్ఈలు, ఈఈ, డీఈలు, ఏఈలను కేటాయించే విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా రెండు సీఈ పోస్టులను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పరిధికి ఒక సీఈ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి ఒక సీఈని కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరికొంత ఉంది. ఆ ప్రకారం ఇంజనీర్ పోస్టులను కేటాయించే విధంగా కసరత్తు సాగుతోంది. గతంలో ఉన్న పోస్టులు ఇలా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ శాఖల పరిధిలో ఒక సీఈ, మూడు ఎస్ఈ, 12 మంది ఈఈలు కొనసాగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ఎస్ఈ, ఎన్నెస్పీలో ఒక ఎస్ఈ, ముగ్గురు ఈఈలు, ఐడీసీలో ఒక ఈఈ, మిగిలిన ఈఈలు దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 8 మంది కొనసాగుతున్నారు. ఒకే పరిధిలోకి వస్తే.. ఇరిగేషన్లోని అన్ని శాఖలు ఒకే పరిధిలోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోస్టులను కేటాయిస్తారు. రెండు సీఈ, నాలుగు ఎస్ఈ, లక్ష ఎకరాల ఆయకట్టుకు, నియోజకవర్గ పరిధికి ఒక ఈఈ, 25వేల ఎకరాల ఆయకట్టుకు ఒక డీఈని కేటాయించే అవకాశం ఉంది. -
‘పవర్’కు పంప్హౌస్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. అవసరమైతే వెయ్యి కొత్త పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసో ర్సెస్ డిపార్ట్మెంట్)గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎత్తిపోతల పథకాల అన్ని పంప్హౌస్ల నిర్వహణను విద్యుత్ శాఖకు అప్పగించా లని సీఎం కీలక సూచన చేశారు. జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదాను సీఎంకు అందిం చారు. ఈ ముసాయిదాపై సీఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి ప్రతిరోజూ 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచిం చారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవసీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్ సీలు మురళీధర్రావు, నాగేందర్రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, పలువురు సీఈలు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. ►ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అలా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలి. ►జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఇఇలు, డిఇల పరిధిలను ఖరారు చేయాలి. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు, సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి. ►సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. ►పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సి నుంచి లష్కరు వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంతమంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్సిలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎస్సి జనరల్, ఈఎస్సి అడ్మినిస్ట్రేషన్, ఈఎస్సి ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ►ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీచోటా ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి. ►అన్ని పంప్ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి ►ఉపాధి హామీ పథకం ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. ►ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజులు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి.