
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మహిళలను, అభిమానులను పలకరిస్తూ ముందుకు కదిలారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ఎర్రగుంట్ల - ప్రొద్దుటూరు రోడ్డు నుంచి ఆయన ఈరోజు ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి పొట్లదుర్తికి చేరుకునే సరికి వేలాది మంది పాదయాత్రలో జగన్ అడుగులో అడుగయ్యారు.
పొట్లదుర్తిలో జగన్ ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరేశారు. వాల్మీకి - బోయ సంఘాలు పాదయాత్రలో ఆయనను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్బీఎస్కే ఉద్యోగులు, 108 ఉద్యోగులు, వీఆర్ఏల ప్రతినిధులు, ఏపీ ట్రాన్స్కో, జెన్ కో ఉద్యోగులు కలుసుకున్నారు. వారి బాధలు వింటూ, సమస్యలు తెలుసుకున్నారు. జగన్ వారికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే వికలాంగులు, వృద్థులు రాజన్నబిడ్డను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయన అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్కు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు.