
న్యూఢిల్లీ: వాహన విక్రయాల మందగమనం దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 39% తగ్గింది. గత క్యూ2లో రూ.2,280 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,391 కోట్లకు తగ్గింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత భారీ తగ్గుదల. ఆదాయం రూ.21,554 కోట్ల నుంచి 25% తగ్గి రూ.16,123 కోట్లకు చేరింది. క్యూ2లో వాహన విక్రయాలు 30% తగ్గి 3,38,317కు చేరాయని కంపెనీ చైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు.
ఎలక్ట్రిక్ కారు ఇప్పుడే కాదు... : ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం తయారీ దశలో ఉందని, విక్రయాల నిమిత్తం ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తెచ్చే అవకాశాల్లేవని భార్గవ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ తోడ్పాటు కూడా తగిన విధంగా లేదన్నారు.