
టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్స్డ్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు
పండుగ సీజన్కు ముందు కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బొనాంజ అందించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : పండుగ సీజన్కు ముందు కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బొనాంజ అందించిన సంగతి తెలిసిందే. పలు వైట్ గూడ్స్ ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించేసింది. దీంతో గృహోపకరణాల ధరలు 8 శాతం నుంచి 10 శాతం తగ్గబోతున్నాయి. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్స్డ్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్ల ధరలు 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. చాలా లగ్జరీ ఉత్పత్తులను దేశీయ గృహ అవసర కేటగిరీ వస్తువులుగా తీసుకొచ్చింది. ఈ ప్రయోజనాలను ప్రస్తుతం కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించాయి. జూలై 28 నుంచి వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 7 శాతం నుంచి 8 శాతం మధ్యలో తగ్గిస్తున్నట్టు గోద్రేజ్ అప్లియెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. మంచి రుతుపవనాలతో, డిమాండ్ కూడా పెరుగుతుందని తెలిపారు.
జూలై 27 నుంచి తగ్గిన జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్నాయి. అయితే జీఎస్టీ రేట్లకు అనుగుణంగా అన్నింటిపై ఒకే విధంగా ధరలు తగ్గించకుండా.. గ్లోబల్ ధరలు పెరగడంతో మెటరీయల్ ఖర్చులు ఎగియడం, రూపాయి క్షీణించడం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని.. గృహోపకరణాలపై తగ్గింపు చేపడతామని కంపెనీ తెలిపాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇతర చిన్న చిన్న ఉపకరణాలను రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రతి ఇంటికి ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. కాగ, వైట్ గూడ్స్పై అంతకముందు 28 శాతం జీఎస్టీ విధించడంతో, వీటి ఎంఆర్పీ ధరలన్నీ అప్పట్లో 10 శాతం నుంచి 15 శాతం పెరిగాయి. త్వరలోనే దివాళి, క్రిస్టమస్ పండుగలు ఉండటంతో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సంస్థలకు ఇది అత్యధిక మొత్తంలో విక్రమయ్యే కాలమని ఇండస్టి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ పండుగ సీజన్కు మరింత సహకరించనుందని పేర్కొంటున్నాయి.