
ముంబై : రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు ఆ కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. జియోఫోన్కు చెందిన 153 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్ను అప్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్గ్రేడ్ చేసిన ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్ని జియో యాప్స్కు ఉచిత సబ్స్క్రిప్షన్ను అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్ వాలిడిటీ అంతకముందు లాగానే 28 రోజులు. రిలయన్స్ జియో అప్గ్రేడ్ చేసిన రూ.153 ప్యాక్ కింద అంతకముందుకు రోజుకు 500 ఎంబీ 4జీ హైస్పీడ్ డేటా మాత్రమే లభ్యమయ్యేది.
జియో ఫోన్ యూజర్లకు అదనంగా మరో రెండు శాచెట్ ప్యాక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒకటి రూ.24 ప్యాక్. దీని కింద రోజుకు 500 ఎంబీ హై స్పీడ్ డేటా, 20 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్ను రెండు రోజుల పాటు లభ్యమవనున్నాయి. రెండోది రూ.54 ప్యాక్. దీని కింద ఏడు రోజుల పాటు పైన పేర్కొన్న ప్రయోజనాలనే ఆఫర్ చేస్తుంది. కానీ ఎస్ఎంఎస్లు 70 వస్తాయి.
జియోఫోన్కు చెందిన రూ.153 ప్రీపెయిడ్ ప్యాక్కు అందించే ప్రయోజనాలే, 4జీ స్మార్ట్ఫోన్లకు చెందిన రూ.149 ప్యాక్పై కూడా జియో అందిస్తోంది. మరో రూ.309 నెలవారీ ప్యాక్ను కూడా జియో ప్రకటించింది. దీని కింద జియోటీవీ, జియో సినిమా వంటి యాప్స్ నుంచి కంటెంట్ను కూడా జియో ఫోన్ యూజర్లు పొందవచ్చు. కాగ, గతేడాది జూలైలో కంపెనీ తన జియోఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.1500 డిపాజిట్ చేసి, ఈ ఫోన్ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని జియో రీఫండ్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment