ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణదారులు బంద్ పాటిస్తున్నారు.
శృంగవరపుకోట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణదారులు బంద్ పాటిస్తున్నారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించరాదని చంద్రబాబు వ్యాఖ్యానించటం ఈ చర్యకు కారణమైంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఎమ్ఆర్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నా నోరుమెదపని చంద్రబాబు.. విజయనగరం జిల్లాపైనే దృష్టి పెట్టటడమేంటని దుకాణాల యజమానుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల మేరకు విక్రయిస్తున్నా..దోషులుగా చిత్రీకరించటం, మాఫియాగా ముద్ర వేయటం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం 27 శాతం కమిషన్గా ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం 18 శాతం మాత్రమే కేటాయిస్తోందని వారు చెబుతున్నారు. బాబు సొంత జిల్లా చిత్తూరులోనే ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. తన వైఖరిని బాబు మార్చుకోకుంటే నిరవధిక బంద్కు సైతం వెనుకాడబోమని వైన్స్ షాపుల యజమానులు హెచ్చరిస్తున్నారు