
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు.
‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ
ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది.