
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ భారతాన్ని వృద్ధి దిశగా పరుగులు పెట్టించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను శనివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నినాదాన్ని మరోసారి వినిపించిన ఆర్థిక మంత్రి ఆ దిశగా సాగు రంగానికి నిధుల కేటాయింపులు జరిపే ప్రయత్నం చేశారు. రైతుల సంక్షేమానికి 16 సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించి 100 కరువు జిల్లాల కోసం ప్రత్యేక సాయం కోసం ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్కు చేయూత ఇస్తామంటూ చెప్పుకొచ్చారు.
20 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు అందచేస్తామని వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలోనే తమ తొలి ప్రాధాన్యం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి అంటూ ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికి మలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగానే సాగు రంగం బాగు కోసం పలు చర్యలు ప్రకటించారు. బ్యాంకుల ద్వారా రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల జారీకి చర్యలు చేపడతామని చెబుతూ బడ్జెట్లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లను కేటాయించారు. పంచాయితీరాజ్కు రూ 1.23 లక్షల కోట్లు, పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు కేటాయించారు. ఇక ఆరోగ్యరంగానికి రూ 69,000 కోట్లు కేటాయించడంతో పాటు ప్రధాని జనారోగ్య యోజనకు రూ 6400 కోట్లు ప్రకటించారు. (చదవండి: రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?)
Comments
Please login to add a commentAdd a comment