
సచివాలయ కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి!
ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లను స్తంభింపజేసిన వాన్నా క్రై ర్యాన్సమ్వేర్..
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లను స్తంభింపజేసిన వాన్నా క్రై ర్యాన్సమ్వేర్.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని పలు కంప్యూటర్లనూ తాకినట్లు అనుమానిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిప్యూటీ కార్యదర్శి ఒకరు బుధవారం తన కంప్యూటర్ను ఓపెన్ చేసిన సమయంలో ఈ వైరస్ దాడి వెలుగుచూసింది. తన కంప్యూటర్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే ఐటీ అధికారులను పిలిచానని, వైరస్ దాడి జరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించామని ఆ అధికారి వివరించారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్లోని మరో 9 కంప్యూటర్లలోనూ ఇదే సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే సచివాలయంలో ఏ ఒక్క కంప్యూటరూ ర్యాన్సమ్వేర్ బారిన పడలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ 9 కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను తొలగించినట్లు చెప్పారు.