
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజయవాడ జాయింట్ కలెక్టర్ మాధవీ కోరారు. విదేశాల నుంచి దొంగచాటుగా వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె విజ్ఙప్తి చేశారు. వారు బయట తిరిగితే చాలా ప్రమాదమని, వారంతట వారే బయటికొస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోమని అన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై విజయవాడలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని, స్వీయ నియంత్రణ ఒక్కటే మేలైన మార్గమని అన్నారు. (మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ)
ఆమె మాట్లాడుతూ ‘రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు వికేంద్రీకరణ చేపట్టాం. ఆరు రైతు బజార్లను ఇరవై నాలుగుకు పెంచాం. 30 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడి వాళ్ళకు అక్కడే కూరగాయలు అందే సదుపాయం కల్పిస్తున్నాం. రేషన్ సరుకులు ప్రతి ఒక్కరికీ అందజేస్తాం. అందరికీ రేషన్ చేరే వరకు పంపిణి జరుగుతుంది. వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రజల వ్యవహారశైలిలో మార్పు రావాలి’ అని పేర్కొన్నారు. (రైతు బజార్లకు బారులు తీరిన ప్రజలు)
Comments
Please login to add a commentAdd a comment