
బాబు-మోడీ సభకు రూ. 34 వేలే(నా)!
వంద మంది హాజరయ్యే వేడుక ఖర్చే సుమారు లక్ష రూపాయలు ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది హాజరయ్యే కార్యక్రమానికి ఎంత ఖర్చవుతుందో ఊహించగలరా. ఎంత లేదన్న కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. అదేంటో రాజకీయ నాయకులు ఎంత భారీ కార్యక్రమం నిర్వహించిన ఖర్చు వేలకు మించదు. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు. లక్షలాది మంది హాజరైన అగ్ర నాయకుల ఎన్నికల ప్రచార సభలకు ఖర్చు పెట్టింది వేల రూపాయలే అంటూ కాకి లెక్కలు చూపించారు.
గుంటూరులో బీజేపీ అగ్ర నాయకుడు నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార సభకు ఖర్చు పెట్టింది అక్షరాలా 34,350 రూపాయలని ఎంపీగా ఎన్నికైన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తెలిపారు. ఈ మేరకు అవిఢవిట్ లో పేర్కొన్నారు. మోడీతో పోల్చుకుంటే సోనియా సభకు ఖర్చు కొంచెం ఎక్కువైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్న సభకు 50 వేల రూపాయలు ఖర్చయినట్టు పొన్నం ప్రభాకర్ చూపించారు.
'ఖర్చు' విషయంలో మోడీ, సోనియా కంటే టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ అందనంత ఎత్తులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సభలకు రూ.7.17 లక్షలు ఖర్చు చేసినట్టు చేవెళ్ల పారిశ్రామికవేత్త, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ నాయకులు సమర్పించిన కాకి లెక్కలు చూసి జనం నోళ్లు వెళ్లబెడుతున్నారు.