
ప్రతి క్లాజునూ ‘తొలగించండి’
- విభజన బిల్లుకు సవరణలు ప్రతిపాదించిన వైఎస్సార్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొన్న క్లాజును ‘తొలగించండి’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఇదే తరహాలో బిల్లులోని మిగతా క్లాజులనూ తొలగించాలంటూ సవరణలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లుతుంది కనుక తాము విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. అందుకే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొంటున్న క్లాజ్ ఒకటి నుంచి ఆరో క్లాజ్ వరకూ, ఆ తర్వాత ఏడో క్లాజ్ నుంచి 108వ క్లాజ్ వరకు ప్రతి క్లాజును తొలగించాలంటూ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్కు సవరణ ప్రతిపాదనలు అందజేశారు.
బిల్లులోని 1 నుంచి 6, 7 నుంచి 108 క్లాజులకు మొత్తంగా సవరణలు ప్రతిపాదిస్తూ పార్టీ ఎమ్మెల్యేలందరూ విడివిడిగా.. నిర్దేశిత ఫార్మాట్లో అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఇదేవిధమైన సవరణను ప్రతిపాదిస్తూ బిల్లులో పొందుపరిచిన ప్రతి క్లాజును ‘తొలగించాలి’ అని సవరించాల్సిందిగా శాసనమండలి చైర్మన్కు నివేదించారు. ఈ క్లాజులను తొలగించాలన్న ప్రతిపాదనకు కారణాలను వివరిస్తూ.. ‘‘రాజ్యాంగ సంప్రదాయాలను, నిబంధనలను పాటించకుండా, మన రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా పూనుకున్న రాష్ట్ర విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను. విభజన జరిగితే మిగిలిపోయే మిగతా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. వనరుల రాబడిలో అన్యాయం జరుగుతుంది.
నీటి జలాల్లో రావాల్సిన వాటాలో హాని జరుగుతుంది. యువకులు ఉపాధి అవకాశాలను కోల్పోతారు. అంతేకాదు.. సామాజిక, విద్యా, వైద్య మౌలిక సదుపాయాలు కూడా కోల్పోతాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న మెజారిటీ ప్రజల విశాల ప్రయోజనాలకు భంగం క లిగిస్తుంది. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచడమే ఉత్తమమని చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా ఈ విభజన జరుగుతోంది కనుక వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.