పరిహారం బాగోతం | officers not distribute compensate | Sakshi
Sakshi News home page

పరిహారం బాగోతం

Published Sat, Mar 8 2014 2:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

officers not distribute compensate

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : 2011 సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించింది. ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. సర్వే చేపట్టి 3.17 లక్షల హెక్టార్లలో 4.07 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.190.28 కోట్ల పంట నష్టం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. 2012లో పంట నష్ట పరిహారం మంజూరైంది. పరిహారం పంపిణీలో  అక్రమాలకు తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాలవారీగా పంట నష్టపోయిన రైతుల ఖాతా నంబర్లు సేకరించి వాటిలో పరిహారం జమ చేయాలని సూచించింది. ఇంతకుముందు పంట నష్టపరిహారం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేది. రైతుల సంఖ్యకు అనుగుణంగా పరిహార వ్యయాన్ని జేడీఏ నుంచి మండల వ్యవసాయ అధికారిఖాతాకు బదిలీ చేసేవారు.

రైతుకు పరిహారాన్ని చెక్కు రూపంలో మండల వ్యవసాయ అధికారి, తహశీల్దార్ జాయింట్ సంతకం చేసి ఇచ్చేవారు. ఈ విధానంలో సర్వే సమయంలోనే అనేక మంది బోగస్ రైతుల పేర్లు జతచేసి పరిహారాన్ని వ్యవసాయ, రెవెన్యూ శాఖా ధికారులు స్వాహా చేసేవారు. అయితే 2012 నుంచి పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు రావడం అధికారులకు మింగుడు పడలేదు. 2012లో మంజూరైన రూ.190 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి ఆ ఏడాదే డిసెంబర్ 12 వరకు 3.60 లక్షల మంది రైతులకు రూ.166 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ఈ చెల్లింపులు నడుస్తుండగానే ప్రభుత్వం నిధుల చెల్లింపులకు సంబంధించి ఫ్రీజింగ్ విధించడంతో మిగతా చెల్లింపులు ప్రభుత్వ ఖజానాలో అంటే ట్రెజరీల్లో నిలిచాయి.

47వేల మంది రైతులకు సంబంధించి రూ.24కోట్ల చెల్లింపులు నిలిచాయి. ఇక్కడివరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత పలువురు రైతులు పరిహారం కోసం ఆందోళన చేయడంతో మిగిలిన రూ. 24 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం మధ్యలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దాదాపుగా 20 వేలకు పైగా రైతులకు సంబంధించి రూ.13.75 లక్షలను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 23 వేలకు పైగా రైతులకు సంబంధించి రూ. 11.25 లక్షల పంట నష్టపరిహారం ట్రెజరీలోనే నిలిచింది. ఆ రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అప్పట్లో వ్యవసాయ శాఖాధికారులు పేర్కొన్నారు. అప్పటికీ పంట నష్టపరిహారం రాని పలువురు రైతులు పరిహారం కోసం ఆందోళన చేయడంతో మరోసారి రైతులకు సంబంధించి గ్రామాలవారీగా బ్యాంక్ ఖాతా నంబర్లను సేకరించారు. దీనికి సంబంధించి రూ.11.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

 రూ.92 లక్షలు మిగులు
 అసలు కథ ఇక్కడే మొదలైంది. 23 వేలకు పైగా పరిహారం పొందాల్సి న రైతులు ఉండగా 22 వేల మందికి రూ.10.20 కోట్లు బ్యాంక్ ఖాతా ల్లో జమ చేశారు. మరో రూ.92లక్షలు అలాగే మిగిలాయి. జాబితాలో పలువురి పేరు ఉన్నా వారి వివరాలు, ఖాతాలు లేకపోవడంతో ఈ డబ్బులు అలాగే మిగిలినట్టు తెలుస్తోంది. సర్వే సమయంలో పరిహా రం నేరుగా అందజేసే క్రమంలో స్వాహా చేద్దామనే ఆలోచనతోనే పలువురు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు బోగస్ రైతుల పేర్లను చేర్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిగిలిన పరిహారానికి సం బంధించి 90 రోజుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం గడువు విధించిం ది.

ఇప్పటికీ 62 రోజులు దాటినా ఆ తతంగం ముందుకు సాగడం లేదు. దీనిని బట్టి 1300 మంది రైతుల పేరు మీద పరిహారం సొమ్మును స్వాహా చేద్దామనుకున్నప్పటికీ వ్యక్తిగత ఖాతాల కారణంగా అడ్డంగా దొరికిపోతామని భావించిన అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఒకవేళ పాత విధానమే అమల్లో ఉంటే ఈ పాటికి ఆ సొమ్ము స్వాహా అయ్యేది. మిగతా రైతులకు సంబంధించి ఖాతా నంబర్లు సేకరించాలని ఆదేశించినా ముందుకు సాగడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement