
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అక్కడకు వెళ్లనున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్, జెట్ గ్రౌటింగ్ పనులపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, భూసేకరణ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం విజయవాడకు బయల్దేరుతారు. ఈ నెల 22న కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటించనున్నారు.