
బంధన్ బ్యాంక్ నికర లాభం రెట్టింపు
ముంబై: బంధన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2016–17) నాలుగో త్రైమాసిక కాలానికి రెట్టింపునకుపైగా పెరిగింది. రూ.323కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది(2015–16) క్యూ4లో లాభం రూ.142 కోట్లు. ఆదాయం పెరగడం, వ్యయాలు తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సిఎస్ ఘోష్ చెప్పారు. రుణాలు 51 శాతం వృద్ధి సాధించడంతో నికర వడ్డీ ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.687 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర ఆదాయం రూ.82 కోట్ల నుంచి రూ.132 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు.
2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,111 కోట్లు చొప్పున నికర లాభం సాధించామని ఘోష్ చెప్పారు. సూక్ష్మ రుణ సంస్థ నుంచి బ్యాంక్గా మారామని, అంతకు ముందటి, గత ఆర్థిక సంవత్సరాల ఫలితాలను పోల్చకూడదని వివరించారు. ప్రస్తుతం 840గా ఉన్న బ్రాంచ్ల సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 1,000కు పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం 24,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను 30,000కు పెంచనున్నామని తెలిపారు.